హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో 5700 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న పట్టణం షోఘి. షిమ్లా జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ పట్టణం రాష్ట్రంలోని పేరొందిన పర్వత కేంద్రాలలో ఒకటి. చుట్టూ ఓక్ చెట్లు, గన్నేరు చెట్లు ఉన్నఈ చిన్న పట్టణం షోఘి దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం స్థానికంగా తయారయ్యే జ్యూసులు, జెల్లీలు, సిరప్పులు, పచ్చళ్ళకు కూడా ప్రసిద్ధి చెందింది.
షోఘి చరిత్ర ఆంగ్లేయులులు -గుర్ఖాల యుద్ధం జరిగిన 19 వ శతాబ్దం నాటిది. 1815వ సంవత్సరం మేనెల 15వ తేదిన మలావున్ యుద్ధంలో గూర్ఖాలు స్థానిక రాజుల చేతిలో ఓటమిని చవి చూసారు. బ్రిటిష్ వారు, స్థానిక రాజులు కలసి సంజౌలి ఒడంబడికను గూర్ఖాలచే బలవంతంగా సంతకం చేయించారు, దీని ప్రకారం గూర్ఖా పాలనలో ఉన్న ప్రాంతం అసలైన పాలకులకు చేతికి చేరింది. తర్వాత, షిమ్లాతో సహా ఈ పూర్తి ప్రాంతాన్ని, బ్రిటిష్ వారు పాటియాల మహారాజు వారికి చేసిన నిరంతర సేవలకు గాను అతనికి బహుమతిగా ఇచ్చారు.
ఈ ప్రాంతంలో అనేక పురాతన ఆలయాలు ఉండటం వలన షోఘిని ఆలయ పట్టణం అని కూడా అంటారు. ఇటీవల పునరుద్ధరించిన హనుమాన్ ఆలయం, కాళీ ఆలయం, తారాదేవి ఆలయం ఈ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన ధార్మిక కేంద్రాలు. షోఘి సందర్శించే పర్యాటకులు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొన్ని పురాతన ఆలయాలకు పేరు గాంచిన ఝాకూ కొండలను కూడా సందర్శించవచ్చు.
షోఘిని వాయు, రైలు, రోడ్డు వంటి వేర్వేరు రకాల రవాణా సౌకర్యాల ద్వారా సులువుగా చేరవచ్చు. షోఘికి అతి దగ్గరగా జుబ్బర్ హట్టిలో షిమ్లా దేశీయ విమానాశ్రయం పట్టణం నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) అతి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం.
కల్క, షోఘికి అతి దగ్గరగా ఉన్న ప్రధాన రైలు స్టేషన్, భారత ప్రధాన నగరాలతో అనుసంధానం కల్గి ఉంది. ఈ ప్రాంతానికి రోజువారి బస్సులు హిమాచల ప్రదేశ్ లోని ఇతర నగరాల నుండి అందుబాటులో ఉంటాయి. షోఘి ప్రాంతంలో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.ఈ కారణంగా, పర్యాటకులు ఈ ప్రాంతాన్నిఏ కాలంలోనైన సందర్శించవచ్చు.