అందమైన ప్రకృతి దృశ్యాలకు మరియు నిర్మలమైన వాతావరణానికి పేరు పొందిన ప్రాంతం, పాలంపూర్. ఇది కాంగ్రా లోయలో ఉన్న ఒక కొండ పట్టణం. పైన్ మరియు దేవదార్ చెట్ల దట్టమైన అడవులు, స్వచ్చమైన ప్రవాహాలతో ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంటుంది. ఈ ప్రాంతం, ఒక వాణిజ్య పర్యాటక స్థలంలా కాకుండా, స్వచ్ఛంగా, ఉల్లాసవంతంగా శెలవులు గడపటానికి చాలా బాగుంటుంది. ఇది సముద్ర మట్టానికి 1220 మీ. ఎత్తున ఉండి, ప్రకృతి ఆరాధకులకు ఒక వరంలా ఉన్నది. ఈ ప్రాంతం యొక్క పేరు హిమాచల్ భాషలో ఉన్న 'పులుం' అనే మాట నుండి ఏర్పడింది. 'పులుం' అంటే 'నీరు సమృద్ధిగా ఉండటం'.
బ్రిటిష్ వారు ఈ స్థలం యొక్క ఏటవాలు ప్రాంతాలలో టీ పొదలను పెంచాలని నిర్ణయించుకున్నప్పుడు, 19వ శతాబ్దంలో ఈ పట్టణం ఏర్పడింది. పాలంపూర్, ఈ విధంగా 'రాష్ట్రం యొక్క టీ కౌంటీ'గా కూడా చాల ప్రాచుర్యంలోకి వొచ్చింది. ఇక్కడనుండి అనేక రకాల బ్రాండ్ల టీ ఎగుమతులు జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పట్టణాలు, ఎగువన ఉన్న వరి పొలాలు,గుడులు, గ్రామాలు, వలస బంగళాలు మరియు మంచుతో కప్పబడిన ధాలుధర్ పర్వతాలు, ఇవి అన్నీ ఈ ప్రాంతాన్ని పర్యాటక స్వర్గంగా చేశాయి.
ఇక్కడ ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉంటుంది కనుక యాత్రికులు సంవత్సరమంతా ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవొచ్చు. ఇక్కడ వేసవికాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండి, ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. పాలంపూర్ లో వర్షాకాలంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి యాత్రికులు దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. శీతాకాలం ఇక్కడ నవంబర్ నెల నుండి ప్రారంభమవుతుంది.ఈ సమయంలో,ఇక్కడ ఉష్ణోగ్రత -2 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోతుంది. మంచు కూడా పడుతుంటుంది.
పాలంపూర్ కు 40 కి. మీ. దూరంలో గగ్గల్, (దీనినే ధర్మశాల-కాంగ్రా విమానాశ్రయం అని కూడా అంటారు) ఉన్నది. ఈ విమానాశ్రయం పెద్ద నగరాలైన డిల్లి, ముంబై వంటి వాటికి నేరుగా అనుసంధించబడింది. ప్రయాణికులు రైల్ ద్వారా రావాలనుకుంటే, నారో గేజ్ ముఖ్యకేంద్రం, మరంద వరకు రావొచ్చు, పట్టణం సమీపంలో 120 km దూరంలో పఠాన్కోట్ బ్రాడ్ గేజ్ రైలు ముఖ్యకేంద్రం ఉంది. పాలంపూర్ కు రోడ్ మార్గం ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. మండి, పఠాన్ కోట్ మరియు ధర్మశాల నుండి ప్రైవేటు మరియు రాష్ట్ర సొంత బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.