రీకాకుళం జిల్లా గార మండంలోని శ్రీకూర్మం దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఫల్గుణమాసంలో నిర్వహించే డోలోత్సవాలు ఈ రోజు (మార్చి 22) నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కూర్మనాథుని డోలోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది ప్రత్యేకంగా తిథి, నక్షత్రాల్లో మార్పుల కారణంగా నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం స్వామి ఉత్సవమూర్తులను మాఢవీధుల్లో ఊరేగించిన అనంతరం 'కామదహన' కార్యక్రమంతో వేడుక ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీకూర్మం దివ్యక్షేత్రంలో డోలోత్సవాల ఏర్పాట్లతోపాటు ఈ క్షేత్రంలో జరిగే కార్యక్రమాల వివరాలు మీకోసం..
మన ప్రాచీన శిల్పకళా శోభితానికి చిహ్నంగా నిలుస్తూ... దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత పంచుతూ అలరారే శ్రీకూర్మం దివ్యక్షేత్రంలో ఏటా ఫల్గుణమాసంలో నిర్వహించే డోలోత్సవాలు నేటి నుంచి (మార్చి 22) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కూర్మనాథుని దర్శనంతో సర్వపాప విమోచనం చేసుకోవచ్చునని భక్తుల ప్రగాడ విశ్వాసం. శ్రీకూర్మం దివ్యక్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో నరదగుండం, సుధాగుండం, చక్రతీర్థం, మాధవగుండం, కౌటిల్యతీర్థం, వక్రతీర్థం, నరసింహపాతాళం, మహోదధి (దక్షిణ సముద్రం) ఉండడం ప్రత్యేకతగా చెప్పబడుతోంది. ఈ అష్టతీర్థాల్లో పవిత్రస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పౌర్ణమిరోజున నిర్వహించే ఈ డోలోత్సవంలో వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శిస్తారు.

ఎంతో చారిత్రక నేపథ్యం..
ఇక్కడి శ్రీకూర్మనాథని సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్వేతరాజు తపస్సు ఫలంగా స్వామి ఇక్కడ వెలసినట్టు చారిత్రక ఆదారాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింతో నేటికీ చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ నాలుగో శతాబ్దం నుంచి 14, 16 శతాబ్దాల వరకు ఆయా కాలాల రాజులు ఆలయ అభివృద్ధికి ఎంతెంత విరాళాలు ఇచ్చారన్నది ఆలయ స్తంభాలపై ఉన్న శాసనాల ద్వారా గుర్తించబడింది. 1135లో అనంతవర్మ చోళగంగదేవుడు దండయాత్రలు చేస్తూ పశ్చిమోత్తర దేశాన్ని జయించినట్టు ఒక శాసనంలో తెలుస్తోంది. 12వ శతాబ్దానికి పూర్వం దీనిని శైవక్షేత్రంగా వ్యవహరించేవారన్న వాదన కూడా ఉంది. ఈ ఆలయం పైభాగం అష్టదశ పద్మాకారంలో ఉండడం ప్రధాన విశేషంగా చెప్పొచ్చు.
తిరువీధిలో ఊరేగింపు..
శ్రీకూర్మనాథుని డోలోత్సవం తొలిరోజు కామదహనోత్సవంతో ప్రారంభిస్తారు. స్వామి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, గోవిందరాజుస్వాములకు తిరువీధి నిర్వహించి అనంతరం డోలో మండపం ఉన్న ఊయలలో ఉంచుతారు. అక్కడ స్వామిని ఉత్తరాభిముఖంగా భక్తులు దర్శనం చేసుకుంటారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన విజయనగర పూసపాటి గజపతుల గోత్రనామాలతో స్వామికి బుక్కా, భర్గుండ పూజలు చేస్తారు. అనంతరం గ్రామసమీపంలో కామదహన మండపం వద్ద అశేష భక్తజనుల మధ్య అర్చకస్వాములు కామదహనోత్సవాన్ని చేపడతారు.
ఇందుకోసం ఎండిన కొబ్బరికొమ్మను నిలబెట్టి దానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పెద్ద హోమం నిర్వహించి ఆ కొబ్బరికొమ్మకు నిప్పు పెడతారు. తర్వాతి రోజుల్లో 23, 24 తేదీల్లో పడియా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్దఎత్తున సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకుంటారు. 25న పౌర్ణమిరోజున డోలోత్సవం నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివస్తారు.



Click it and Unblock the Notifications













