మైలదుత్తురై అంటే సాహిత్యపరంగా “నెమళ్ళ పట్టణం” అనే అర్ధం ఉంది. మైలదుత్తురై మెయిల్ అంటే నెమలి, ఆడుం అంటే నాట్యం చేయడం, తురై అంటే ప్రదేశం అనే మూడ పదాల కలయిక. “మైలదుత్తురై” పేరుకు గల పురాణ గాథ ప్రకారం పార్వతి ఒక శాపం కారణంగా నెమలి ఆకారం ధరించి, ఈ పట్టణంలో శివుని పూజించింది, అదే ప్రస్తుతం మైలదుత్తురై పట్టణం.
ఈ పట్టణాన్ని గతంలో మయూరం అని సంస్కృతంలో పిలిచేవారు, ఇటీవల సంస్కృతం పేరును తొలగించి మైలదుత్తురై అంటే తమిళంలో “నెమలి పట్టణం” అనే పేరుతో తిరిగి నామకరణం చేసారు. పేరుకు తగినట్లుగానే ప్రస్తుతం మైలదుత్తురై ఒక అధునాతన పట్టణం, అయితే మైలదుత్తురైలో ప్రత్యేకతను చాటేది మాత్రం, దాని బలమైన, లోతైన, ఎదురులేని చరిత్ర.
మైలదుత్తురైలోని మయూరనాథ స్వామి ఆలయం ఈ పురాణగాథను తిరిగి తెలుపుతుంది. శివునికి చెందిన ఈ ఆలయం తన పేరును పట్టణం పేరుతో పంచుకొంది. ఇక్కడి దైవం మయూరనాథర్, కారణం పార్వతి మయూర (నెమలి) రూపంలో శివుని పూజించింది. ఈ పురాణగాధ నిరూపించబడినా, లేకపోయినా, ఈ పేరు మాత్రం సమయంతో పాటుగా నిలబడింది.
సమృద్ధిగా ఆలయాలు – మైలదుత్తురైలోనూ, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు
కావేరినది ఒడ్డున ఉన్న ఈ పట్టణంలో, ఈ ప్రాంతాన్ని తీర్థయాత్ర ప్రదేశంగా మార్చిన పేరొందిన అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి. శ్రీ వదనేశ్వర్ ఆలయం, పునుగిస్వరార్ ఆలయం, గంగై కొండ చోళపురం, శ్రీ పరిమళ రంగనాథస్వామి ఆలయం, శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయం, కురుకైశివన్ ఆలయం, దక్షిణామూర్తి ఆలయం వంటి ఆలయాలు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఒక్కొక్క గ్రహానికి ఒకటి చొప్పున తొమ్మిది ఆలయాలు క్రమం తప్పక భక్తులు వెళ్ళే ఒక తీర్థయాత్రా వలయాన్ని ఏర్పాటు చేస్తాయి.
మైలదుత్తురై చుట్టూ ఉన్న సూర్యనార్ కోయిల్, తింగలూర్, వైదీశ్వరన్ కోయిల్, తిరువెంకాడు, అలంగుడి, కంజనూర్, తిరునల్లరు, తిరునాగేశ్వరం, కీళ్ పెరుంపళ్ళం ఆలయాలు ఈ తీర్థయాత్రా వలయంలో భాగాలే. మైలదుత్తురై పశ్చిమాన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యనార్ కోయిల్ ఈ వలయంలోని కేంద్రం, దీని చుట్టూ మిగిలిన అన్ని ఆలయాలను నిర్మించారు.
ఈ ఆలయం సూర్య భగవానుడు, అతని భార్యలు ఛాయ, సువర్చలకు చెందినది. మైలదుత్తురై పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తింగలూరులోని దైవం చంద్రుడు మానసిక సమస్యలతో బాధపడే భక్తులకు సహాయం చేస్తాడని అంటారు. తీర్థయాత్రికులు తమ బాధలు, మానసిక ఒత్తిడులను దూరం చేసుకోవడానికి ఇక్కడకు వస్తారు. మైలదుత్తురై తూర్పున 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్ రావణుని చేతిలో మరణించిన జటాయువు మోక్షాన్ని పొందిన పవిత్ర ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఆయనను దహనసంస్కారం చేసిన ప్రదేశాన్ని ప్రస్తుతం “జటాయుకుండం” అని పిలుస్తున్నారు. శివునికి చెందిన ఈ ఆలయం భక్తుల వ్యాధులను నయం చేస్తుందని విశ్వసిస్తారు.
