ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
ఎక్కడో మహాబలేశ్వరంలో పుట్టిన కష్ణానది పాయలుగా చీలి హంసలదీవి పరిసర ప్రాంతాల్లో సముద్రంలో విలీనం అవుతుంది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు చిహ్నంగా హొయలొలికే సముద్ర, నదీ తీర అందాలకు కొదవేలేదు. మహారాష్ట్రలో పుట్టి.. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ.. లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్నో పట్టణాలు, నగరాలకు తాగునీరు అందిస్తున్న కృష్ణా నది.. కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డకు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంసలదీవికి ఈ సీజన్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తన ప్రయాణంలో ఎన్నో వైవిధ్యతను చూపిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు వరదాయినిగా మారిన కృష్ణా.. సాగరంలో కలిసే చోటు అందమైన ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా అలరారుతోంది. ఎంత దూరం ప్రయాణించినా.. చివరికి అంతిమ గమ్యం చేరాల్సిందే అనే జీవిత సత్యాన్ని బోధిస్తున్న కృష్ణమ్మ అంతరార్థం యావత్ మానవాళికి దిక్సూచిలా మారింది. వేలకిలోమీటర్లు పరవళ్ళు తొక్కుతూ కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం హంసలదీవిలో కలుస్తుంది. దీనిని చాలా పవిత్ర స్ధలంగా భావిస్తారు.
దేవతలు నిర్మించిన ఆలయంగా..
ఈ ప్రాంతంలోని కష్ణమ్మ తల్లి విగ్రహాలకు విహారయాత్రలకు వచ్చే యాత్రీకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కోడూరు మండల పరిధిలోని హంసలదీవి గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయం దేవతలు నిర్మించారనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఈ స్వామిని దర్శించుకుంటే అనుకున్న పని తప్పనిసరిగా జరుగుతుందని యాత్రీకుల నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి యాత్రీకులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. గుడిలో ప్రత్యేక పూజల అనంతరం ప్రతి ఒక్కరూ సాగర తీరానికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
వివిధ ప్రాంతాల నుంచి హంసలదీవి బీచ్ వద్దకు వచ్చిన పర్యాటకులకు సముద్రంలో స్నానాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెరైన్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సముద్ర తీరాన ఉన్న మత్స్యకార గ్రామాలకు వెళ్లి మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సులు నిర్వహించి జాగ్రత్తలు చెబుతుంటారు. యాత్రీకులు బీచ్ వద్ద స్నానాలుచేసేటప్పుడు ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించిన తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకునే అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంచుతారు.
అరుదైన సముద్ర తాబేళ్ల పెంపకం
తాబేళ్ళు సముద్రంలో అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు హంసలదీవి సాగర తీరాన గత కొన్ని సంవత్సరాలుగా తాబేళ్ల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సాగరానికి వచ్చినప్పుడు తాబేళ్ల పిల్లలను అటవీశాఖ అధికారులు సముద్రంలోకి వదులుతారు. వీటిని చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమ వారు అనేక సార్లు సినిమాలను తీశారు. షార్ట్ ఫిలిమ్స్ కు ఈ ప్రాంతం చాలా బాగుంటుందని పలువురు సినీ డైరెక్టర్ల అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉల్లిపాలెం-భవానీపురం గ్రామాల మధ్య రూ.
77 కోట్లతో వారధిని నిర్మించారు. ఈ వారధి ప్రక్కన కష్ణానదికి అతి సమీపంలో ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్దదైన 27 అడుగుల తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హంసలదీవి బీచ్ వద్దకు వచ్చిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో తప్పనిసరిగా ఇక్కడ ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆగి, సెల్ఫీలు దిగి అక్కడ ఉన్న స్టాళ్ల వద్ద కుటుంబ సభ్యులతో కొంత సమయం ఆనందంగా గడుపుతుంటారు.