శృంగేరి భక్తుల పాలిట ఒక పవిత్ర యాత్రా స్థలం. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న శృంగేరి లో జగద్గురు ఆది శంకరాచార్యులు మొదటి మఠాన్ని స్థాపించారు. శృంగేరి కి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
చరిత్ర
ఆది శంకరాచార్యులు దేశాటన చేస్తూ తన శిష్యులతో ఈ ప్రదేశాన్ని పర్యటించారు. అప్పుడు అయన ఒక దివ్య సంఘటన ను చూసారు. ఒక సర్పము ప్రసవించుచున్న ఒక మండూకానికి తన పడగ విప్పు నీడ కల్పించే దృశ్యం ఆయన్ను ఆశ్చర్య పరిచింది. ఆ ప్రదేశం ఎంతో విశిష్టత గల ప్రదేశంగా గుర్తించిన శంకరాచార్య శారదా పీఠాన్ని మొదటిసారి అక్కడ స్థాపించారు. ఆది శంకరాచార్యులు శృంగేరి లో 12 సంవత్సరాల పాటు నివసించినట్లు పురాణ గాథ.

ఒక సర్పము మండూకానికి నీడ కల్పించే దృశ్యం
చిత్ర కృప : Sarvagnya
శృంగేరిలో దర్శించవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు
01. శారదాంబ దేవాలయం
శారదాంబ దేవాలయంను (శారదా దేవి ఆలయం) ఆది శంకరాచార్యుల వారు క్రీ. శ. 7 వ శతాబ్దంలో స్థాపించారు. ఈ దేవత జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇతిహాసాల మేరకు క్రీ. శ. 14వ శతాబ్దంలో పురాతన గంధపు చెక్క విగ్రహం స్ధానంలో బంగారు మరియు రాతి విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడే ఒక లింగం కూడా ఉంటుంది. దీనిని శివుడు శంకరాచార్యులవారికి ప్రసాదించినట్లు చెపుతారు.

శారదాంబ దేవాలయం
చిత్ర కృప : Naveenbm
ఇక్కడ ఒక మహా మండపం ఉంది. దీనిలో ద్వారపాలకులు, మాత దుర్గాదేవి మరియు మాత రాజ రాజేశ్వరి ఉంటారు. పర్యాటకులు అష్టలక్ష్మీ చిత్రాలను ఎనిమిదింటిని ద్వారాలపై బంగారు పూతలతో దర్శించవచ్చు. ఈ దేవాలయంలో నవరాత్రి మరియు చైత్ర శుక్ల పూర్ణిమ లకు వేడుకలు, కార్తీక పౌర్ణమికి దీపోత్సవం, లలితా పంచమి మాఘశుక్ల పంచమి మరియు శారదాంబ రధోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. పర్యాటకులు దేవాలయానికి నైరుతి దిశలో కల శక్తి గణపతిని కూడా దర్శించవచ్చు.

విద్యాశంకర దేవాలయం
చిత్ర కృప : Calvinkrishy
02. విద్యాశంకర దేవాలయం
విద్యాశంకర దేవాలయాన్ని విద్యారణ్య స్వామి అనే మహర్షి నిర్మించాడు. దేవాలయం ద్రవిడ, చాళుక్య, దక్షిణ భారత మరియు విజయనగర శిల్ప శైలులు ప్రదర్శిస్తుంది. దీనిపై అనేక శిలా శాసనాలు విజయనగర రాజ్యానికి సంబంధించి చూడవచ్చు. నలుచదరం కల ఈ దేవాలయానకి 12 స్తంభాలు కలవు. ఇవి 12 రాశులను తెలుపుతాయి.
ఆలయం లోపల దుర్గా మాత, విద్యా గణేశ, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర విగ్రహాలు ఉంటాయి. దేవాలయ సీలింగ్ పైన అందమైన శిల్పకళా చెక్కడాలు మరియు గోడల పై శివ, విష్ణు దశావతారాలు, మాతా కాళీ, షణ్ముఖ మరియు వివిధ జంతువుల చిత్రాలను గమనించవచ్చు.

ఆది శంకర దేవాలయం
03. ఆది శంకర దేవాలయం
ఆది శంకర దేవాలయంలో జగద్గురు శంకరాచార్యుల విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 2 అడుగుల ఎత్తులో ఒక పీఠం పై స్థాపించారు. ఈ విగ్రహం యోగాసనం భంగిమలో సరిగ్గా శివలింగానికి ఎదురుగా ప్రతిష్టించారు. ఆలయంలో పంచామృత అభిషేకం, రుద్ర అభిషేకం, అర్చన వంటివి జరుగుతాయి. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 : 30 వరకు ఆలయాన్ని దర్శించవచ్చు.
శృంగేరి - ఇతర ఆకర్షణలు
శృంగేరి మఠం, కరే ఆంజనేయ దేవాలయం, చెప్పారా ఆంజనేయ దేవాలయం, కిగ్గా, మల్లికార్జున దేవాలయం, మళయాళ బ్రహ్మ దేవాలయం, తోరణ గణపతి దేవాలయం, శ్రీ పార్శ్వనాథ దేవాలయం, నరసింహావనం, తుంగా నది, సిరిమనే జలపాతాలు అనేవి శృంగేరిలో చూడవలసిన ఇతర ఆకర్షణలుగా ఉన్నాయి.

తుంగ నది, శృంగేరి
చిత్ర కృప : Naveenbm
శృంగేరి ఎలా చేరుకోవాలి ?
- వాయు మార్గం : మంగళూరు శృంగేరికి 100 km ల దూరంలో కలదు. ఇక్కడకు బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, గోవా, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి శృంగేరి చేరుకోవచ్చు.
- రైలు మార్గం : ఉడిపి, మంగళూరు రైల్వే స్టేషన్ లు శృంగేరి కి సమీపాన కలవు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైళ్లు వస్తుంటాయి.
- రోడ్డు/ బస్సు మార్గం : ఉడిపి, మంగళూరు, బెంగళూరు, మైసూరు, షిమోగా, చిక్కమగళూరు తదితర ప్రాంతాల నుండి రాష్ట్ర బస్సులతో పాటు ప్రవేట్ బస్సులు శృంగేరి కి నడుస్తాయి.



Click it and Unblock the Notifications














