కంబన్ రామాయణ కథలకు కేరాఫ్ అడ్రస్ .. కేరళ పర్యాటకం!
కేరళ ప్రయాణంలో మాకు ఎదురైన అనుభవాలు ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే తుఫానుల ప్రభావం ఇక్కడ ఎక్కువ. అలాంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని తిరిగి పర్యాటకులను స్వాగతించడానికి నిత్యం సిద్ధమవుతోంది. ఈ శక్తి కేరళలోని ప్రతి ప్రాంతంలో కనిపిస్తుంది. నేను మూడేళ్ల క్రితం కేరళ వెళ్లాను. అంతరించిపోతోన్న కంబన్ రామాయణ కథలు వంటి కళలకు తిరిగి జీవం పోయాలనుకుంటున్న అక్కడి వారి కృషి అభినందనీయం. ఇక్కడి ప్రకృతి అందాలు, చరిత్ర, ప్రజల ప్రేమానురాగాలు, పలకరింపులు, వ్యవహారశైలి మళ్లీ కేరళవైపు మా అడుగులు పడేలా చేశాయి. ఇది కేరళలో మా రెండవ రోజు పర్యటన.చారిత్రక నేపథ్యం అమోఘం
కేరళలో కళల విభిన్న రూపాలు మనకి కనిపిస్తాయి. కొన్ని కళలు ప్రస్తుతం కనుమరు గవుతున్నాయి. అందులో షాడో పప్పెట్రీ ఒకటి. ఇది షాడో తోలుబొమ్మ. ఇందులో కళాకారులు వెలుతురు సహాయంతో లెదర్తో తయారుచేసిన తోలుబొమ్మలను ఉపయోగించి, మాయా అనుభూతిని సృష్టిస్తారు. ఈ కళలు కేరళలోని పలక్కడ్, మల్లాపురం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జిల్లాల వైపుగా ప్రవహించే నీలా నది తీరాన ఉన్న దేవీ భద్రకాళీ మందిరాల్లో వీటి ప్రదర్శనలిస్తారు. ముఖ్యంగా కంబన్ రామాయణం కథలు ఎక్కువగా చూపిస్తారు. కానీ, ఇప్పుడు ఈ కళ క్రమంగా కనుమరుగువుతోంది. ఈ కళను చేసే పూజారి సొసైటీకి చెందిన వాళ్లు అతికష్టంగా 20-25 మందే ఇప్పటికీ ఈ కళను బతికిస్తున్నారు. మా కేరళ ప్రయాణంలో ఈ కళ గురించి తెలిసిన కళాకారుడు రామచంద్ర పూజారిని కలుసుకోగలిగాం. ఈ కళ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. రామచంద్ర పూజారి తన నలుగురి కొడుకులతో ఈ కళను బతికిస్తున్నారు. దీనికోసం ఆయన సంప్రదాయాల నుంచి బయటికొచ్చి, ఆధునిక విషయాల గురించి కూడా ప్రదర్శిస్తున్నారు.
అలాంటి కళలలో మరో కళ నొక్కు విద్య పవక్కలీ. పై పెదవి మీద కర్రను నిలిపి, దాని మీద బొమ్మలను ఆడించే కష్టతరమైన ఆట ఇది. నొక్కు అంటే చూపు, విద్య అంటే తెలిసిందే, పవక్కలీ అంటే బొమ్మలాట అని అర్థం. అంతరించిపోతోన్న కళల జాబితాలో ఇది చేరింది. ప్రస్తుతం ఈ కళను బతికిస్తోన్నది ఒక అమ్మాయి. ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత మూలిక్కల్ పంకజాక్షి వారసురాలు కె ఎస్ రెంజనీ. ఈమె ఈ కళ అంతరించిపోకుండా కాపాడేందుకు కృషిచేస్తోంది.
ఈ ప్రాచీన భూమిపై కాలు మోపాల్సిందే
కేరళ వివిధ సంస్కృతుల సమ్మేళన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. కొచ్చిలోని మట్టనచేరీ ప్రాంతానికి వెళితే వేల సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలా ఉన్నట్లుంటుంది. అప్పట్లో రోమ్, అరబ్ వ్యాపారులు మసాల వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చేవారట! రోమన్ సామ్రాజ్యం నుంచే కేరళ నల్లమిరియాలు, యాలకులు, లవంగాలు లాంటి మసాలాల కోసం యూరోప్ వచ్చేదట! యహూదీ వ్యాపారులు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఉండేవారట! ఇలాంటి ఎన్నో ప్రాముఖ్యతలు సంతరించుకున్న కేరళ గాలిని తాకాలంటే ఒక్కసారి ఈ ప్రాచీన భూమిపై కాలు మోపాల్సిందే కదా! అక్కడి నుంచి మరికొన్ని పర్యాటక ప్రదేశాల్లో ప్రకృతి అందాలతోపాటు అక్కడి చారిత్రక నేపథ్యాన్ని మా మనస్సుల్లో పదిలపరుచుకుని తిరుగు ప్రయాణమయ్యాం.