రాచరికపు ఠీవిని చాటిచెబుతున్న.. హజార్ద్వార్ ప్యాలెస్!
మన దేశంలో రాజమహళ్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్ని శిథిలమై కాలగర్భంలో కలిసిపోతే, మరికొన్ని ప్రభుత్వాల సంరక్షణలో చెక్కుచెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి ఓ రాజమహల్ యాత్ర మా బృందాన్ని రాజవంశీయుల చరిత్రవైపుగా నడిపించింది. గతవైభవపు అనుభవాలను స్పృషించేలా చేసింది. నేటికీ రాచరికపు ఠీవిని చాటిచెబుతున్న పశ్చిమబెంగాల్లోని హజార్ద్వార్ రాజమహల్ పర్యటన విశేషాలు మీకోసం..
చారిత్రక ప్రదేశాలలో పర్యటించడం మా బృందానికి ఎంతో ఇష్టం. అందుకే మా ప్రయాణపు జాబితాలో హజార్ద్వార్ రాజమహల్ చేరిపోయింది. అది వేయి తలుపుల మహాల్ (ప్యాలెస్). ఆ మాట వినగానే హజార్ద్వార్ ఎలాంటి ప్యాలెస్ అనేది అర్థమైపోతుంది. ఎటు చూసినా ద్వారాల సమాహారమే మా బృందానికి స్వాగతం పలికాయి. బగీరథీ నది ఒడ్డున ఉన్న ఈ మూడు అంతస్థులు ప్యాలెస్లో 114 గదులున్నాయి. ఇందులో 100 వాస్తవిక (అసలు) తలుపులు, మిగతా 900 తలుపులు వర్చువల్ (రాళ్లతో తయారుచేసినవి). ఈ తలుపుల కారణంగానే దీన్ని హజార్ దర్వాజ్ మహాల్ (1000 తలుపుల ప్యాలెస్) అని అంటారని స్థానిక గైడ్ చెప్పుకొచ్చాడు. ఈ ప్యాలెస్ నిర్మాణం 19వ శతాబ్దంలో నవాబ్ నిజామ్ హుమాయూన్ పాలనలో కట్టబడింది. పూర్వపు కాలంలో దీన్ని 'పెద్ద ఇల్లుగా' పిలిచేవారు. ఈ ప్యాలెస్ పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ లో ఉంది. ఈ ప్రాంతం అప్పట్లో బెంగాల్ రాజధానిగా ఉండేది. ఈ ప్యాలెస్ ప్రసిద్ధ ఆర్కిటెక్ మైకిల్మేడ్ డంకన్తో గ్రీక్ (డోరిక్) శైలిని అనుకరించి కట్టారు. అక్కడ వేసిన ప్రతి అడుగులోనూ మా బృందానికి ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆ ప్యాలెస్ నిర్మాణశైలి ఎవ్వరినైనా అబ్బురపరచాల్సిందే.

నిర్మాణం.. ఓ అద్భుతం
భగీరథి నదికి సుమారు 40 అడుగుల దూరంలో ఉన్న ఈ ప్యాలెస్ పునాదులు చాలా లోతైనవి. అందుకే ఇప్పటికీ అవి చాలా గట్టిగా, దృఢంగా ఉన్నాయి. ఈ ప్యాలెస్కు ఇండో యూరోపియన్ శైలి నిర్మాణం, ఎత్తయిన మెట్లు ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకొవచ్చు. ప్యాలెస్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన తలుపుల అమరిక మా బృందాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ తలుపుల కారణంగా దొంగతనానికి కానీ, దాడులకు కానీ వచ్చిన వారు గందరగోళానికి గురై దొరికిపోతారు. సుమారు 41 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ను చూసేందుకు వచ్చిన విదేశీ సందర్శకుల తాకిడి ఎక్కువగానే కనిపించింది. దీని నిర్మాణ శైలి నవాబుల రాచరికానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆంగ్లేయుల పరిపాలన కాలంలో ఇక్కడ పరిపాలన పనిని నిర్వహించేవారు. అయితే, ఈ ప్యాలెస్ ను ఎప్పుడూ ఓ నివాస స్థలంగా ఉపయోగించలేదట. ప్యాలెస్ గోడలను నిజామత్ కోట లేదా కోటనిజామత్ అని అంటారు. ప్యాలెస్ ను ఆనుకుని నిజామత్ ఇమంబర్, వాసిఫ్ మంజిల్, వాచర్, మదీనా మజీద్, బచ్చావాలీ కానన్ వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. 12-14 శతాబ్దంలో కట్టిన 16 అడుగుల కానన్లో సుమారు 18 కిలోల పేలుడు పదార్థాన్ని ఒక్కసారి మాత్రమే
ఉపయోగించారని గైడ్ వివరించారు. అంతేకాదు, ఆ సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా జరిగిందట. అది ఎంతలా అంటే, చాలామంది గర్భిణులు సమయాని కంటే ముందుగానే ప్రసవించారనే ఓ ప్రచారం కూడా ఉందని, అందుకే దీన్ని బచ్చావాలీ కానన్ అని పిలుస్తారని చెప్పుకొచ్చారాయన.

