మహాభారత కాలంలో భీమసేనుడు ఒక రాక్షసుడిని చంపి హిడింబ అనే రాక్షస వనిత ను ఇక్కడ పెళ్లి చేసుకున్నాడని నమ్ముతారు కనుక ఖేడా ను పూర్వం హిడింబ వనంగా పిలిచేవారు. ఖేడా ను మొదట్లో బాబి వంశపు రాజులు, తరువాత మరాఠాలు, అటు పైన్ బ్రిటిష్ వారు పాలించారు. మహాత్మా గాంధీ తన సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం వలన ఈ ప్రదేశం చారిత్రికంగా కూడా ప్రసిద్ది చెందింది.
ఖేడా కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడుతున్నా బ్రిటిష్ వారు గ్రామస్తులకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ఆ సమయంలో గాంధీజీ తన మొదటి సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వారి మెడలు వంచి రెండేళ్ళ పాటు పన్ను వేయకు౦డాను, వడ్డీ తగ్గించేలాగాను చేసారు.
హనుమాన్ టేక్డో వద్ద వున్న ఖేడియా హనుమాన్ మందిరం, శ్రీ మహాలక్ష్మి మందిరం, శ్రీ మనకామేశ్వరి మందిరం, శ్రీ హనుమానజీ మందిరం, బహుచార్జీ మందిరం, శ్రీ సోమనాథ దేవాలయం, రాంజీ మందిరం, భద్రకాళీ దేవాలయం, శ్రీ మేల్దీ మాతాజీ మందిరం, శ్రీ నీలకంఠ మందిరం, దకోర్ లోని రన్ ఛోడరాయ్ మందిరం, ఖేడా సమీపంలోని శ్రీ ఖోడియార్ మందిరం, నడియడ్ లోని సంత్రాం మందిరం ఖేడా లోను, పరిసరాలలోనూ చూడతగ్గ ముఖ్యమైన దేవాలయాలు. కొన్ని దేవాలయ గోడల మీదా, ఇళ్ళ మీదా కనపడే 150 ఏళ్ళ నాటి సంప్రదాయ చిత్రాలకు కూడా ఖేడా ప్రసిద్ది. ఈ చిత్రాల్లోని ఇతివృత్తాలు ఇటు దార్మికమూ, సామాజికమూ కూడా అయి వుండి కొన్ని మనుషులు, జంతువుల బొమ్మలుంటాయి.