నగరం నడిబొడ్డున దర్జాగా నిలబడ్డ చారిత్రక నిలయమది. రాచరికపు హుందాతనానికి నిలువెత్తు సాక్ష్యమది. అదే భాగ్యనగరం హైదరాబాద్ పర్యాటక సిగలో దాగిన చౌమహల్లా ప్యాలెస్.
నిజాం కాలం నాటి ఎన్నో అద్భుత కళాఖండాలను, అపురూప వస్తు సంపదను ఈ ప్యాలెస్లో కనులారా వీక్షించవచ్చు. కుటుంబ సమేతంగా చారిత్రక విశేషాలను సందర్శించేందుకు చౌమహల్లా ప్యాలెస్ కు వెళ్దాం పదండి.
భాగ్యనగరంలోని శ్వేతసౌధాన్ని మీరెప్పుడైనా చూశారా?!
నిజాం ట్రస్టు పర్యవేక్షణలో కొనసాగుతోన్న చౌమహల్లా ప్యాలెస్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న యురోపియన్ శైలిలో నిర్మితమైన శ్వేతసౌధమిది. చౌ'అంటే నాలుగు, 'మహాల్లా' అంటే రాజభవనాలు చౌమహల్లా అంటే నాలుగు రాజభవనాలను కలిగినది అని అర్థం. చౌమహల్లా ప్యాలెస్ ఇరాన్ లోని ట్రెహ్రాన్ షా ప్యాలెస్ను పోలి ఉంటుంది. ఈ భవన నిర్మాణం 1857 -1869 మధ్య ఐదవ నిజాం పాలనలో ఆఫ్జల్-ఉద్-దౌలా, అసఫ్ జాహీ కాలంలో పూర్తి చేశారు. ప్యాలెస్ నిజానికి ఉత్తరాన లాడ్ బజార్ నుండి దక్షిణాన అస్పన్ చౌక్ రోడ్ వరకు 45 ఎకరాలు విస్తరించి ఉంది.
ప్రాంగణాల సముదాయం..
ప్రధానంగా ప్యాలెస్కు రెండు ప్రాంగణాలు ఉంటాయి. అవి ఉత్తర ప్రాంగణం, దక్షిణ ప్రాంగణం. ముఖ్యంగా దక్షిణ ప్రాంగణంలో చూసినట్లైతే అప్జల్ మహల్, తహ్నియత్ మహల్, మహతాబ్ మహల్, అప్తాబ్ మహల్ నాలుగు రాజభవనాలు దర్శనం ఇస్తాయి. అప్తాబ్ మహల్ మిగిలిన వాటి కంటే పెద్దదయిన రెండు అంతస్తుల నిర్మాణం. అలాగే ఉత్తర ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు, తూర్పు వైపు అనేక గదులు సుదీర్ఘ కారిడార్ కలిగిన పరిపాలనా విభాగం వున్నాయి. ఈ ప్రాంగణంలో అతిథులు, ముఖ్యమైన వ్యక్తుల కోసం ఓ అందమైన ఫీచర్ అలట్ ఉంది. అలాగే ప్యాలెస్ ఆవరణంలో ఒక క్లాక్ టవర్, ఓ కౌన్సిల్ హాల్ ఉన్నాయి. రోషన్ బంగ్లాకు ఆరో నిజాం తల్లి రోషన్ బేగం పేరు పెట్టారు.
కళాత్మకంగా చెక్కిన..
ప్యాలెస్ నిర్మించినప్పుడు స్థాపించిన ఖివాత్ క్లాక్ టిక్కింగ్ శబ్దం ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. దీనిని క్లాక్ టవర్ పైన చూడవచ్చును. ఈ ప్యాలెస్లో 7000 మంది పరిచారకులు వుండేవారని చెబుతారు. ఇక్కడ అడుగుపెట్టగానే అందమైన తోటలు ఆకుపచ్చని గడ్డితో స్వాగతం పలుకుతాయి. రాజభవనంలో ఆకుపచ్చని పచ్చిక మైదానం అందర్నీ ఆకర్షిస్తుంది. ప్యాలెస్లో కళాత్మకంగా చెక్కిన స్తంభాలు, ప్యాలెస్ ముందు భారీ నీటి ఫౌంటెన్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. రాజభవనం గోడలు, పై కప్పుపై గాజుతో సున్నితంగా చెక్కిన చెక్కడాలు చాలా కళాత్మకంగా వుంటాయి.
భవనంలో వివిధ గ్యాలరీలు, బట్టలు, ఫర్నీచర్, కరెన్సీ నాణేలు వంటి ఆసక్తికరమైన ప్రదర్శనలు చాలా ఉన్నాయి. ఓ విభాగంలో పునరుద్ధరించిన వివిధ రకాల ఖురాన్లు ఉన్నాయి. అవి ఒకటి చేతితో రాసిన రాత ఖురాన్, మెటల్, బంగారు అనేక ఇతర లోహాలతో చెక్కిన సూక్ష్మ ఖురాన్లను చూడవచ్చును. పాతకాలపు కార్ల ప్రదర్శన ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ప్యాలెస్ ఎంట్రీ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.20. విదేశీయులకు రూ.200 గా ఉన్నాయి. ప్యాలెస్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.