వైశాలి బీహార్ రాష్ట్రం లో ఒక ప్రధాన జిల్లా మరియు జిల్లా ముఖ్య పట్టణం. వైశాలి పట్టణానికి ఎంతో బరువైన చరిత్ర ఉంది. జైన మత తీర్ధంకులలో 24 వ తీర్ధంకుడు మరియు ఆఖరి తీర్ధంకరుడైన వర్ధమాన మహావీరుని జననం వైశాలి నగరం లోనే జరిగింది. గౌతమ బుద్ధుడు ఈ ప్రదేశంలో భోధనాలు చేయడం, వర్ధమాన మహావీరుని జననం ఇక్కడ జరిగినందున, ఈ నగరం అనేక రకాలుగా ప్రాముఖ్యత సంతరించుకున్నది.
ఇక్కడ ఒక ఇటుక స్తూప పక్కన నిర్మించిన పెద్ద స్తంభం బుద్ధుని చివరి ప్రసంగాన్ని మరియు రాబోయే అతని నిర్వానాన్ని చాటుతుంది. మతం, సంస్కృతి, పురావస్తు అంశాలతో ముడిపడి ఉన్న వైశాలి లో రాతి శిల్పాలు, చేతితో చేసిన వస్తువులు ఇంకా అధికంగానే ఉన్నాయి. వైశాలి నగరం లో కొన్ని ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాలను ఒకసారి గమనించినట్లయితే ...
అశోక స్తంభం లేదా అశోక పిల్లర్
బౌద్ధ మతాన్ని స్వీకరించి, ఆ మత వ్యాప్తికి పాటుపడిన అశోకుడు వైశాలి నగరం లో తన పేరుతో ఒక స్థూపాన్ని నిర్మించినాడు దానినే అశోక స్తంభం అని, సింహ స్తంభం అని అంటారు. దీనిని నిర్మించి అశోకుడు బౌద్ధ మతం పట్ల తనకున్న గౌరవాన్ని ప్రకటించుకున్నాడు. రెడ్ ఇసుక రాయి తో నిర్మించిన ఈ స్తంభం పైభాగాన గంట ఆకారం ఒకటి కనిపిస్తుంది. ఇది 18.3 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
Photo Courtesy: telugu native planet
వైశాలి మ్యూజియం
వైశాలి మ్యూజియంలో, వైశాలిలో తవ్వకాలలో బయటపడిన పురావస్తు వస్తువులు ఉంచబడ్డాయి. ఈ మ్యూజియంలో బుద్ధునికి సంభంధించిన విలువైన వస్తువులు అంటే కిరీటం, నెక్లెస్ మరియి విలువైన ఆభారాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తల లేని బుద్ధుని శిల్పం తో పాటుగా విగ్రహాలు, అనేక జంతువుల శిల్పాలు చూడవచ్చు. సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి వస్తువులు నేటికి చెక్కుచెదరకుండా జాగ్రత్తగా భద్రపరిచారు.
Photo Courtesy: Tan
వరల్డ్ పీస్ పగోడ
ఈ వరల్డ్ పీస్ పగోడ ని విశ్వ శాంతి స్థూపం అని అంటారు. వైశాలి లో ఉన్న మొత్తం పర్యాటక కేంద్రాలలో ఇది ప్రత్యేకమైనది. దీనిని జపాన్ కి చెందిన బౌద్ధ ప్రచారకులు నిర్మించినారు. ఈ పగోడ స్థూపం 125 అడుగుల పొడవు తో ఒక డోమ్ కలిగి, 65 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది బుద్ధుని అవశేషాల మీద నిర్మించిన స్థూపం అని భావిస్తున్నారు.
Photo Courtesy: Rakesh Ranjan
ఆనంద స్థూప
ఆనంద స్థూపాన్ని బుద్ధుని ప్రధాన శిష్యుడు ఆనందుని జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈ ఆనంద స్థూప సమీపంలోనే ఆయన సమాధి కూడా ఉంది. ఆయన ఆస్థికలను స్థూపం నిర్మాణం లో ఉంచారు.
