కిరణ్ నాడార్ మ్యూజియం భారత దేశం మరియు ఉపఖండంలోనుండి సేకరించిన చిత్రాలని ప్రదర్శనకి ఉంచిన తొలి ప్రైవేటు మ్యూజియం. కళా పిపాసి అయిన కిరణ్ నాడార్ చొరవతో ఈ మ్యూజియం నిర్మించబడినది. సంస్క్రుతి మరియు కళ ల మధ్య గల అవినాభావ సంబంధాన్ని చిత్ర ప్రదర్శనలు,ముద్రణ,విద్యా మరియు ఇతర కార్యక్రమాల ద్వారా చాటి చెప్పడం లో భాగం గా చేసిన చిన్న ప్రయత్నమే ఈ మ్యూజియం.
20 వ శతాబ్దానికి చెందిన అనేక కళాకారుల చిత్రాలతో పాటు సమకాలీనులైన యువ కళాకారుల చిత్రాలు కూడా ఈ మ్యూజియం లో కొలువుదీరాయి. కళాప్రియులు వివిధ కళాకారుల చిత్రాలని దగ్గరగా గమనించడానికి, మరియు వారి పనితనాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ మ్యూజియం ఒక వేదిక.
ఈ మ్యూజియం తమ కార్యకలాపాలని 2010 లో ప్రారంభించింది.దీని ని షివ్ నాడార్ ఫౌండేషన్ వారి ఆర్ధిక సహకారంతో నిర్వహిస్తున్నారు.ప్రజలలో సమకాలీన కళలపట్ల జాగ్రుతులని చెయ్యడానికి ఈ మ్యూజియం నిర్వాహకులు స్కూల్, కాలేజీలలో ప్రత్యేక ప్రదర్శనలు,సింపోజియం మరియు ఇతర కార్యక్రమాల ద్వారా తమ క్రుషి కొనసాగిస్తున్నారు.
కిరణ్ నాడార్ మాటల్లోనే "మొట్టమొదట ప్రైవేటు మ్యూజియాన్ని ప్రారంభించి నేను సేకరించిన వివిధ చిత్రాలని ప్రజలతో పంచుకోవాలనుకున్నాను.కానీ మన దేశము మరియు ఉప ఖండం లో ఉన్న ఆధునిక మరియు సమకాలీన ఆర్టు ని వెలుగులోకి తీసుకురావడం లో లోపించిన సంస్థాగత ప్రయత్నం నాకు తెలుసు" కళలను ఆరాధించి, కళల గురించి తెలుసుకోవాలనే పిపాస గలవారికి ఈ మ్యూజియం ఒక వరం. ఆసక్తి ఉంటే మీరు కూడా వివిధ సమయాలలో మ్యూజియం నిర్వహించే కార్యక్రమాలలో పాలుపంచుకోవచ్చు.