మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ జిల్లాలో మురుద్ ఒక కోస్తా గ్రామం. మురుద్ జంజీరా అక్కడ ప్రసిద్ధి చెందిన ఒక ఓడరేవు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సిద్ధి రాజవంశం పాలించింది. మరాఠాలు, పోర్చుగీస్, డచ్ మరియు ఇంగ్లీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ వంటివారు ఎంతమంది దీనిపై దాడులు చేసినప్పటికి ఈ కోట మాత్రం ఏ రకంగాను నష్టపోలేదు. జంజీరా అనే మాట మన భారతదేశ భాష కాదు. దీని మూలం అరబ్బీ భాషలో ఉంది. జంజీరా అంటే అరబ్బీలో ద్వీపం అయి అర్ధం. మురుద్ అనే పదం మరాఠి భాష నుండి వచ్చింది. ఈ పదం కొంకణిలో పుట్టిన మోరోద్ అనే పదానికి సంబంధించినది. కొంకణి మరియు అరబ్బీ భాషల సమ్మేళనంగా మోరద్ మరియు జజీరా అనేవారు.
కాలక్రమేణా అది మురుద్ జంజీరాగా స్ధిరపడింది. చాలామంది ఈ కోటను జల్ జీరా అని కూడా అనేవారు. దీనికి కారణం ఈ ద్వీపం చుట్టూ అరేబియా మహా సముద్రం ఉండటమే. మురుద్ జంజీరా చరిత్ర 12వ శతాబ్దంలో సిద్ది రాజవంశస్ధులు ఈ కోటను కట్టినపుడు మురుద్ పట్టణం జంజీరా సిద్దిలకు రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతాన్ని వశం చేసుకోటానికి ఎంతో మంది పాలకులు ప్రయత్నించారు. అయితే వీరందరిలోకి మరాఠాలకు గణనీయమైన నష్టం జరిగింది. ఛత్రపతి శివాజి మహరాజ్ ఈ కోటను స్వాధీనం చేసుకునేందుకు ఆరు సార్లు ప్రయత్నించాడు. కాని ఏ ఒక్కసారి విజయం సాధించలేకపోయాడు.
ఈ కట్టడ నిర్మాణం చాలా వ్యూహాత్మకంగా నిర్మించారు. ప్రారంభంలో ఇది మురుద్ లోని స్ధానిక మత్స్యకారులు ఒక చెక్క కోటగా అప్పటి సముద్ర దొంగల బారినుండి తమను తాము రక్షించుకోవడానికిగాను నిర్మించారు. అయితే, అహ్మద్ నగర్ కు చెందిన నిజం షాహి రాజవంశంలోని పీర్ ఖాన్ ఈ కోటను స్వాధీనం చేసుకోగలిగాడు. వెనువెంటనే ఆ కోటను మరింత బలపరచి దానిపై మరో శత్రువు దాడి చేయకుండా చేశాడు. అహ్మద్ నగర్ రాజ్యంలో ప్రఖ్యాత శిల్పి అయిన మాలిక్ అంబర్ ఈ పునర్నిర్మాణ చర్యలు చేపట్టాడు.
మురుద్ జంజీరాలో తప్పక చూడదగినవి ఏమిటి? మురుద్ జంజీరా కోట పూర్తిగా ఒక సముద్రపు కోట. దీనిని రాజపురి జెట్టి ద్వారా చేరాలి. ఈ కోట అనేక కోట బురుజులు మరియు ఫిరంగులు కలిగి ఉంటుంది. నేటికి అవి చెక్కు చెదరలేదు. కోట ఆవరణలో ఒక మసీదు, అనేక భవనాలు మరియు పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటాయి. బెస్సీన్ బీచ్ యొక్క అద్భుతమైన ద్వీపపు కోట ఇది. బీచ్ ఆకర్షణీయంగా ఉంటుంది. సమీపంలో కల పాంచాల కోట కూడా చూడదగినదే.
ఇతిహాసిక కోట మాత్రమే కాక మురుద్ ఒక వినోద ప్రాంతంగా కూడా ఉంటుంది. అక్కడ కల ప్రకృతి దృశ్యాల బీచ్ ఇసుక తిన్నెల మెరుపులతో మెరిసిపోతూంటుంది. ప్రాంతం అంతా పోక మరియు కొబ్బరి చెట్లు కనపడతాయి. స్వచ్ఛమైన నీరు సూర్య కిరణాలకు మెరిసిపోతూంటుంది. ఈ ప్రాంతంలోని పచ్చదనంకు పర్యాటకులు ఒక అయస్కాంతం వలే ఆకర్షించబడతారు.
ఆధ్యాత్మికులకు ఈ ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి దేవాలయం కలదు. దేవాలయంలోని విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది. మూడు తలలు కలిగి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తలపిస్తూంటుంది.
చిన్నదైన ఈ మత్స్యకారుల గ్రామం వేగంగా ఒక ప్రధాన పర్యాటక స్ధలంగా మారుతోంది. చక్కటి సూర్య రశ్మి, ఇసుక తిన్నెలు, చారిత్రాత్మక కోట, ఆహ్లాదకర వాతావరణం లతో పర్యాటకులు ఆనందించగలరు. ఒక సారి సందర్శిస్తే చాలు ఇక జీవితంలో వారు మరువలేని అనుభూతులు పొందుతారు.