ఢిల్లీ.. చంఢీగఢ్ల మధ్య కొలువుదీరిన పర్యాటక ప్రదేశాలు
ఢిల్లీ నుంచి చండీగఢ్ చేరుకునేలోపు అత్యంత అందమైన ప్రదేశాలలో చాలానే ఉన్నాయి. అందమైన తోటలు, సరస్సులు, జలపాతాలు, పచ్చదనం నిండిన అనేక అద్భుతమైన ప్రదేశాలకు చిరునామా.
ముఖ్యంగా చండీగఢ్లో ఉన్న సుఖ్నా సరస్సు మరియు రాక్ గార్డెన్లు ఈ సీజన్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. దీని చుట్టూ చాలా ప్రదేశాలు ఉన్నాయి. పిల్లలతో సరదాగా గడిపేందుకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను చూద్దాం.
నహన్
ఒకప్పుడు రాచరిక రాష్ట్రమైన సిర్మూర్ రాజధాని నహన్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న గంభీరమైన హిల్ స్టేషన్. నిర్మలమైన సరస్సులు, దేవాలయాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం కొండల అందాలను ప్రతిబింబిస్తుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటే మాత్రం చండీగఢ్ సమీపంలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్లను తప్పకుండా సందర్శించాలి. ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ చేసేటప్పుడు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రదేశం చండీగఢ్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, ప్రధాన కేంద్రం నుంచి కేవలం రెండు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి అయితే, నహాన్కి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది
పర్వానూ
కుటుంసమేతంగా విహారయాత్రకు ప్లాన్ చేస్తే పర్వానూ చెక్కేయండి. చండీగఢ్ నుండి కేవలం గంట దూరంలో ఉన్న పింజోర్ నుండి పర్వానూ వరకు కొత్తగా నిర్మించిన బైపాస్ రోడ్డు మార్గంలో ఇక్కడకు చాలా త్వరగా చేరుకోవచ్చు. ఈ ప్రదేశం టింబర్ ట్రైల్ మరియు కేబుల్ కార్ రైడ్కు ప్రసిద్ధి చెందింది. పర్వానూ జామ్లు, జెల్లీలు మరియు మార్మాలాడే వంటి పండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఉన్న భారీ పండ్ల తోటలు పిల్లలను ఎంతో ఆకర్షిస్తాయి. ఇది చండీగఢ్లోని ముఖ్యమైన హిల్ స్టేషన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఢిల్లీ నుండి పర్వానూ చేరుకోవడానికి ఆరు గంటల సమయం పడుతుంది.
మోర్ని-కొండలు
హర్యానాలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ మోర్ని హిల్ స్టేషన్. ఇది చండీగఢ్కు చాలా దగ్గరగా ఉంటుంది. చండీగఢ్ నుండి ఇక్కడ గంటలో చేరుకోవచ్చు. ప్రకృతిసిద్ధమైన ఆహ్లాదాన్ని పొందేందుకు ఈ ప్రదేశం ఉత్తమమైనది. కుటుంబసమేతంగా మంచి క్షణాలను ఇక్కడ గడపవచ్చు. కొండపై ఉన్న పట్టణ అందాలు ఎంతో ఆకర్షిస్తాయి. విభిన్నమైన వృక్షసంపద, జంతుజాలాలకు ఈ ప్రాంతం ఆవాసంగా నిలుస్తోంది. చండీగఢ్కు సమీపంలో ఉన్న ఉత్తమ హిల్ స్టేషన్ ఇది. పిల్లలతో బోటింగ్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాలు చేయవచ్చు. ఢిల్లీ నుండి మోర్ని హిల్స్కి చేరుకోవడానికి ఆరు గంటల సమయం పడుతుంది.
బరోగ్
చండీగఢ్ సమీపంలోని బరోగ్ హిల్స్టేషన్ వెళితే పర్వత శిఖరాలను తాకిన అనుభూతి కలుగుతుంది. బరోగ్లో అనేక హోటళ్లు మరియు రిసార్ట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రెక్కింగ్, ఫారెస్ట్ వాక్ మొదలైనవి కూడా చేయవచ్చు. హిమాలయ శ్రేణుల మధ్య నెలకొని ఉన్న బరోగ్, నగర జీవితంలోని ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి సరైన ప్రదేశం. పర్యాటకుల రద్దీ నుండి తప్పించుకోవడానికి వారాంతాల్లో కాకుండా సాధారణ రోజుల్లో ఇక్కడికి చేరుకోవాలి. చండీగఢ్ నుండి బరోగ్కు దూరం రెండు గంటలు, ఢిల్లీ నుండి బరోగ్ చేరుకోవడానికి ఆరు గంటల సమయం పడుతుంది.
కసౌలి
చండీగఢ్ సమీపంలో సందర్శించడానికి ఉన్న చిన్న హిల్ స్టేషన్ల జాబితాలో హిమాచల్లోని సోలన్ జిల్లాలో ఉన్న కసౌలి ఒకటి. కసౌలి హిల్ స్టేషన్ యొక్క అతి ముఖ్యమైన ఆకర్షణ మంకీ పాయింట్. దీని చుట్టూ హార్స్ చెస్ట్నట్ మరియు హిమాలయన్ ఓక్ అడవులు ఉన్నాయి. అలాంటి ప్రదేశం పిల్లలకు చూపించడానికి సరైనది. చండీగఢ్ నుండి కసౌలి రెండు గంటల దూరంలో ఉంది. ఢిల్లీ నుండి కసౌలికి ఆరు గంటల సమయం పడుతుంది.