సందడిగా ఉండే దుకాణాలు, క్రిక్కిరిసిన రోడ్లు, ఆకాశ హర్మ్యాలతో, సమకాలీన భారతదేశానికి బెంగళూరు ఒక కొత్త ముఖాన్ని ఇచ్చింది – యువతర౦ తనను తాను ప్రతిబింబించుకునేలా. విజయనగర సామ్రాజ్యపు సామంత రాజు కెంపెగౌడ 1537వ సంవత్సరంలో ప్రస్తుతం ఆధునిక బెంగుళూరుగా పిలవబడుతున్న ప్రదేశంలో పెద్ద పట్టణం ఏర్పాటుచేసారు.
నగరం గురించిన కొన్ని మౌలిక వాస్తవాలు :
బెంగళూరుని మొదట పశ్చిమ గంగ రాజులు, తరువాత హోయసల రాజులు పాలించారు. తరువాత ఆ ప్రాంతాన్ని హైదర్ అలీ, ఆ తరువాత అతని కుమారుడు టిప్పుసుల్తాన్ పరిపాలించారు. ఒకప్పుడు బెండకలూరు అని, తరువాత ఆంగ్లీకరణలో బాన్గలోర్ అని, ఇప్పుడు అధికారికంగా బెంగళూరు అని పిలవబడుతుంది.
ఈ నగరం గతంలో భారతదేశం యొక్క గార్డెన్ సిటీ గా పిలువబడింది, సాంకేతిక విప్లవం లో ప్రధాన కేంద్రంగా తన స్థాయి వల్ల ఇపుడు భారతదేశం యొక్క సిలికాన్ వ్యాలిగా పిలువబడుతోంది.
బెంగళూరు ఆగ్నేయ కర్నాటకలో, డెక్కన్ పీఠభూమి కి గుండెకాయ లాంటి మైసూరు పీఠభూమి లో నెలకొని వుంది. 741 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, 5.8 మిలియన్ జనాభా కలిగిఉంది (మూడవ అత్యధిక జనాభా కలిగిన నగరం). సముద్రమట్టానికి 3113 అడుగులు (949 మీ) ఎత్తులో వుండటంవల్ల, ఈ నగరం ఒక ఆహ్లాద కరమైన వాతావరణాన్ని కలిగివుంటుంది.
ఉష్ణమండల వాతావరణ౦ వల్ల నగరంలో తరచుగా పడే వర్షాలతో పాటు వెచ్చని వేసవికాలం, చలిగా వుందే శీతాకాలాలను కలిగివుంటుంది. తన ఆహ్లాద కరమైన వాతావరణం వల్ల అన్ని రంగాల్లోని విశ్రాంత ఉద్యోగులు ఇక్కడికి ఆకర్షింప బడటంతో దీన్ని పెంషనర్ల స్వర్గధామం గా పిలిచే వారు. ఇక్కడి ఉష్ణోగ్రత సాధారణంగా వేసవిలో 20 డిగ్రీల నుండి 36 డిగ్రీల మధ్య, శీతాకాలంలో 17 డిగ్రీల నుండి 27 డిగ్రీల వరకు వుంటుంది.
అనుసంధానం - ప్రయాణ సౌకర్యం :
ఈ నగరం చాలా బాగా అనుసంధానించబడి వుండడం వల్ల నగరం లోకి, పరిసరాలకీ ప్రయాణాలు చాలా సులభంగా ఉంటాయి. నగరం లోపల ప్రయాణం చేయడానికి ప్రజలు బస్సులు, ఆటో రిక్షాలు, కాబ్స్, ఇంకా మెట్రో రైళ్ళు(ఇది విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు) పై ఆధారపడుతున్నారు. వాయు వజ్ర బస్సులు విమానాశ్రయానికి నగరాన్ని కలుపుతాయి. బెంగళూరు రోడ్డు, రైలు, విమానాల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.
బెంగళూరు భారతదేశంలోని నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం, దీని చుట్టూ ఇంకొన్ని రైల్వే స్టేషన్లు వున్నాయి - సిటీ సెంట్రల్, యశ్వంతపూర్, కంటోన్మెంట్, కే.ఆర్ పురం లాంటివి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో వున్నదేవనహళ్లి లోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.
స్థానిక సంస్కృతి, వారసత్వ౦
బెంగళూరు ఒక బహుళ సాంస్కృతిక నగరం అయినప్పటికీ, ఎక్కువమంది హిందూ మతావలంబులు. బెంగళూరులో స్థిరపడిన వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడి కాస్మోపాలిటన్ సంస్కృతికి అలవాటుపడ్డారు, ఈ రాష్ట్రానికి కన్నడ అధికార భాష అయినప్పటికీ బెంగళూరులో ఎక్కువమంది ప్రజలు ఆంగ్లాన్ని బాగా అర్ధం చేసుకుంటారు, మాట్లాడతారు.
తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ కూడా ఇక్కడ వినబడతాయి. ముంబై తరువాత అత్యధిక అక్షరాస్యత కలిగిన నగరం బెంగళూరు(83%).
