ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతం లో ఉన్న ఈ కుతుబ్ భవనసముదాయం సుప్రసిద్ధ ఆకర్షణ కుతుబ్ మినార్ మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ( వరల్డ్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించబడిన ఈ ప్రాంతం లో అనేక బానిస రాజవంశానికి చెందిన కట్టడాలు ఉన్నాయి. చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ ప్రదేశం, ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు ఢిల్లీ లోని ఒక మంచి విహార ప్రదేశం. ఇక్కడి ఆసక్తికరమైన స్మారకాల జాబితా -
కుతుబ్ మినార్: ఇది సముదాయంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాణం.72.5 మీటర్ల తో ఇది దేశంలోనే అతి పొడవైన మసీదు శిఖరం.కుతుబ్-ఉద్-దిన్-ఐబక్ చే 1193 మరియు 1368 మధ్యలో విజయ గోపురం గా నిర్మించబడింది.చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ కట్టడం ఒక నిర్మాణ అద్భుతం. భారత దేశం లోనే తప్పక చూడవలసిన కట్టడం.
ఇనుప స్థంభం: మీరు భారత దేశం లోని తుప్పు పట్టని ఇనుప స్థంభం గురించి విని ఉంటే,అది ఈ సముదాయం లోనిదే.చంద్ర గుప్త II విక్రమాదిత్య చేత క్రీ.శ 400 లలో నిర్మించబడ్డ ఈ స్థంభం ఎత్తు ఏడు మీటర్లు. దీని కోసం ఉపయోగించిన తుప్పు రహిత లోహ మిశ్రమం ఢిల్లీ యొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులని తట్టుకుంటూ బలంగా నిలబడి ఈ నాటి లోహశాస్త్రజ్ఞులని సైతం ఆశ్చర్యచకితులని చేస్తున్నది.
అలా-ఇ-మినార్: కుతుబ్ మినార్ కి రెట్టింపు ఎత్తు లో కట్టమని అలా-ఉద్-దిన్-ఖిల్జీ చేత పురమాయించబడిన ఈ గోపురం, అతని మరణంతో 25.4 మీటర్ల వద్దే ఆగిపోయింది.ఈ అసంపూర్ణ అలా-ఇ-మినార్ కూడా ఇదే ప్రాంగణం లో ఉంది.
అలా-ఇ-దర్వాజా: సముదాయంలోని గల కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు కి ప్రవేశ మార్గం గా ఉపయోగించబడిన గుమ్మటం గల చిన్న చతురస్రాకార భవనం అలా-ఇ-దర్వాజా.అందమైన చెక్కిన శిలా తెరలతో,పాలరాయి అలంకరణల తో అలరారుతున్నఈ కట్టడం ఇప్పుడు కుతుబ్ మినార్ కి వెనక భాగం లో ఉంది.
కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు: ప్రాంగణం లోపలి ఈ మసీదు ఢిల్లీ లోని అతి ప్రాచీన మసీదుల్లో ఒకటి. చాలా వరకు శిథిలమైపోయినప్పటికీ, కట్టడం లోని కొన్ని భాగాలు సంక్లిష్టంగా , అందమైన అలంకరణలు, చెక్కడాలతో రమ్యంగా ఉంటుంది.
ఇమాం జామిన్ సమాధి: సికందర్ లోడి పరిపాలనా కాలంలో కుతుబ్ ప్రాంగణంలో గల ఈ మసీదు లో నివసించిన టర్కీ దేశస్థునికి ఈ సమాధి అంకితం చేయబడినది. అలా-ఇ-దర్వాజా పక్కనే ఇది ఉంది.
అలా-ఉద్-దిన్-ఖిల్జీ సమాధి మరియు మదరసా:ఖిల్జీ రాజ వంశ పరిపాలకుడు అలా-ఉద్-దిన్-ఖిల్జీ యొక్క సమాధి మరియు అతని చే నిర్మించబడిన మదరసా ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. క్రీ.శ 1296 నుంచి 1316 కాలం మధ్య ఈ ప్రాంతం నుంచి పరిపాలించిన ఈ చక్రవర్తి ఢిల్లీ కి రెండవ సుల్తాన్.
ఇల్తుమిష్ సమాధి: బానిస రాజవంశ పరిపాలకుడు అయిన ఇల్తుమిష్ సమాధి కూడా ఈ ప్రాంగణం లోనే ఉంది. ఈ స్మారక చిహ్నం పాలరాతితో తయారు చేయబడి గది మధ్య లో ఉన్న ఒక ఎత్తైన వేదిక మీద ఉంది.విస్తారమైన అందమైన చెక్కడాలకి ఇది పేరు గాంచింది.
సుల్తాన్ ఘడి: ఇల్తుమిష్ పెద్ద కొడుకు నసీర్-ఉద్-దీన్ కోసం కట్టబడిన మహమ్మదీయ సమాధి సుల్తాన్ ఘడి. క్రీ.శ. 1231 లో నిర్మించబడిన ఇది బానిస రాజవంశం కాలం నాటి మధ్యయుగ ఢిల్లీ లో భాగం. అయితే, ఇప్పుడు ఇది కుతుబ్ ప్రాంగణంలోని భాగం.అసాధారణమైన ఆకృతితో చావళ్ళతో కోటని తలపించే ఈ ప్రదేశం, హిందూ ముస్లిం భక్తుల చే ఒక సమాధి గా మాత్రమే పరిగణించబడక ఒక పవిత్ర దర్గా వలే పూజలు అందుకుంటుంది. ఆ విధంగా,ఈ పురాతన కట్టడం,భారతదేశ పురావస్తు శాఖ వల్ల గాక ముఖ్యంగా భక్తుల రాక వల్ల చక్కని నిర్వహణ కు నోచుకున్నది.