హైదరాబాద్కు లభించిన పురాతన కానుక.. బన్సిలాల్పేట మెట్లబావి
హైదరాబాద్ బన్సిలాల్పేట నాగన్ కుంట ప్రాంతంలో అడుగుపెడితే చాలు.. ఎక్కడ చూసినా చారిత్రాత్మక నిర్మాణాలు దర్శనమిస్తాయి. రాతిచెక్కడాల మధ్య అద్దాల మందిరం సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. గోడల్లో దాగిన వినాయకుని విగ్రహాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. స్వచ్ఛమైన నీటితో నిండిన మెట్లబావి చూపరుల మనసును కట్టిపడేస్తుంది. ఊటబావిని చేరుకునేందుకు మెట్ల మార్గాలు అద్భుత నిర్మాణ శైలిలో తారసపడతాయి. మరెందుకు ఆలస్యం హైదరాబాద్కు లభించిన ఆ అందమైన పురాతన కానుక విశేషాలు తెలుసుకుందామా!
భాగ్యనగరంలో ఒకప్పటి పండగలు.. సంబరాలకు ఆలవాలమైన పురాతన బావి బన్సిలాల్పేట్ మెట్లబావి. నిజాం కాలంలో తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఈ మెట్లబావి కాలక్రమేనా నిర్వహన లేకపోవడంతో చెత్తతో నిండిపోయి, శిధిలావస్థకు చేరింది. అయితే, అది ఇప్పుడు మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. బన్సిలాల్పేటలో వందల ఏళ్లనాటి బావిని పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంది. నిజానికి, నిన్నటివరకూ అసలు అంతటి అపురూప నిర్మాణం అక్కడ ఉందని ఈ తరానికి తెలియనే తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచస్థాయిలో నిలిచేలా దీనిని రూపుదిద్దారు అధికారులు. ఈ మూడు వందల ఏళ్లనాటి అందాల మంచి నీటి మెట్లబావిని చూసినవారెవ్వరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే.
నగరపు వారసత్వ నిర్మాణ సంపద
ఈ భారీ ఊటనీటిబావికి వెళ్లేందుకు వివిధ మార్గాల్లో యనభైకిపైగా మెట్లు ఉన్నాయి. అందులో ప్రశాంతంగా సేదదీరేలా చుట్టూ అందమైన నిర్మాణాలు ఉన్నాయి. 35.5 మీటర్ల పొడవు, 19.2 మీటర్ల వెడల్పు, 53 అడుగుల లోతు ఉన్న ఈ బావిలో మొత్తం 22 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. గతంలో ఇదే స్థానికులకు మంచి నీటి అవసరాలను తీర్చేది. ప్రస్తుతం కొత్త రూపు సంతరించుకున్న ఈ ప్రదేశంలో చిన్న చిన్న వేడుకలు నిర్వహించుకునేందుకు సీటింగ్తో కూడిన గార్డెన్, యాంపీ థియేటర్ నిర్మించారు. నగరపు వారసత్వ నిర్మాణ సంపదకు ఈ మెట్లబావి నిలువెత్తు నిదర్శంగా దర్శనమిస్తోంది.
నీటివనరుల రక్షణతోపాటు టూరిజం
ఇటీవల కాలంలో చారిత్రాత్మక నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. వాటికి పూర్వవైభవం వచ్చేలా తీర్చిదిద్ది.. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు వేస్తోంది. అందుకు అనుగుణంగా మొన్నటివరకూ నగరంలోని పురాతణ మార్కెట్లు, క్లాక్ టవర్లను డెవలప్ చేసింది. ఇప్పుడు తాజాగా పురాతన తాగునీటి వనరులుగా ఉన్న బావులను అభివృద్ధి చేస్తోంది. నగరంలోని మెట్లబావులను డెవలప్ చేయడం ద్వారా నీటివనరుల రక్షణతోపాటు భాగ్యనగరం టూరిజం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తోంది. మెట్లబావి చుట్టూ టూరిజం ప్లాజాతోపాటు వివిధ నిర్మాణాలకోసం సుమారు పది కోట్ల రూపాయిలవరకూ ఖర్చు చేశారు.
పునఃనిర్మాణంతో పూర్వవైభం
బన్సిలాల్పేట్ మెట్లబావిని అద్భుతమైన సందర్శనీయ ప్రదేశంగా తీర్చిదిద్దిన తర్వాత ప్రస్తుతం ఇది పెద్ద పెద్ద దేవాలయాల వద్ద ఉండే కోనేరును తలపిస్తోంది. జనావాసాల మధ్య అందంగా కనిపిస్తోన్న ఈ నిర్మాణం దశాబ్దాలుగా చెత్తతో పేరుకుపోయింది. అంతకుముందు ఈ బావిలో స్థానికులు సరదాగా ఈతకొట్టేవారట.
అయితే, ఎనభైవ దశకంలో ఇక్కడి బావిలో ఇద్దరు మరణించారట. ఈ బావి చరిత్ర మరుగున పడిపోయింది. నిన్నటివరకూ డంపింగ్ యార్గ్ మాత్రమే అనుకున్న యువత పునఃనిర్మాణం తర్వాత చూసి, ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా కుటుంబసమేతంగా ఈ మెట్లబావి అందాలను చూసేందుకు బయలుదేరండి.