నగరం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వ౦ రంగ శంకర, చౌడయ్య మెమోరియల్ హాల్, రవీంద్ర కళాక్షేత్ర లాంటి సంస్థలు సాంప్రదాయ, ఆధునిక నాటకాలకు పట్టుగొమ్మలుగా ఎదిగేందుకు ప్రోత్సహించింది.
సంవత్సరానికి ఒకసారి జరిగే బెంగళూరు హబ్బ, ప్రజల ప్రతిభా ప్రదర్శనకు, కళా ప్రదర్శనకు ఒక మంచి వేదికను అందిస్తుంది. దీపావళి, వినాయక చవితి లాంటి పండుగలు బెంగళూరు లోని గొప్ప మత సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.
ప్రధాన కేంద్రం గా ఎదుగుదల :
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), హిందుస్తాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్ (HMT), ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లాంటి సంస్థలు తమ ప్రధాన కేంద్రాలను ఇక్కడ స్థాపించడంతో బెంగళూరు ఉత్పత్తి రంగానికి ప్రధాన కేంద్రంగా అవతరించింది.
ఇన్ఫోసిస్, విప్రో, టీ సి ఎస్ లాంటి కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను బెంగళూరు లో స్థాపించడంతో నగర ఆర్ధిక వ్యవస్థ బాగా ఊపందుకుంది. బెంగళూరు లో ప్రధాన కార్యాలయాలు వున్న ఇతర కంపెనీలలో ఎల్ జీ, శామ్సంగ్, ఐ బీ ఏం కూడా వున్నాయి. ఇక్కడి ఉద్యోగ విపణి అన్ని దేశాలనుంచీ ఉద్యోగార్ధులను ఆకర్షించడం వల్ల నగరం బహుళ సంస్కృతి, బహుళజాతి నగరంగా రూపాంతరం చెందింది.
ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు పుట్టిల్లు. ఇక్కడ ఇంజనీరింగ్, వైద్య౦, మేనేజ్మెంట్ కళాశాలలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
పర్యాటకులు బెంగళూరుకు ఎందుకు వెళతారు ?
బెంగళూరు నగరం అన్ని ప్రాంతాలకు అనుసంధానించ బడి వుండటంతో ఇది పర్యాటకులకు స్వర్గంలా వుంటుంది. జవహర్ లాల్ నెహ్రు ప్లానిటోరియం, లాల్ బాగ్, కబ్బన్ పార్క్, అక్వేరియం, వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ, విధాన సౌద, బనేర్ఘట్ట నేషనల్ పార్క్ లాంటి చూసి తీరవలసిన ప్రదేశాలెన్నో ఇక్కడ వున్నాయి.
బెంగళూరు నించి ముత్యాల మడువు (Pearl Valley), మైసూరు, శ్రావణ బెళగొళ, నగరహోలె, బందిపూర్, రంగనాథిట్టు, బేలూర్, హలేబిడ్ వంటి ప్రదేశాలకు ప్రయాణించడ౦ సౌకర్యవంతంగా ఉంటుంది.
లీలా పాలస్, గోల్డెన్ లాండ్మార్క్, విండ్సర్ మానర్, లీ మెరిడియన్, ద తాజ్, ద లలిత్ అశోక లాంటి ప్రధాన హోటళ్ళు అటు అందుబాటు ధరలకు – ఇటు అధిక ధరలకూ కూడా నగరంలో వసతి సౌకర్యాలు పర్యాటకులకు అందుబాటులోఉన్నాయి.
ఓ బహుళ సాంస్కృతిక సమాజానికి ఆలవాలం కావడం వల్ల ఇక్కడ అన్ని రకాల రుచులు దొరుకుతాయి. రోడ్డు మీది ఆహార శాలల నించి అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ వరకు ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. బెంగళూరులో మెక్ డోనల్డ్స్, కే ఎఫ్ సి, పిజ్జా హట్ అవుట్లెట్లు పెద్ద సంఖ్యలో వుంటాయి, ఏం టీ ఆర్ లాంటి చోట్ల ఆసక్తిగల వారు స్థానిక రుచులు కూడా చవి చూడవచ్చు. చాలా హోటళ్ళు భారత దేశంలోని ఇతర రాష్ట్రాల రుచులు కూడా తయారు చేస్తుండడం వల్ల ఉత్తర, తూర్పు భారతీయ వంటకాలు లభించడం పెద్ద సమస్యేమీ కాదు.
జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులను అందించే ఫోరం, గరుడ మాల్, సెంట్రల్, మంత్రి మాల్ లలో షాపింగ్ చేయడం బాగుంటుంది. ఎమ్ జి రోడ్డులో ఉన్న కావేరి ఏమ్పోరియమ్ గంధపు చెక్కతో చేసిన వస్తువులు మరియు చన్నపట్టణ చెక్క బొమ్మలు లాంటి సాంస్కృతిక వస్తువుల కొనుగోలుకు మంచి దుకాణం. ఉత్సాహవంతమైన యువత పుణ్యమా అని బెంగళూరు రాత్రి వినోదాలకి కూడా ప్రసిద్ది పొందింది,
పర్యాటకులకు ఇన్ని రకాల అవకాశాలున్న బెంగళూరు కు ప్రయాణం చేయడం ఓ మంచి అనుభూతిని మిగులుస్తుంది.