కాకతీయుల రాజసానికి నిలువుటద్దం ఓరుగల్లు..
కాకతీయుల రాజసానికి నిలువుటద్దం ఓరుగల్లు.. శత్రుదుర్భేధ్యమైన రక్షణ కవచం ఇక్కడి కోట నిర్మాణం.. రాతిగోడల నడుమ దాగివున్న చారిత్రక రహస్యాలకు సాక్షీభూతాలు అక్కడి కట్టడాలు. అలనాటి కాకతీయుల వైభవాన్ని కళ్ళారా చూడాలంటే వరంగల్ నగరాన్ని దర్శించాల్సిందే! దానికితోడు పర్యాటకులను ఆత్మీయంగా పలకరించే పచ్చని చెట్లతో నిండిన దారులు శీతాకాలపు సందర్శకులకు సాదర ఆహ్వానం పలుకుతాయి. మరెందుకు ఆలస్యం. ప్రకృతి సోయగాల నడుమ దాగివున్న చారిత్రక విశేషాలను తెలుసుకుందాం పదండి.
తెలంగాణాలోని వరంగల్ రైల్వేస్టేషన్కు రెండు మైళ్ళ దూరంలో ఉంది ఓరుగల్లు కోట. కాకతీయుల కాలంనాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ నగరంలో ఈనాటికీ చెక్కుచెదరని ఆనాటి విశేషాలు పర్యాటకులనుసంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. క్రీస్తుశకం 12-14 శతాబ్దాల మధ్య పరిపాలన సాగించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ నగరం రాజధాని. ఆ కాలంలో దీనిని ఓరుగల్లు అని వ్యవహరించేవారు. కాకతీయవంశీయులు వరంగల్ చుట్టుపక్కల ఎన్నో కట్టడాలను నిర్మించారు. అందులో ప్రధానమైనది ఈ ఓరుగల్లు కోట. 19 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కోట కాకతీయరాజు గణపతి దేవుని హయాంలో నిర్మింపబడింది. 45 బురుజులతో, స్తంబాలతో శత్రుదుర్భేధ్యమైనదిగా నిర్మించారు. కోట మధ్యభాగంలో భూదేవి ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కాకతీయుల సామ్రాజ్యానికి ప్రతీకగా కోట సింహద్వారం ఏకశిలతో ఏర్పాటు చేశారు. చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించే ఆయా కట్టడాలు కొన్ని శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ పర్యాటకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ కోటతోపాటు వేయిస్థంభాల గుడి, రామప్ప దేవాలయం చూడతగ్గ ప్రదేశాలు.
వేయి స్తంబాల గుడి
కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవు నిర్మించిన ఈ నిర్మాణం చాళుక్యుల శైలిలో నిర్మించబడింది. రుద్రేశ్వరుడు లింగరూపంలో ఈ వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేశారు. ఈ ఆలయం లోపల గోడలపై చెక్కబడిన లతలు, పుష్పాలు, నాట్య భంగిమలు పర్యాటకుల చూపులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ ప్రధానాలయంలో మొత్తం వేయి స్తంభాలు ఉండడం దీని ప్రత్యేకత. ఒక్కో స్తంభంపై చెక్కిన శిల్పసంపద అలనాటి శిల్పుల కళానైపుణ్యానికి అద్దంపట్టేలా ఉంటుంది.
రామప్ప దేవాలయం
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వరంగల్ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంపేట అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రామప్ప అనే శిల్పి పేరు మీదే ఈ ఆలయానికి ఆ పేరు పెట్టడం విశేషం. కాకతీయ వంశానికి చెందిన రేచర్లరుద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు విగ్రహ రూపం ఉంది. ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే... ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలోని తూర్పు దిశగా గర్భాలయం ఉంది. అలాగే లోపలివైపు మూడు ప్రవేశ ద్వారాలను కలిగిన మహా మండపం ఒకటి ఉంది. ఆలయం లోపల భారత ఇతిహాసాలైన రామాయణ, మహాభారత కథలు దృశ్య రూపాలుగా చెక్కబడి ఉన్నాయి. ఇవి సందర్శకులను ఎంతో ఆకర్షిస్తాయి. ఆలయం వెలుపల చెక్కబడిన ఓ పెద్ద నంది విగ్రహం సైతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎటువైపు నుంచి చూసినా ఈ నంది మనవైపే చూస్తున్నట్టు ఉండడం దీని ప్రత్యేకత.