పేరు సూచిస్తున్నట్టు రాజ్ పథ్ ఢిల్లీ యొక్క రాజ వీధి. సుప్రసిద్ధ రాష్ట్రపతి భవన్ నుంచి మొదలుకుని, విజయ్ చౌక్ గుండా, ఇండియా గేటు నుంచి ఢిల్లీ జాతీయ సంగ్రహాలయం వరకు విస్తరించి ఉన్నది ఈ భారత గణతంత్ర రాజ్య ఉత్సవ వీధి. భారత దేశంలోని అతి ముఖ్యమైన వీధులలో ఒకటి అయిన దీనికి ఇరు వైపులా చెట్లు, సరస్సులు, అందమైన పచ్చని మైదానాలు అలరారుతున్నాయి.
ప్రతి సంవత్సరం జనవరి 26న వార్షిక గణతంత్ర దినోత్సవ కవాతు ఈ రహదారి లోనే జరుగుతుంది. ప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్తల అంతిమ యాత్రలు ఈ దారి గుండానే వెళతాయి. ఈ రోడ్డు తిన్నగా రైసీనా హిల్ వైపు వెళుతూ, రాష్ట్రపతి భవన్ ప్రవేశ ద్వారాల దగ్గర ముగుస్తుంది. ఉత్తరం వైపు కన్నాట్ ప్లేస్ నుండి రోడ్లు వచ్చి ఈ వీధి లో కలుస్తాయి.
రాజ్ పథ్ కి దగ్గరలో ఉన్న ముఖ్య ప్రదేశాలు, ప్రసిద్ధ భవనాలలో సచివాలయ భవనాలు, భారత దేశ అధ్యక్షుని నివాసమైన రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్, ఇండియా గేటు ముఖ్యమైనవి. వివిధ రాజకీయంగా విశిష్టమైన భవనాలు ఉండటం వల్ల చాలా గట్టి భద్రతా ఏర్పాట్లతో ఈ భాగం అతి జాగ్రత్తగా సంరక్షించబడుతుంది.
ఢిల్లీ నగర ప్రణాళిక బ్రిటిష్ భవనశిల్పి అయిన ఎడ్విన్ లుట్యెన్స్ రూపొందించాడు. ఈ ప్రణాళిక లో అత్యంత ప్రాముఖ్యత గల ప్రదేశం రాజ్ పథ్. ఈ ప్రాంతపు భవనాల్లో ఎక్కువ భాగం లుట్యెన్స్ మరి కొన్ని హెర్బర్ట్ బేకర్ అనే పేరుగల మరొక భవనశిల్పి రూపకల్పన చేశారు.