మ్యూజియంగా ఆహ్వానిస్తోంది.. కృష్ణాపురం ప్యాలస్!
అది ఓ పురాతన రాజనివాసం. రాచరికపు వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనం. భవిష్యత్తు తరాలకు చారిత్రక విశేషాలను చేరువ చేసే సాధనం. అందుకే పేరుకు ప్యాలస్ అయినా అక్కడ వేసే ప్రతి అడుగూ జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతులను మదిలో పదిలపరుస్తుంది. కేరళ మాటున దాగిన కృష్ణాపురం ప్యాలస్ విశేషాలను తెలుసుకుందాం రండి!
మన దేశంలోని కేరళ రాష్ట్రంలో చారిత్రక నిర్మాణాలకు కొదవేలేదు. ఇక్కడి పురాతన కట్టడంగా పేరుపొందిన కృష్ణాపురం ప్యాలస్ "కాయంకులం" రాజ కుటుంబానికి నివాస స్థలంగా ఉండేది. 18వ శతాబ్దంలో ఈ ప్యాలెస్ ను పాలించిన "అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ" ట్రావెన్కోర్ రాజవంశానికి చెందినవారు. అలనాటి రాచరికపు ఠీవీ నేటికీ అక్కడి ప్యాలస్లో తారసపడుతుంది. ఈ ప్యాలస్లో ప్రధానంగా పరిశీలించాల్సింది భవన నిర్మాణ శైలి. విలక్షణంగా కనిపించే ప్యాలెస్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపుగా ఒంగి ఉన్నట్లు కనిపించే పైకప్పులు, ఇరుకైన కారిడార్లు, కిటికీలకు నిలువుగా ఏటవాలు పైకప్పుతో కన్యాకుమారి పద్మనాభపురం రాజభవనాన్ని పోలి ఉంటుంది ఈ నిర్మాణం. ఈ కారణంగానే నేటికీ సందర్శకులను అకట్టుకుంటుందని స్థానికులు చెబుతుంటారు.

మ్యూజియంగా సేవలు..
ప్రస్తుతం ప్యాలెస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. అంతేకాదు, ఈ రాజభవనం మ్యూజియంగా సేవలు అందిస్తోంది. ఇందులో అనేక కళాఖండాలు, రాజ కుటుంబం ఉపయోగించిన వస్తువులు ప్రదర్శిస్తారు. ఏటా దేశవిదేశాలనుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ మ్యూజియం ప్రధాన ఆకర్షణలలో "గజేంద్ర మోక్షం" ఒకటి. ఇది కేరళలో అతి పెద్ద కుడ్యం. గజేంద్ర మోక్షం అంటే అర్థం "ఏనుగుకు కలిగిన మోక్షం". ఇది హిందూ మత పురాణాల నుంచి తీసుకున్న కుడ్యంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ చూడవలసిన వస్తువులలో మరో ముఖ్యమైనది కాయంకులం ఖడ్గం. ఇతర ఆయుధాల కంటే ఇది మరింత ప్రమాదకరమైనది. దీని రెండు భుజాలు బాగా పదునుగా, బరువుగా ఉంటాయి. నేటికీ చెక్కుచెదరని ఆకర్షణీయమైన దీని నిర్మాణశైలి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాదు, చెక్కతో నిర్మించిన కొన్ని కళాఖండాలు చూపు తిప్పుకోనీయవు.

చారిత్రక విగ్రహం..
ఈ మ్యూజియంలో బుద్ధ మండపం అనే హాలులో బుద్ధుని అరుదైన విగ్రహం కనిపిస్తుంది. సహజత్వానికి దగ్గరగా దర్శనమిచ్చే ఈ విగ్రహానికి చాలా చరిత్ర ఉందని స్థానికులు విశ్వసిస్తారు. అలప్పుజ చెరువుల నుంచి వెలికితీసిన నాలుగు విగ్రహాలలో ఇది ఒకటి. మ్యూజియం ఇతర ప్రదర్శనలలో భాగంగా ట్రావెన్కోర్ రాజ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు సందర్శనార్థం అందుబాటులో ఉంచారు. వారు వినియోగించినట్లు చెప్పే సంస్కృతంలోని బైబిల్ కాపీని ఇక్కడ చూడొచ్చు. దీంతోపాటు అలనాటి నూనె దీపాలు, సూక్ష్మ సంఖ్యలు, పాత్రలతోపాటు ఇతర అంశాలకు సంబంధించిన వివిధ వస్తువులు చూడవచ్చు. చారిత్రక విశేషాలను ఆస్వాదించేందుకు ఈ మ్యూజియం ఉత్తమమైన ఎంపిక.
కేరళలోని కృష్ణాపురం భవనం అలప్పుజ నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న "కాయంకులం" వద్ద ఉంది. రాజభవనం సమీపంలోని విమానాశ్రయం తిరువునంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది రాజభవనం నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు నిత్యం ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications












