వర్షాకాలం తీర్చిదిద్దే అందం ఓర్చా కోట సొంతం. చారిత్రక నిర్మాణాల నిలయంగా చెప్పుకునే ఈ ప్రాంతంలో చినుకుపడితే ప్రకృతి అందాలు రెట్టింపు ఉత్సాహంతో సందర్శకులను ఆహ్వానిస్తాయి. వినసొంపైన పక్షుల కిలకిలా రావాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. చారిత్రక నిర్మాణాల మాటున దాగిన ఆ ప్రకృతి అందాలను మనమూ చూసేద్దాం.
వారసత్వ నిలయం.. ఓర్చా
వర్షాకాలంలో భేత్వా నది పునరుజ్జీవం పొందాక.. మధ్యప్రదేశ్లోని ఓర్చా కోట ప్రాంతమంతా కొత్త రూపు సంతరించుకుంది. అందుకు కారణం లేకపోలేదు. ఓర్చా కోట భేత్వా నది మధ్యలో ఉన్న దీవిలో ఉంటుంది. అందుకే చినుకు తాకితే, ఈ నదిని ఆనుకుని ఉన్న కట్టడాలకు కొత్త శోభ వస్తుంది. ఇక ఈ ఓర్చా మొత్తం రాజమహళ్లు, ప్యాలెస్లతో కళకళలాడుతుంటుంది. ఓర్చా నగరాన్ని ఇప్పటికే హిస్టారిక్ అర్బన్ ల్యాండ్ స్కేప్ ప్రాజెక్ట్ కింద యునెస్కో ఎంపిక చేసింది. సంస్కృతి మరియు వారసత్వాన్ని పరిరక్షిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతోన్న చారిత్రక నగరాల సమ్రగ అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది. ఓర్చా కోటను బుందేల్ ఛీఫ్తన్ రుద్రప్రతాప్ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ నిర్మాణం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులకు సైట్ సీయింగ్తో రోజు ఎలా గడిచిపోతుందో తెలియదు. అంతలా ఆకట్టుకుంటాయి ఇక్కడి కట్టడాలు.
తిప్పుకోలేని నిర్మాణశైలి..
కోట లోపలకు అడుగు పెట్టగానే అబ్బుపరచే కోట నిర్మాణ శైలి చూపుతిప్పుకోనీయదు. చారిత్రక రూపు సంతరించుకునేలా గోపురాలు, స్థంభాలు, బ్రాకెట్లు, గూళ్లతో ఇటుకలతోపాటు ఉద్వేగభరితమైన భావాలు ఈ కోటలో అడుగడుగునా తారసపడతాయి. ఈ కోట మొత్తంలో రాజ మహల్కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడున్న మరో ఎట్రాక్షన్ రామ రాజ దేవాలయం. గుడిగా మారిన ఈ రాజ ప్రసాదంలో రాముడిని దేవుడిగా కాకుండా రాజుగా కొలవటం ఈ ప్రదేశానికున్న విశిష్టత. జహంగీర్ మహల్, ఫూల్ బాగ్, రాయి ప్రవీణ్ మహల్, రాజమహల్, రాణిమహల్, సందర్మహల్, లక్ష్మీనారాయణ ఆలయం ఇలా ఇక్కడ వేసే ప్రతి అడుగులోనూ ఓ సరికొత్త చారిత్రక నిర్మాణం దర్శనమిస్తుంది. ఇక్కడి ఏ గోడలను తాకినా ఒక్కో ప్యాలస్కు ఒక్కో చరిత్ర పలకరిస్తుంది.
ఎన్నో జీవరాసుల
ఓర్చాలో సుమారు నలభైఆరు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ పర్యాటకులకు అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రకరకాల జంతువులతోపాటు రెండువందల రకాల పక్షిజాతులకు ఆవాసం నిలుస్తోంది. పక్షుల కిలకిలారావాలు ధ్వనించే ఈ ప్రాంతం అందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. అందుకే, ప్రకృతి ఒడిలో విహరించాలి అనుకునేవారికి ఇది ఓ స్వర్గంలా కనిపిస్తుంది. ఈ అడవిగుండా బేత్వా నది ప్రవహించటం మూలంగా సంవత్సరం పొడవునా అడవంతా పచ్చదనాన్ని సంతరించుకుని ఉంటుంది. ఇక శివపురిలోని మాధవ్ నేషనల్ పార్క్ యానిమల్ లవర్స్ చూడదగ్గ మరో ప్రదేశం. ఇదే పార్కులో వేట మధ్యలో సేదతీరేందుకు అప్పటి రాజు శివాజిరావు సిందియా కట్టించిన జార్జ్ కాజిల్ హంటింగ్ లాడ్జ్ పైకి ఎక్కాలి. ఇదే పార్క్ మొత్తంలో ఎత్తైన ప్రదేశం. ఇక్కడినుంచి చూస్తే అడవంతా స్పష్టంగా కనిపిస్తుంది.