జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితంలో చివరి 144 రోజులు గడిపిన స్థలమే గాంధీ స్మృతి లేదా గాంధీ స్మృతి మ్యూజియం. గాంధీ స్మృతి ని ప్రారంభంలో బిర్ల హౌస్ లేదా బిర్లా భవనం అని పిలిచేవారు. జనవరి 30, 1948 న నాథూరాం గాడ్సే ద్వారా హత్య చేయబడిన ప్రదేశం కూడా ఇదే.
ఈ ఇంటిని 1971 లో కేంద్ర ప్రభుత్వం చేపట్టి, ఆగష్టు 15, 1973 న ప్రజల సందర్శనార్థం తెరిచారు. మహాత్మా గాంధీని కాల్చిన ఖచ్చితమైన ప్రదేశంలో అమరవీరుని స్థూపం కూడా ఉంది. ఈ మ్యూజియంలో గాంధీ జీవితానికి, మరణానికి స౦బంధించిన అనేక అంశాలు కూడా ఉన్నాయి.
ఈ మ్యూజియంలో అనేక ఛాయాచిత్రాల సేకరణ, ఆయన ఉపయోగించిన పుస్తకాలతో పాటు ఆయన వాడిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. డిల్లీ ని సందర్శించినపుడు గాంధీజీ నివసించిన ఈ స్థలం నిజానికి బిర్లా కుటుంబీకుల నివాస గృహం. ఈ మ్యూజియానికి బైటవైపు స్వస్తిక్ గుర్తుతో, దానిపై ‘ఓం’ గుర్తుఉన్న స్థంభం ఉంది.
శాంత పురుషుడైన గాంధీజీ జీవిత అనుభవాలను తెలుసుకోవాల౦టే మీరు ఈ ప్రాంతాన్ని తప్పక చూడాలి. ఆ ప్రాంతంలోని నిశ్చలమైన వాతావరణమే మరిన్ని రోజులు ఉండేటట్లు ప్రేరేపిస్తుంది. మ్యూజియం రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది, సోమవారాలు, జాతీయ శెలవురోజుల్లో మూసివేయబడి ఉంటుంది.