చారిత్రక వైభవానికి సజీవ రూపం.. చౌమహల్లా ప్యాలెస్
అలనాటి పాలకుల వైభవానికి సజీవ రూపంగా దర్శనమిస్తోంది చౌమహల్లా ప్యాలెస్. హైదరాబాద్ పర్యటనలో ఈ అరుదైన నిర్మాణం సందర్శించదగిన పర్యాటక కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఈ పేరు వెనుక ఉన్న అసలైన అర్ధం నాలుగు రాజభవనాలు. ఉర్దూలో "చౌ" అంటే నాలుగు, "మహలేల్" అంటే రాజభవనాలు. చౌమహల్లా ప్యాలెస్ ఇరాన్లోని టెహ్రాన్ షా ప్యాలెస్ను పోలి ఉంటుంది.
దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం 18వ శతాబ్దంలో నిర్మించబడిన చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్లోని ప్రసిద్ధ సందర్శనా స్థలాలలో ఒకటిగా గుర్తింపుపొందింది. చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం 1857 నుండి 1869 మధ్య ఐదవ నిజాం, అఫ్జర్-ఉద్-దౌలా, అసఫ్ జావ్ V పాలనలో పూర్తయింది. ఈ ప్యాలెస్ వాస్తవానికి 45 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఉత్తరాన లాడ్ బజార్ నుండి దక్షిణాన అస్పాన్ చౌక్ రోడ్ వరకు ఉండేది. అయితే, ఇప్పుడు, ప్యాలెస్ యొక్క మొత్తం విస్తీర్ణం దాదాపు 12 ఎకరాలు మాత్రమే. రాజభవనాన్ని ప్రభుత్వం పునరుద్ధరించి, 2005 సంవత్సరంలో ప్రజలకు సందర్శనార్థం తెరిచింది. ప్రతి శుక్రవారం మరియు జాతీయ సెలవు దినాల్లో మినహా వారం పొడవునా ప్యాలెస్ని సందర్శించవచ్చు.
చౌమహల్లా ప్యాలెస్ ఆర్కిటెక్చర్
చౌమహల్లా ప్యాలెస్ ఉత్తర ప్రాంగణం, దక్షిణ ప్రాంగణంగా విభజించబడిన రెండు ప్రాంగణాలను కలిగి ఉంది. దక్షిణ ప్రాంగణంలో అఫ్జల్ మహల్, తహ్నియాత్ మహల్, మహతాబ్ మహల్ మరియు అఫ్తాబ్ మహల్ అనే నాలుగు రాజభవనాలు ఉన్నాయి. అఫ్తాబ్ మహల్ రెండంతస్తుల భవనం. ఇది నాలుగింటిలో పెద్దది.
ఉత్తర ప్రాంగణంలో బారా ఇమామ్, తూర్పు వైపున అనేక గదులతో కూడిన పొడవైన కారిడార్ను చూపరును ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పరిపాలనా విభాగం. ఈ ప్రాంగణంలోని మరో ఆకర్షణీయమైన భాగం షిషే-అలత్. ఇది అతిథుల కేటాయించబడిన స్థలం. చౌమహల్లా ప్యాలెస్లో క్లాక్ టవర్, కౌన్సిల్ హాల్ మరియు రోషన్ బంగ్లా ఉన్నాయి. రోషన్ బంగ్లాకు ఆరవ నిజాం తల్లి రోషన్ బేగం పేరు పెట్టారు. ప్యాలెస్ కట్టినప్పటి నుండి ప్రసిద్ధి చెందిన ఖిల్వత్ క్లాక్ టవర్ లోపల కనిపిస్తుంది.
నిజాం కాలం నాటి చిత్రాలు
కౌన్సిల్ హాలులో నిజాం వ్యక్తిగత సేకరణలైన వివిధ మాన్యుస్క్రిప్ట్లు మరియు అరుదైన పుస్తకాలు ప్రదర్శనకు ఉంచబడ్డాయి. ప్యాలెస్లోని వివిధ గ్యాలరీలలో బట్టలు, ఫర్నిచర్, నాణేలు, కరెన్సీ నోట్లు, నిజాం కాలం నాటి చిత్రాలు మొదలైన ఆసక్తికరమైన వస్తువులను చూడవచ్చు. పురాతన ఆయుధాల ప్రదర్శన ప్రత్యేకంగా ఆసక్తికరమైన రీతిలో దర్శనమిస్తాయి.
అంతేకాదు, ఇవి కేవలం గ్లాస్ క్యాబినెట్ లోపల మాత్రమే కాకుండా గోడలపై కూడా ప్రదర్శించబడతాయి. ఖురాన్ విభాగంలో జపనీస్ టెక్నిక్, నాస్ఖ్ లిపి, లోహంతో ముద్రించిన సూక్ష్మ ఖురాన్లు ఉన్నాయి. కొన్ని బంగారంతో చెక్కబడినవాటిని కూడా ఇక్కడ చూడవచ్చు.
ప్రధాన ఆకర్షణ ఖిల్వత్ ముబారక్
ప్యాలెస్లో ప్రధాన ఆకర్షణను ఖిల్వత్ ముబారక్ అంటారు. ఈ దర్బార్ హాల్ ప్యాలెస్లోని అత్యుత్తమ భాగంగా చెప్పబడుతుంది. మొఘల్ గోపురాలు, గంభీరమైన తోరణాలు, ఆశ్చర్యపరచే పెర్షియన్ పనితీరు ఒక కళాఖండాన్ని సృష్టించిన అనుభూతిని కలిగిస్తాయి. దర్బార్ హాల్ లోపల పాలరాతితో చేసిన వేదిక ఉంది.
ఈ వేదికపైనే రాజ పీఠం తఖ్త్-ఎ-నిషాన్ ఏర్పాటు చేశారు. చౌమహల్లా ప్యాలెస్లో దాదాపు 7000 మంది పరిచారకులు ఉండేవారని చెబుతారు. దాని వైభవం, గొప్పతనం దగ్గరగా చూసేవారికి అరేబియన్ నైట్స్లోని ఎన్చాన్టెడ్ గార్డెన్స్ గుర్తుకువస్తాయి.
ప్యాలెస్కి ఎలా చేరుకోవాలి
చౌమహల్లా ప్యాలెస్ చేరుకోవడం కష్టమైన పని కాదు. ఇది హైదరాబాద్లోని మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ చార్మినార్కు చాలా దగ్గరగా ఉంది . నాంపల్లి/హైదరాబాద్ MMTS స్టేషన్ సమీపంలోనే ఉంటుంది. స్టేషన్ నుండి ప్యాలెస్కి ఆటోలు అందుబాటులో ఉంటాయి.