అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్తో మారనున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు
దేశంలోని కొన్ని రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోనున్నాయి. విదేశీ స్థాయిలో అబ్బురపరచే నిర్మాణాలను చేపట్టి, చిన్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు రైల్వేశాఖ సన్నద్ధం అవుతోంది. "అమృత్ భారత్ స్టేషన్ స్కీం" కింద తక్కువ ఖర్చుతోనే అధునిక సౌకర్యాలతో పునర్నిర్మించాలని భావిస్తోంది. దీని కోసం ప్రత్యేక నిధి కేటాయించనున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఇప్పుడు ఉన్న చిన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడంతో పాటు అవసరమైనచోట కొత్త వాటిని చేర్చుతారు. ఈ స్టేషన్లలో ఇప్పటికే ఉన్న భవనాలను పునర్నిర్మించి యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా వారి కోసం విస్తారమైన స్థలాన్ని కేటాయిస్తారు. వీలైతే కార్యాలయాలను వేరొక చోటుకు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే దేశంలో మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రప్రభుత్వం గత కొన్నేళ్లుగా అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
దీనిలో భాగంగా పెద్ద, పెద్ద నగరాలతో పాటు.. పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించింది. దానికోసం అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (AMRUT) పథకాన్ని అమలు చేస్తోంది. తాజాగా ఇదే తరహాలో చిన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అమృత్ భారత్ స్టేషన్ పథకం పేరుతో ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
సంస్కృతి, కళలు ఉట్టిపడేలా..
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనే కొత్త కార్యక్రమం కింద వెయ్యి ముఖ్యమైన చిన్న రైల్వేస్టేషన్లను ఆధునీకరించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే ఒడిశాలోని ఖుర్దా జంక్షన్ను ఈ విధంగా అభివృద్ధి చేశారు. కొత్త పథకం కింద, ప్రతి స్టేషన్లో 10 నుండి 20 కోట్ల రూపాయలను మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయాలని నిర్ణయించింది. నిజానికి, ఖుర్దా స్టేషన్ను రూ.4 కోట్లతో ప్రయాణికుల అవసరమైన సౌకర్యాలతో ఆధునీకరించారు. అంటే, ఇప్పుడు ఒక్కో స్టేషన్కూ చేయబోతోన్న ఖర్చు భారీ మొత్తంలో పెంచుతున్నట్లే చెప్పాలి.
ఏడాది లేదా ఏడాదిన్నరలో ఈ పని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా ముఖద్వారాలు, రైల్వే ట్రాకులను నవీకరిస్తారు. వెయిటింగ్ గదుల స్థలాన్ని పెంచుతారు. ప్రణాళికాబద్ధమైన పార్కింగ్, లైటింగ్ సౌకర్యాలు, రోడ్డు విస్తరణ వంటివి ఉంటాయి. అహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, కళలు ఉట్టిపడేలా స్టేషన్ను తీర్చిదిద్దుతారు.
రూఫ్ ప్లాజాలు మరియు సిటీ సెంటర్లు
రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయడంతోపాటు సౌకర్యాలను దశలవారీగా మెరుగుపర్చనున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం 68 డివిజన్ల పరిధిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. చిన్న రైల్వే స్టేషన్లలో కూడా హై లెవల్ ప్లాట్ ఫారమ్లు, మంచి కెఫెటేరియా సౌకర్యంతో పాటు.. వెయిటింగ్ రూమ్ల సౌకర్యాన్ని మెరుగుపర్చడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూఫ్ ప్లాజాలు మరియు సిటీ సెంటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రైల్వే స్టేషన్ బయట ప్రణాళికబద్ధమైన పార్కింట్, లైటింగ్ వ్యవస్థను మెరుగుపర్చడం, రైళ్ల రాకపోకలను తెలియజేసేలా డిజిటల్ బోర్డులు, దివ్యాంగుల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖద్వారాల పరిధిని పెంచి.. గాలి వెలుతురు చొరబడేలా ఆహ్లాదకరమైన ప్రాంగణాల్లా స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు.
ఆహ్లాదకరమైన అనుభూతిని..
ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా చిన్న రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందడంతో పాటు, ఎన్నో అదనపు ప్రయోజనాలు ప్రయాణీకులకు లభించనున్నాయి. ప్రణాళికలో భాగంగా డివిజనల్ రైల్వే మేనేజర్లతో ప్రత్యేక నిధినిఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం కింద స్టేషన్లలో రూఫ్ ప్లాజా, సిటీ సెంటర్లను నిర్మించి ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లుక్ వచ్చేలా డిజైన్లను విడుదల చేశారు. స్టేషన్ ముందు భాగం పునర్నిర్మించడంతో పాటు రైల్వే ట్రాక్ల సంఖ్యను పెంచారు. మొత్తంగా చిన్న రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయనుంది రైల్వే శాఖ. ఈ పథకం పూర్తయితే, ఇక చిన్న చిన్న రైల్వేస్టేషన్లలోనూ మల్టికాంప్లెక్స్లలో పొందే అనుభూతిని పొందొచ్చన్నమాట!