Photo Courtesy: telugu native planet
కరో నేషన్ ట్యాంక్
కరో నేషన్ ట్యాంక్ ఒక చెరువు దీనినే అభిషేక పుష్కరిణి అంటారు. ఈ ట్యాంక్ చుట్టూ వివిధ రకాలైన ఔషధ మొక్కలు, పుష్పాలు మరియు వృక్షాలు ఉంటాయి. ఈ ట్యాంక్ ఎంతో పవిత్రమైనది. పూర్వం వైశాలి పాలకులు పట్టాభిషేకానికి ముందు ఈ ట్యాంక్ లో స్నానం చేసేవారట.
Photo Courtesy: telugu native planet
బుద్ధి మాయి
ఈ ప్రదేశం అతి గొప్ప సంస్కృతి మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగినది. హరౌళి లో ఇది ఒక ప్రధాన ప్రార్ధన స్థలం. దీనిలో బుద్ధి మాయి మాత దేవతగా వుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే బుద్ధి మాయి ఉత్సవాలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.
Photo Courtesy: Vickymesingh
కుతగారసల విహార
కుతగారసల విహార లో బుద్ధుడు వైశాలి సందర్శనలో తరచుగా తన నివాసంగా చేసుకొనేవాడు.
Photo Courtesy: telugu native planet
రాంచూర
వైశాలిలోకల రాంచూర ప్రదేశంలో మీరు శ్రీ రాముడి అడుగు జాడలు చూడవచ్చు. ఆయన జానక పూర్ వెళ్ళేటపుడు రాంచూర లో ఆగి అక్కడ స్నానం చేసినపుడు ఏర్పడిన ఆయన పాద ముద్రలు చూడవచ్చు. బీహార్ లోని ఈ ప్రధాన ప్రదేశం రామాయణలో కూడా చెప్పబడింది. ఇక్కడ శ్రీ రామ నవమి ఉత్సవాలు అతి వైభవంగా చేస్తారు.
Photo Courtesy: bihar tourism
లిచ్చావి
లిచ్చావి పూర్వం వైశాలి రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇక్కడ మీరు పార్లమెంట్ హౌస్ చూడవచ్చు. అదేంటి పార్లమెంట్ హౌస్ ఢిల్లీలో కదా ఉంది ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా ..! అదేం లేదండీ, ఇక్కడ అప్పట్లో వైశాలి రాజులు ఈ హౌస్ లో నే కూర్చొని చట్టాలు, శాశాన విధులు, రాజకీయ చర్చలు జరిపేవారు. లిచ్చావి లో రాజ్ విశాల్ కా ఘర్ కూడా ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.
Photo Courtesy: Neilsatyam
స్మారక స్థూపం
వైశాలి లో ఉన్న స్మారక స్థూపాన్ని బౌద్ధ మత వ్యాప్తి కి కృషి చేసిన ఒక అధ్యాత్మికుడి జ్ఞాప్తిగా నిర్మించారు. బుద్ధుడి అస్తికలపై నిర్మించిన ఎనిమిది స్తూపాలలో ఇదిఒకటి. దీనిని స్తూప 1 అని అంటారు. మొదట్లో ఇది మట్టితో 8.07 మీటర్ల వెడల్పు తో తయారు చేసారు. చరిత్రకారులమేరకు ఈ స్మాక స్తూపం సుమారు క్రి.పూ. 5 వ శతాబ్దం నాటిది.
Photo Courtesy: telugu native planet
వైశాలికి ఎలా చేరుకోవాలి ?
బస్సు మార్గం
వైశాలి నుండి పాట్నా మరియు ఉత్తర బీహార్ లోని అనేక ప్రదేశాలకు బస్సులు ఉన్నాయి. పాట్నా నుండి వైశాలికి తరచూ టూరిస్ట్ కోచ్ లు నడుస్తుంటాయి.
రైలు మార్గం
వైశాలికి హాజీపూర్ సమీప రైల్వే స్టేషన్. ఇది వైశాలికి 35 కి. మీ. దూరం లో ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై మొదలైన నగరాలకు సులభంగా చేరుకోవచ్చు.
విమాన మార్గం
వైశాలి నగరానికి విమానాశ్రయం లేదు దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం పాట్నా లో ఉంది. వైశాలి నుండి పాట్నా 70 కి. మీ. దూరంలో ఉంది. ఈ ఏర్ పోర్ట్ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు.
Photo Courtesy: bihar tourism