అబ్బురపరచే మ్యూజియం
ఈ ప్యాలెస్ 1985 నుంచి పూర్తిగా భారతీయ పురావస్తుశాఖ పర్యవేక్షణలో ఉంది. ఇందులో ఏర్పాటు చేసిన మ్యూజియం భారతీయ పురావస్తుశాఖ అధీనంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంగా చెప్పవచ్చు. మా బృందం అడుగులు మ్యూజియంవైపుగా పడ్డాయి. ఇందులో 20 ఫీచర్ గ్యాలరీలు ఉన్నాయి. అందులో 4742 పురాతన వస్తువులు భద్రపరిచారు. వాటిలో పర్యాటకుల సందర్శనార్ధం 1034 పురాతన వస్తువులను ప్రదర్శనగా పెట్టారు. అందులో విభిన్న రకాల ఆయుధాలతోపాటు డచ్, ఫ్రెంచి, ఇటాలియన్ కళాకారులు గీసిన ఆయిల్ చిత్రాలు, మార్బుల్ శిల్పాలు, మెటల్ వస్తువులు, సిరామిక్, గారమిక్ శిల్పాలు, అరుదైన పుస్తకాలు, పాతకాలపు చిత్రాలు ఇలా చెప్పుకుంటూపోతే మా మనసుదోచే అరుదైన వస్తువుల సమ్మేళనమనే చెప్పాలి.
వాటితోపాటు అలనాటి శిస్తుల రికార్డులు, సెడాన్ వంటివి కూడా కనిపిస్తాయి. అత్యధికంగా 18వ, 19వ శతాబ్దానికి చెందిన వస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియంలో పర్యాటకులు 200 కంటే ఎక్కువ ఆయుధాలు చూడవచ్చు. ఈ ఆయుధాలలో నవాబ్ అలీవర్దీ ఖాన్, సిరాజ్ల్ ఆయన దాదాజీ వాడిన కత్తులు ప్రముఖమైనవి. అక్కడ తిరిగిన తర్వాత వింటేజ్ కార్ల అద్భుతమైన సేకరణను మేం వీక్షించగలిగాం. ఈ కార్ల సేకరణ రాయల్ హౌస్ సభ్యులు చేశారని గైడ్ చెప్పారు.

గ్రంథాలయం..
మ్యూజియం, ప్యాలెస్ చూసిన తర్వాత పక్కనే ఉన్న గ్రంథాలయ ప్రాముఖ్యత తెలుసుకున్నాం. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అటుగా ముందుకు వెళ్లాం. ఈ గ్రంథాలయాన్ని వీక్షించడానికి పర్యాటకులు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్బర్ నామ్ అసలు కాపీ ఇక్కడ లభిస్తుంది. ప్యాలెస్ మ్యూజియంలో నాటి రాజులు వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇక్కడి దర్బారు అందమైన షాన్డిలియర్ కూడా ఉంది. ఈ షాన్డిలియర్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద షాన్డిలియర్.
మొదటిది బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఉంది. ఈ షాన్డిలియర్ నవాబు రాణి విక్టోరియా ఇచ్చిన బహుమతి. గ్రంథాలయాన్ని అనుకుని ఉన్న గ్యాలరీలో ఆర్సెనల్ వింగ్, మనోహర ప్రదర్శన, ల్యాండ్స్కేప్ గ్యాలరీ, బ్రిటిష్ పొట్రేట్ గ్యాలరీ, నవాబ్ నజీమ్ గ్యాలరీ, దర్బార్ హాల్, కమిటీ హాల్, బిల్బోర్డ్ హాల్, పశ్చిమ డ్రాయింగ్ హాల్, మతపరమైన వస్తువుల గ్యాలరీ ఉన్నాయి. ఈ మహల్ను వీక్షించడానికి కొంత ఎంట్రీ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. శుక్ర వారం నాడు ఈ మహల్ మూసి వేయబడి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకూ ఈ మహల్ చూసేందుకు అనువైన సీజన్. ఇక్కడి చారిత్రక విశేషాలను మా మనసుల్లో పదిలపరచుకుని తిరుగు ప్రయాణమయ్యాం.

ఎలా వెళ్లాలి?
ముర్షిదాబాద్, పశ్చిమబెంగాల్ ప్రస్తుత రాజధారి కొల్కతా నుంచి సుమారు 230 కిలోమీటర్లు వరకు ఉంటుంది. కొల్కతా నుంచి ముర్షిదాబాద్కు బస్ సౌకర్యం ఉంది. కొల్కతా నుంచి ముర్షిదాబాద్కు కొల్కతా రైల్వేస్టేషన్లో చాలా రైళ్లు అందుబాటులో ఉంటాయి. కొల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి అతిదగ్గరి విమానాశ్రయం.



Click it and Unblock the Notifications














