రైల్వేలో కొత్త సౌకర్యం.. మీకు కోచ్ నచ్చకపోతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు!
ప్రయాణీకుల సౌలభ్యం మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేస్తూ ఉంటుంది. ప్రయాణీకులతో రైల్వేకు ఉన్న అనుబంధం అలాంటిది. ఇప్పుడు తాజాగా సరికొత్త ఆలోచనను కార్యరూపం దాల్చేలా చేసింది.
ప్రయాణీకులకు తమ కోచ్ నచ్చకపోతే ప్రయాణం మధ్యలో దాన్ని అప్గ్రేడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది రైల్వే శాఖ. ఉదాహరణకు, మీరు స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తున్నట్లయితే, ప్రయాణ సమయంలో సీటును ఏసీ కోచ్కు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే, దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మరి వివరాలేంటో చూద్దామా!!
ఈ విధంగా సేవను ప్రారంభించడం యొక్క ఉద్దేశ్యం ప్రయాణీకులకు సౌకర్యాన్ని అందించడం మరియు ఎప్పటికప్పుడు మారుతున్న వారి అవసరాలను తీర్చడం కోసం అంటున్నారు రైల్వే అధికారులు. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలను సులభతరం చేసింది.
దీనివల్ల టిక్కెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా కోచ్ని అప్గ్రేడ్ చేయడం ప్రజలకు సులభతరం చేసింది. కొంత అదనపు చెల్లింపుతో ప్రయాణీకులు తమ గమ్యాన్ని మార్చుకోవడం ద్వారా అదనపు ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. అలా సౌకర్యవంతమైన ప్రయాణానికి రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను అమలు చేస్తూనే ఉంది.
మీ కోచ్ని ఎలా అప్గ్రేడ్ చేయాలి?
రైలు ప్రయాణంలో ఒకసారి బెర్త్ కన్ఫామ్ అయితే, మన గమ్యస్థానం చేరే వరకూ ఇష్టం ఉన్నా, లేకపోయినా అదే కోచ్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే, వాతావరణ పరిస్థితులు లేదా మరే ఇతర కారణాలతో ప్రయాణ సమయంలో తమ కోచ్ను మార్చుకోవాలనుకునేవారికి రైల్వే ఓ సౌకర్యాన్ని కల్పించింది. అలా ప్రయాణ సమయంలో మీ కోచ్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటే, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ సీటుపై కూర్చొనే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
అందుకోసం ఏం చేయాలా అని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కదూ? మీరు స్లీపర్ కోచ్లో కాకుండా AC కోచ్లో ప్రయాణించాలనుకుంటే, దీని కోసం మీరు కోచ్లో ఉన్న TTEని సంప్రదించాల్సి ఉంటుంది. మీ అభ్యర్థనను పరిశీలించి, AC కోచ్లో సీటు అందుబాటులో ఉన్నట్లయితే, TTE మీకు ఈ బెర్త్ను వెంటనే కేటాయిస్తారు.
బెర్త్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే
అయితే, ప్రయాణీకులు ఈ కొత్త సౌకర్యం వినియోగం విషయంలో కొన్ని నిబంధనలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో సీటు అప్గ్రేడ్కు మీరు నిబంధనల ప్రకారం TTEకి అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, మీరో కోరిన చోట ఆ సమయానికి మరొక కోచ్లో బెర్త్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు రైల్వే సీట్ అప్గ్రేడ్ సిస్టమ్ను సద్వినియోగం చేసుకోగలరని గుర్తుంచుకోవాలి.
సీటు ఖాళీగా లేకుంటే, మీకు బెర్త్ కేటాయించబడిన అదే కోచ్లో మీరు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సమయంలో అధికారిని ఒత్తిడి చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ కొత్త సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.