మన దేశం లో నాగాలాండ్ అతి సుందరమైన రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకూ చూడని అటవీ ప్రదేశాలు అనేకం. ఇక్కడకల అటవీ నివాసులు ఈ ప్రదేశాలను పవిత్రంగా చూసుకుంటారు. పీరెన్ కు పడమటి వైపున అస్సాం మరియు దిమాపూర్ జిల్లాలు, తూర్పు వైపున కొహిమ జిల్లా, దక్షిణమున మణిపూర్ రాష్ట్రం సరిహద్దులుగా కలవు. పీరెన్ పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్స్ గా వుండి అందమైన దృశ్యాలతో ప్రకృతి ప్రియులకు స్వర్గంగా వుంటుంది. పర్వత శ్రేణు లపై కల ఈ పట్టణం, పొరుగునే కల అస్సాం, మణిపూర్ రాష్ట్రాలను దూరం నుండి చూపుతుంది.
పీరెన్ సహజ అందాలు
పీరెన్ జిల్లా బరైలీ శ్రేణులలో భాగంగా వుండి ప్రకృతిచే ఆశీర్వదించబడింది. ఈ జిల్లాలో దట్టమైన వృక్ష సంపద, గల గల పారే నదులు, వివిధ రకాల జంతువులు, పక్షులు కలవు. ఉప ఉష్ణమండల వాతావరణం నెలకొని వుంటుంది. పైన్, యూకలిప్టస్, మరియు వివిధ తోటలతో పాటు, కేను మరియు వెదురు చెట్లు కూడా దట్టంగా వుంటాయి. ఈ జిల్లాలో పుష్కలమైన ఖనిజ సంపద కూడా కలదు. ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఎంతన్గ్కి నేషనల్ పార్క్, మౌంట్ పవోన, మౌంట్ కీసా, బెన్ రూయి, పుఇల్వా విలేజ్ లో ని గుహలు ప్రసిద్ధి చెందినవి.
బ్రిటిష్ వారి దాడి.
ఇక్కడ కల జీలింగ్స్ తెగ వారు వారి స్వంత సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ వుండటంతో చరిత్ర లో చాలా మేరకు ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతలో వుండి పోయింది. 1879 సంవత్సరంలో బ్రిటిష్ వారు కొహిమాను ఆక్రమించిన తర్వాత నాగాలాండ్ లోని ఈ ప్రాంత ప్రజలపై అధికారం చూపారు.
ఆ వెంటనే, అక్కడ రోడ్లు వేయటం, వార్తా సౌకర్యాలు నెలకొల్పటం చేసి, ఈ ప్రాంతాన్ని కొహిమా మరియు దిమాపూర్ లకు అనుసంధానం చేసారు. దీనితో పీరెన్ చుట్టుపక్కల కల గ్రామాలు, టవున్ ల ప్రజలు ఇక్కడకు వచ్చి తమ వాణిజ్యం చేసారు.
పీరెన్ ప్రజల సంస్కృతి
పేరెన్ టవున్ మరియు జిల్లాలో అధికంగా జీలింగ్స్ తెగ ప్రజలు నివసిస్తారు. వీరు మణిపూర్ లోని సేనాపతి జిల్లా నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరిని కాచా నాగాలు అనేవారు. బ్రిటిష్ రాజ్య కాలంలో వీరు వ్యవసాయం చేసేవారు. నాగాలాండ్ లో పీరెన్ ప్రాంత భూమి చాలా సారవంతమైనది. ఈ జీలింగ్స్ తెగ వాసులకు వారి ఆచార వ్యహారాలు పూర్వీకుల నుండి సంక్రమించాయి. నాగా లోని అన్ని ప్రధాన తెగల వలెనె వీరికి కూడా విభిన్న కళలు, ఆహారాలు, డాన్స్ లు, సంగీతాలు వుండి రాష్ట్రం లో ఒక ఆకర్షిత తెగగా కనపడతారు.
బ్రిటిష్ వారు తమతో పాటు కొంతమంది క్రైస్తవ మిషనరీ లను ఇక్కడకు తేవటంతో ఈ ప్రాంత సంస్కృతి, జీవన విధాలలో మార్పు వచ్చింది. కొహిమ మిషన్ సెంటర్ ప్రధాన పాత్ర వహించటం తో ఈ ప్రాంతం క్రైస్తవ మతానికి చాలా వరకు మారింది. మిమ్కూట్ అనే పంటల పండుగ, చేగాగది, హెవ ఫెస్టివల్ , మరియు నాగా వీరులను గౌరవించే చాగా నీగీ వేడుకలతో పాటు గా క్రిస్టమస్ పండుగ కూడా ఘనంగా జరుపుకుంటారు.
ప్రాంతం లోపలి భాగాలలోకి వెళ్లేందుకు అనుమతి
నాగాలాండ్ పర్యటించే టూరిస్టులు ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక సింపుల్ ట్రావెల్ డాక్యుమెంట్ పొందాలి. దీనిని న్యూ ఢిల్లీ, కలకత్తా, గౌహతి లేదా షిల్లాంగ్ ల లోని నాగాలాండ్ హౌస్, నుండి తేలికగా పొందవచ్చు . లేదా టూరిస్టులు మోకక్చుంగ్, దిమాపూర్, కొహిమ లలోని డిప్యూటీ కమిషనర్ ల వద్ద నుండి కూడా అనుమతి పొందవచ్చు. విదేశీయులకు ఈ పర్మిట్ అవసరం లేదు. అయితే వారు జిల్లా లోని విదేశీ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి.