గుజరాత్ దాని గొప్ప సంస్కృతి, పర్యాటక ప్రదేశాలకు ఎంతో ప్రసిద్ధిచెందింది. దేశ చరిత్రను తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని వీక్షించాల్సిందే. ఇక్కడ అనేక చారిత్రక కట్టడాలు, పురాతన కోటలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. చరిత్ర, కళాభిమానుల కోసం, ఇక్కడ అనేక చారిత్రక ప్రదేశాలు దాగి ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. అలాంటి కట్టడాల్లో ఒకటైన ఓ మ్యూజియం గురించే ఇప్పడు మనం మట్లాడుకుంటున్నాం. అదే అహ్మదాబాద్లో ఉన్న లాల్భాయ్ దల్పత్భాయ్ మ్యూజియం.

ఆహ్మదాబాద్లోని ఈ మ్యూజియం ఎంతో పురాతనమైనది మరియు ప్రఖ్యాతిగాంచినది. ఈ మ్యూజియంలో వివిధ భాషలలో 75 వేల మాన్యుస్క్రిప్ట్లు, 45 వేల పుస్తకాల సేకరణను చూడొచ్చు. ఇంకా, ఇప్పటికీ ఆరవ శతాబ్దపు విగ్రహాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.
ఈ మ్యూజియం ఎప్పుడు ప్రారంభమైంది?
లాల్భాయ్ దల్పత్భాయ్ (LD) మ్యూజియం కళ, చరిత్ర ప్రేమికులకు ఒక ప్రత్యేక ప్రదేశమని చెప్పుకోవాలి. ఇది అహ్మదాబాద్లోని ఎల్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీ క్యాంపస్లో ఉంది. ఇది 1956లో ఎల్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీగా ప్రారంభించబడింది. అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త షేత్ కస్తూర్భాయ్ లాల్భాయ్, సాధు ముని పుణ్యవిజయ్జీ దీన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ మ్యూజియం ప్రజల సందర్శనార్థం 1985లో తెరవబడింది. ఇది మొదట్లో చిన్న సేకరణతో ప్రారంభించి, క్రమంగా మ్యూజియంగా అభివృద్ధి చెందింది. ఇది కొత్త భవనంగా రూపాంతరం చెందిన తర్వాత, LD ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీగా ప్రారంభమైన ఈ సేకరణ 1985 సంవత్సరంలో ప్రజలకు తెరవబడింది. ఈ మ్యూజియంలో చోళ సామ్రాజ్యానికి సంబంధించిన 11వ శతాబ్దపు నటరాజ విగ్రహాన్ని చూడవచ్చు. 18వ శతాబ్దానికి చెందిన నేపాలీ, టిబెటన్ సేకరణలు, చైనీస్/జపనీస్ స్టైల్ వార్డ్రోబ్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ కేంద్రాలలో ఒకటిగా నిలుస్తున్నాయి.
45 వేల పుస్తకాలు...
ఇక, ఈ మ్యూజియంలో 1,855 కంటే ఎక్కువ పెయింటింగ్లు ఉన్నాయి. అంతే కాకుండా, సంస్కృతం, పాళీ, గుజరాతీ, హిందీ మరియు రాజస్థానీ మొదలైన భాషలలో వ్రాసిన 45 వేల పుస్తకాలు కూడా ఈ మ్యూజియంలో పొందుపరిచి ఉన్నాయి.
లాల్భాయ్ దల్పత్భాయ్ మ్యూజియంలోని శిల్పాలు, కాంస్య రచనలు, మాన్యుస్క్రిప్ట్లు, పెయింటింగ్లు, రాతి, పాలరాయి, రాగి, కలపతో చేసిన కళాఖండాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవే కాకుండా, ఇక్కడ పురాతన, సమకాలీన నాణేలను కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ జైన మతానికి సంబంధించిన 75 వేల మాన్యుస్క్రిప్ట్లు కూడా ఉన్నాయి. 6వ శతాబ్దానికి చెందిన రాతితో చెక్కబడిన శ్రీరాముని విగ్రహం కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. మధ్యయుగ భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.
కేవలం దీనికోసం ఇక్కడ 9 గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది.ఇంకా ఈ మ్యూజియంలో భారతీయ స్మారక చిహ్నాలు, ప్రకృతి దృశ్యాలు, పత్రాలు, స్కెచ్లు, నాణేలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. లాల్భాయ్ దల్పత్భాయ్ మ్యూజియం గుజరాత్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, కళాత్మక సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక అద్భుతమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మరెందుకాలస్యం మీరు కూడా ఈ మ్యూజియాన్ని తప్పకుండా చూసేయండి మరి.



Click it and Unblock the Notifications














