‘ఆశ్రమ భూమి’గా పిలువబడే కీలాంగ్ – హిమాచల్ ప్రదేశ్ లో సముద్ర మట్టానికి 3350 మీటర్ల ఎత్తున నెలకొని వున్న అందమైన పర్యాటక ఆకర్షణ. లాహౌల్-స్పితి జిల్లాకు ప్రధాన కేంద్రం గా వ్యవహరించే కీలాంగ్ లో చాలా పర్యాటక ఆకర్షణలు వున్నాయి. ‘ఖచ్చితంగా ఇక్కడ దేవతలుంటారు – ఇక్కడ మనుషులకు స్థానం లేద’ని ప్రసిద్ధ రచయిత రడ్యార్డ్ కిప్లింగ్ అన్నాడు. ఉల్లాసపరిచే పురాతన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి లోయలు నిజంగా ఉత్కంఠభరితంగా వుంటాయి.
చారిత్రిక ప్రాధాన్యం కలిగి, ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో వుండే బౌద్ధారామాలు చూసే అవకాశం కల్పిస్తుంది కీలాంగ్. కార్దంగ్ విహారం, షసుర్ విహారం ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందాయి. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున 900 ఏళ్ళ నాడు ఏర్పడింది కార్దంగ్ విహారం. షసుర్ విహారాన్ని భూటాన్ లోని నావంగ్ నాంగ్యాల్ మహారాజు వద్ద పనిచేసే బౌద్ధ గురువు జాన్స్కార్ కు చెందిన లామా దేవా గ్యాత్షో ఈ విహారాన్ని 17వ వ శతాబ్దంలో నిర్మించాడు. గురు ఘంటాల్ విహారం, తాయుల్ విహారం, గేముర్ విహారం ఇక్కడి ఇతర ప్రసిద్ధ విహారాలు.
తండి, సిస్సు, ఉదయపూర్ లాంటి కొన్ని ఇతర ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు కూడా వున్నాయి. చంద్రా నదీ తీరం వెంట వున్న ప్రముఖ గ్రామం సిస్సు కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. వర్షాకాలంలోను, శిశిర ఋతువు లోను ఈ ప్రాంతంలో పర్యాటకులు అడవి కొంగలు, బాతులను కూడా చూడవచ్చు. త్రిలోకనాద్ దేవాలయం, మార్కులా దేవి దేవాలయాలకు ఉదయపూర్ గ్రామం ప్రసిద్ది చెందింది. పర్వతారోహణ, చేపలు పట్టడం, జీప్ సవారీ, పేరా గ్లైడింగ్, స్కీయింగ్, క్యాంపింగ్ లాంటి సాహస క్రీడలకు కూడా కీలాంగ్ ప్రసిద్ది చెందింది.
కీలాంగ్ కు రావాలనుకునే యాత్రికులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి 165 కిలోమీటర్ల దూరంలో వున్న భు౦టార్ ఇక్కడికి సమీప విమానాశ్రయం. దీనికి న్యూడిల్లీ, ముంబై లాంటి నగరాల నుంచి విమానాలు నడుస్తాయి. కీలాంగ్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరి రైల్ కేంద్రం. పర్యాటకులు మనాలి నుంచి నడిచే ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా కూడా కీలాంగ్ కు చేరుకోవచ్చు.
మే నుంచి అక్టోబర్ వరకు వుండే వేసవి కాలం కీలాంగ్ సందర్శనకు ఉత్తమ సమయ౦.



Click it and Unblock the Notifications