అరుణాచల్ అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే!
హిమగిరుల కౌగిట ఒదిగిపోయిన అద్భుత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ అడుగడుగునా సుందరమైన ప్రదేశాలెన్నో పలకరిస్తాయి. మనదేశపు ఈశాన్య సౌందర్యంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. యింగ్ కియోంగ్ నుంచి పాసీఘాట్ సాహసయాత్రికులకు స్వాగతం పలికితే, సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో ఉన్న తవాంగ్ ప్రకృతి రమణీయతతో మనసును కట్టిపడేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ పేరు వినపడగానే గుర్తొచ్చే ఈ అద్భుత పర్యాటక ప్రదేశాల విశేషాలను తెలుసుకుందాం.
అరుణాచల్ ప్రదేశ్లోని పాసీఘాట్-యింగ్ కియోంగ్ పట్టణాల మధ్య దూరం 122 కిలోమీటర్లు. ఈ మార్గం మొత్తం కొండలు, లోయల గుండా సాగిపోతుంది. ఇక్కడ అడుగడుగునా అందమైన ప్రకృతిని ఆవిష్కరిస్తుంది. ముఖ్యంగా, సియాంగ్ నదీ ఒయ్యారాలు, హిమగిరుల సోయగాలను ఆస్వాదిస్తూ బైక్ పై దూసుకుపోతుంటారు సాహసవంతులు. దారిపొడవునా ఎటు చూసినా జలపాతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సియాంగ్ నదిపై వేలాడే వంతెనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ నదిలో రాఫ్టింగ్ జీవితంలో మర్చిపోలేని అనుభూతులను చేరువచేస్తుంది. ఈ మార్గంలో బైక్లు అద్దెకు లభిస్తాయి. అలా అద్దెకు తీసుకొని యాత్రకు బయలుదేరే రైడర్స్ ఎక్కువగా కనిపిస్తారు. దారిపొడవునా ఉన్న విశేషాలను ఆస్వాదిస్తూ వెళ్లిపోతారు.

డేయాంగ్ ఎరింగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
పాసీఘాట్కు 15 కిలోమీటర్ల దూరంలో డేయాంగ్ ఎరింగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. నది మధ్యలో ఉండే ఈ ద్వీప వనానికి వెళ్లాలంటే క్రూజ్లో ప్రయాణించాలి. అరుదైన పక్షులను ఇక్కడ చూడొచ్చు. ఆ పక్షుల కిలకిలారావాలు పర్యాటకుల మనసు దోచుకుంటాయనడంలోసందేహమే లేదు.
నవంబరు మొదలు మార్చి దాకా సైబీరియా, మంగోలియా నుంచి వలస వచ్చిన పక్షులతో వనమంతా కోలాహలంగా ఉంటుంది. ఏనుగులు, జింకలు, హరిణాలు, అడవి. దున్నలు లాంటి జంతుజాలాన్ని చూడొచ్చు. పచ్చదనం కమ్మేసిన ఇక్కడి పచ్చికబయిళ్లు, సందర్శకులను రా.. రమ్మని ఆహ్వానిస్తాయి.

దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మఠం..
అరుణాచల్ ప్రదేశ్కు వచ్చిన పర్యాటకులను అమితంగా ఆకర్షించేది తవాంగ్. సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో, హిమాలయాల మధ్యలో ఉంటుంది. టిబెట్, భూటాన్ సరిహద్దులను పంచుకున్న తవాంగ్ బౌద్ధ ఆరామాలకు నెలవు. జలపాతాలు, సరస్సులు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా చూపుతాయి.
తవాంగ్ ఆరామం దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మఠంగా చెబుతారు. ఇక్కడ 27 అడుగుల భారీ బంగారు బుద్ధుడి విగ్రహాన్ని చూడొచ్చు. తవాంగ్ సెలా పాస్కు సాహసవంతులు తప్పక వెళ్తుంటారు. సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో, మంచు కప్పేసిన ఈ మార్గంలో ఏటీవీ (ఆల్ టెరైన్ వెహికిల్) పై దూసుకుపోతుంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేం. తవాంగ్ పరిసరాల్లో జలపాతాలు, సరస్సులు తప్పక చూడాలి.
ఈ రెండు పట్టణాల మధ్య మార్గం పర్యాటక ప్రేమికులకు స్వర్గధామంగా పేరుగాంచింది. అయితే, వర్షాకాలంలో కొండ చరియల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకునేందుకు కోల్కతా, ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్కు నాన్ స్టాప్ విమానసర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి పాసీఘాట్కు బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అసోం రాజధాని గువాహటికి రైళ్లున్నాయి. అక్కడి నుంచి తవాంగ్కు బస్సులు, అద్దె వాహనాల్లో చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












