డిచ్ పల్లి .. దీనినే 'దక్షిణ భారత దేశ ఖజురహో' అని అభివర్ణిస్తారు చరిత్రకారులు. డిచ్ పల్లి లో రామాలయం ఫేమస్. దీనినే 'ఇందూరు ఖజురహో' గా కూడా పిలుస్తారు. దేవాలయ శిల్ప సంపద అచ్చం ఖజురహో ను పోలి ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఎన్నో విశిష్టతల దివ్యక్షేత్రం - వేములవాడ !
డిచ్ పల్లి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కలదు. నిజామాబాద్ పట్టణం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిచ్ పల్లి లో క్రీ.శ. 14 వ శతాబ్దంలో నిర్మించబడిన రామాలయం కలదు. దీనిని కాకతీయలు నిర్మించినట్లు చెబుతారు. ఒక గుట్టపై నెలకొని ఉన్న ఆలయం పైకి చేరుకోవటానికి మెట్లు చిన్నగా, ఎక్కటానికి వీలుగా ఉంటాయి.
ఖిల్లా రామాలయం ముఖ చిత్రం
చిత్ర కృప : pullurinaveen
ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి చూడటానికి చిన్నదే అయినప్పటికీ శిల్ప, వాస్తు కళలు అద్భుతంగా ఉంటాయి. ఆలయ గోడలు, పై కప్పు, ద్వారాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
ఖిల్లా రామాలయం అద్భుత శిల్ప, వాస్తు కళలు
చిత్ర కృప : Nizamabad District
నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆలయం పై తురుష్కులు దాడి చేశారు. శిల్ప సంపద ను ధ్వంసం చేశారు. ఆలయం అసంపూర్తిగానే మిగిలింది. దాంతో ఈ గుడి కి రావాల్సిన ప్రాముఖ్యత రాలేదు. క్రీ. శ. 19 వ శతాబ్దంలో ఓ భక్తుడు దేవాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించటానికి ముందుకొచ్చాడు. తురుష్కుల దండయాత్ర తరువాత అంత వరకు గుడిలో ఎటువంటి విగ్రహాలు ఉండేవి కావు.
శ్రీసీతారామ మరియు లక్ష్మణ విగ్రహాలు
చిత్ర కృప : Naveen Dichpally
నలుపు తెలుపు అగ్గి రాయితో నిర్మించిన ఈ ఆలయం పైభాగాన లతలు, తీగలు, శిల్ప సంపద ను గమనిస్తే ఆనాటి శిల్పుల పనితనానికి మెచ్చుకోక చెప్పవచ్చు. ఆలయం పైన శిల్పాలు హొయలొలుకుతూ ఖజురహో ను గుర్తుకుతెస్తాయి. దేవాలయంలోకి అడుగుపెట్టగానే భక్తుల మనసు ఆధ్యాత్మిక భావంతో పులకరిస్తుంది. ఆలయానికి దక్షిణాన కోనేరు, దాని మధ్య ఒక మండపం ఉన్నాయి.
కోనేరు, దాని మధ్య ఒక మండపం
చిత్ర కృప : Nizamabad District
ఆర్మూర్ రాక్ ఫార్మేషన్
డిచ్ పల్లి నుండి నిర్మల్ కు వెళ్లే మార్గంలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న నల్లటి రాళ్ల కొండ ఒకటి కనిపిస్తుంది. ఈ గ్రామం పేరు ఆర్మూర్. డిచ్ పల్లి కి 25 కి.మీ ల దూరంలో, నిజామాబాద్ నుండి 27 కి.మీ ల దూరంలో ఉంది. కొండ పై కి చేరుకోవటానికి సిమెంట్ రోడ్డు కలదు. కొండ పైన గుహలో నవనాధ సిద్దేశ్వర దేవాలయం కలదు.
నవనాధ సిద్దేశ్వర దేవాలయం
చిత్ర కృప : Nizamabad District
శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం
శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం నిజామాబాద్ ఎంట్రెన్స్ లో కలదు. ప్రతిరోజూ, ప్రత్యేకించి సోమవారాల్లో శివ భగవానుడిని దర్శించుకోవటానికి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. దీనిని శాతవాహన వంశానికి చెందిన శాతకర్ణి -2 నిర్మించెను. దేవాలయ శిల్ప శైలి నార్త్ ఇండియన్ శిల్ప శైలిని పోలి ఉంటుంది.
డిచ్ పల్లి కి సమీప నగరాలు : నిజామాబాద్ సిటీ, బోధన్ సిటీ, కామారెడ్డి సిటీ, నిర్మల్ సిటీ
శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం
చిత్ర కృప : TS Tourism
డిచ్ పల్లి సమీప సందర్శనీయ ప్రదేశాలు
సుద్దులం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, యానాం పల్లె లో కొండా పై వెలసిన శివుడు, నర్సింగ్ పూర్ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, ఇందల్వాయి సీతారామచంద్ర దేవాలయం, గన్నారం శివ, హనుమాన్ దేవాలయాలు చూడదగ్గవి.
డిచ్ పల్లి ఎలా చేరుకోవాలి ?
నిజామాబాద్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో డిచ్ పల్లి కలదు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి.
నిజామాబాద్ చేరుకున్నాక, అక్కడి నుండి డిచ్ పల్లి కి బస్సులు, ఆటోలు తిరుగుతాయి. తెలుగువారు గర్వించదగ్గ శిల్ప సంపద ఇక్కడ కలదు.