కాకతీయుల శిల్పకళా వైభవానికి రామప్ప దేవాలయం ప్రత్యక్ష నిదర్శనం. ఈ రామప్ప దేవాలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు 157 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలోనే ఈ పుణ్యక్షేత్రం ఉంది. రామప్ప దేవాలయం అటు శిల్పకళకే కాకుండా ఇక్కడ లింగరూపంలో కొలువైన ఈశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరొందాడు.
అందువల్ల ఈ రామప్ప దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా. ఇక్కడ దొరికిన రాతిశాసనాలను అనుసచించి ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య కట్టించారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం అన్నే వింతలు విశేషాలతో కూడుకొన్నది. ఆ వివరాలన్నీ మీ కోసం....
800 ఏళ్లకు పై బడిన దేవాలయం
P.C: You Tube
రామప్ప దేవాలయం నిర్మించి ఇప్పటికి దాదాపు 800 ఏళ్లకు పై బడింది. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1213 నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు సాగింది. ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత సుమారు 100 ఏళ్లపాటు ఈ దేవాలయంలో నిత్య పూజలు జరిగాయి. అయితే అటు పై క్రీస్తుశకం 1910 వరకూ ఈ ఆలయంలో దీపారాధన కూడా జరగలేదు. అయితే 1911లో అప్పటి నిజాం ప్రభుత్వం రామప్ప ఆలయ విశిష్టతను గుర్తించి తిరిగి రామప్ప దేవాలయాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది.
నీటిలో తేలియాడే ఇటుకలు
P.C: You Tube
మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో దైవం పేరుమీద కాకుండా ఈ శివాలయంలోని శిల్పాలను చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరుమీద ఈ ఆలయం ఉండటం విశేషం. ఈ దేవాలయాన్ని ముఖ్యంగా ఆలయ గోపురాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఈ ఇటుకలు నీళ్లలో వేస్తే తేలుతాయి. ఇటువంటిది దేశంలో మరెక్కడా చూడలేము. ఈ ఆలయం ముందు ఉన్న నంది విగ్రహాన్ని మనం ఏ వైపు నుంచి చూస్తున్నా తిరిగి ఆ నంది మనలనే చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
కాంతి పరావర్తనం ద్వారా
P.C: You Tube
చాలా దేవాలయాల్లోని గర్భగుడిలో వెలుతురు సామాన్యంగా ఉండు. అయితే ఈ ఆలయంలోని గర్భగుడిలో మాత్రం ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకూ గర్భగుడిలోని రామలింగేశ్వరుడు కాంతివంతంగా దర్శనమిస్తాడు. ఆలయంలో ఏర్పాటు చేసిన మంటపంలోని స్తంభాల పై పడే సూర్యకాంతి పరావర్తనం చెంది గర్భగుడిలోని శివలింగం కాంతివంతంగా దర్శనమిస్తుంది. దీన్ని బట్టి ఆ స్తంభాలు ఎంత నునుపుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈజిప్టు మమ్మీలు
P.C: You Tube
రామప్ప ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి. ఈ దేవాలయంలోని శిల్పాలను నిశితంగా పరిశీలిస్తే, త్రేతాయుగ, ద్వాపర యుగాలకు చెందిన చరిత్ర, జైన, బౌద్ధ మతాలకు చెందిన ఎన్నో అంశాలు మనకు అవగతమవుతాయి. ముఖ్యంగా ఈజిప్టు మమ్మీలను కూడా ఈ శిల్ప సంపదలో మనం గమనించవచ్చు. ఆలయం తూర్పు ముఖద్వారం వైపు గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గర్భగుడికి ఎడమవైపున ఉన్న పొన్న చెట్టు శిల్పాన్ని చేతి వేళ్లతో గీటితే సరిగమపపదనిస అనే సంగీత స్వరాలు వినిపిస్తాయి.
ఇలా చేరుకోవచ్చు.
P.C: You Tube
హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు హన్మకొండకు చేరుకొని అక్కడి నుంచి ములుగుకు చేరుకోవాలి. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ములుగు నుంచి ప్రైవేటు వాహనాల్లో రామప్పగుడికి వెళ్లవచ్చు. రామప్ప దేవాలయాన్ని సందర్శించే పర్యాటకుల కోసం పర్యాటక శాఖ దేవాలయం పక్కనే ఉన్న చెరువు పై కాటేజీలను నిర్మించింది. అంతేకాకుండా హరిత హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.