పట్నితోప్ లేదా పట్ని తోప్,జమ్మూ మరియు కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పర్వత ప్రదేశం. మొదట్లో ఈ స్థలాన్ని 'పటాన్ డా తాలాబ్', అనగా 'యువరాణి చెరువు' అని పిలిచేవారు. ఈ చెరువు,నిజంగానే ఒక రాకుమార్తె చే తన దైనందిన స్నానాలకు ఉపయోగించబడిందని చెప్పుకుంటారు. అయితే,కాలక్రమేనా దీని పేరు 'పటాన్ డా తాలాబ్' నుండి పట్నితోప్ గా మారిపోయింది. ఈ ప్రదేశం 2024 మీటర్ల ఎత్తులో ఉన్న పీఠభూమి మీద ఉంది. దట్టమైన దేవదారు అడవులు, కొండలు, ఉత్కంఠభరితమైన దృశ్యాలు మరియు ప్రశాంత వాతావరణం పట్నితోప్ ని ఒక ఆదర్శ విహార స్థలంగా తీర్చుదిద్దుతాయి. ఆ ప్రాంతంలో, సహజమైన మరియు చల్లని నీటిని అందించే మూడు మంచినీటి చెలమలు కూడా ఉన్నాయి. ఈ నీటి చెలమలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని భావిస్తారు. సమయం ఉంటే వీటిని సందర్శించవచ్చు.
శీతాకాలంలో పర్యాటకులు,స్కీయింగ్ మరియు ట్రెక్కింగ్ లాంటి అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనేందుకు పట్నితోప్ కి తండోపతండాలు గా వస్తారు. పట్నితోప్ గోల్ఫ్, పారాగ్లైడింగ్, వాయు క్రీడలు, గుర్రపు స్వారీ, మరియు ఛాయాగ్రహణం వంటి చర్యలకు కూడా అనుకూలంగా ఉంటుంది. పర్యాటక ఆకర్షణలలో నాగ్ (కోబ్రా) ఆలయం, బుద్ధ అమర్ నాథ్ దేవాలయం, బహు కోట మరియు ఆలయం, అలాగే సుధ్ మహదేవ్, గౌరికుండ్, కుడ్ మరియు శివ గఢ్ వంటి పవిత్ర ప్రదేశాలు కూడా ఉన్నాయి.
పట్నితోప్ లో విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ లేనప్పటికీ, పర్యాటకులు సులువుగా జమ్మూ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. పర్యాటకులు, జమ్ము విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్, చేరుకున్న తర్వాత, పట్నితోప్ చేరుకోవడానికి రాష్ట్ర రవాణా బస్సులు లేదా క్యాబ్ లు తీసుకోవచ్చు. ఇది సంవత్సరం పొడవునా చూడదగ్గ ప్రదేశం అంటారు, అయితే, సందర్శనకు అత్యంత అనుకూలమైన సమయంగా మే నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు పరిగణించవచ్చు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలం, స్కీయింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలలో పాలుపంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.