ఈ ఆలయం నాడి జ్యోతిషం పేరుతో జాతకాన్ని తెలిపే జ్యోతిష్యులకు చెందిన నిలయంగా ప్రసిద్ధి చెందింది. మైలదుత్తురై నుండి తూర్పున 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువెంకాడుని, శైవ తిరుమురై అని కూడా అంటారు. కాశిలోలాగే తిరువెంకాడులో అనేక ఘాట్లు ఉన్నాయి. విద్యార్ధులు వారు కోరుకొన్న ఫలితాల కోసం ఈ ఆలయానికి వస్తారు. మైలదుత్తురై నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురు గ్రహానికి చెందిన అలంగుడి ఆలయంలో నియమం ప్రకారం ఉండే విగ్రహరూపానికి బదులుగా ఇక్కడ దేవుని బొమ్మను గోడపైన చెక్కడం వలన ఈ ఆలయం అటువంటి కొన్ని ఆలయాలలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకొంది. కంజనూర్, సురియనర్ కోయిల్ కు దగ్గరగా మైలదుత్తురై నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుక్ర గ్రహానికి చెందిన ఆలయం. శుక్ర దేవుని అనుగ్రహం వలన సిరి సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
మైలదుత్తురై తూర్పు ప్రాంత౦ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునల్లారు కేవలం శనిదేవునికి మాత్రమే చెందిన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కూడా రెండు పేర్ల కలయిక ( నల + అరు). నలమహారాజు శని గ్రహం లేదా శని దేవుని ప్రభావం వలన పడిన ఇబ్బందుల నుండి బయటపడినందున ఈ ఆలయానికి నల మహారాజు పేరును పెట్టారు. ఇక్కడి పవిత్ర నల తీర్థంలో మునక వేసినట్లయితే పాప విముక్తి లేదా శని ప్రభావం వలన ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
కుంబకోణం దగ్గరలోని తిరునగేశ్వరం శివునికి చెందినది. ప్రతిరోజు ఇక్కడ రాహుకాలంలో రాహుదేవునికి జరిగే క్షీరాభిషేకం దానికదే ఒక అద్భుతంగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహంపై నుండి పాలు పోసినప్పుడు తెల్లగా ఉంటాయి, విగ్రహా౦ నుండి ప్రవహిస్తూ నీలి రంగుని పొంది నేలను చేరగానే తిరిగి తెల్లగా మారతాయి.
రాహుదేవుడు తన భార్యలతో కనబడే కొన్ని ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. తిరువెంకాడుకు దగ్గరగా ఉన్న కీళ్ పెరుమ్పళ్ళం కేతువుకు చెందినది. వనగిరిగా కూడా పేరు కల్గిన ఈ ఆలయంలో కేతుదేవుని విగ్రహం పాము శిరస్సును, రాక్షసుని దేహాన్ని కల్గి ఉంటుంది. కేతువు తన పాపాలకు పశ్చాత్తాపంగా శివుని పూజించాడని విశ్వసిస్తారు. అందువలన ఈ విగ్రహం ముకుళిత హస్తాలతో నాగనాథర్ (శివుడు) ను పూజిస్తునట్లుగా ఉంటుంది.
తొమ్మిది గ్రహాల అనుగ్రహం పొందటానికి భక్తులు క్రమం తప్పక ఈ నవగ్రహ తీర్థయాత్రను చేస్తారు. ఈ గ్రహాలను శాంతింప చేయడం వలన దీర్ఘాయుష్షు, సుఖ, సంతోషాలు, సౌభాగ్యం జీవితాంతం ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
మైలదుత్తురై – నవీన శిలాయుగపు తమిళనాడు, హరప్పా నాగరికతల మధ్య అనుసంధానం
ఒక స్కూల్ టీచర్ వి. షణ్ముగనాథన్ ఫిబ్రవరి 2006 లో తన పెరట్లో ఒక చిన్న గుంతను తవ్వినప్పుడు అతను కేవలం కొంత మట్టి వస్తుందని మాత్రమే ఆశించి ఉంటాడు, కాని చరిత్రతో ఒక అరుదైన సంబంధం మాత్రం కాదు. పురావస్తు శాస్త్రం పై తనకున్న జ్ఞానంతో వి. షణ్ముగనాథన్ వేర్వేరు కాలాలకు చెందిన రెండు రాతి ఆకారాలను గుర్తించాడు. సింధు నాగరికత శాసనాలతో నవీనశిలాయుగం, ( చేతిలో గొడ్డలి) రాతి ఆకారాన్ని బట్టి తమిళనాడులోని నవీన శిలాయుగం ప్రజలు సింధు భాషను హరప్పా నాగరికత ప్రజలతో పంచుకున్నారని నిర్ధారించారు.
ఇటువంటి పురావస్తు తవ్వకాలు అరుదుగా జరుగుతుంటాయి మైలదుత్తురై వంటి ప్రాంత౦లో ప్రాముఖ్యత కల్గిన ఏదో ఒక విషయాన్ని కనుగొనడం అది కూడా చారిత్రిక గణనీయ అంశాలు కావడం కూడా ఎంతో ప్రాధాన్యత కల్గిన విషయమే. మైలదుత్తురై, వాస్తవానికి చారిత్రిక అన్వేషకులకు బంగారు కుండ వంటిది. “ఆయిరం అనాలం మయురం”
అని తమిళంలో అన్నట్లు “వేర్వేరు ప్రత్యేకతలు ఒక వెయ్యి కల్గిన వేర్వేరు ఒక వెయ్యి ప్రాంతాలు కూడా మయూరంతో పోల్చలేము” అన్న విషయం చారిత్రిక, సమకాలీన జీవిత సంగమాలతో సంబంధించిన అతి వాస్తవమైన విషయం.
మైలదుత్తురై చేరడం ఎలా
మైలదుత్తురైను రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులువుగా చేరవచ్చు.
మైలదుత్తురై సందర్శనకు ఉత్తమ సమయం
శీతాకాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.