ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక ఓడ.. గంగా విలాస్ వచ్చేస్తోంది!
ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ ఓడ గంగా విలాస్ తన సుదూర ప్రయాణానికి సిద్ధమయింది. సామాన్యులకు సైతం నదీ అలలపై విహారపు అనుభూతులను పంచేందుకు గంగా విలాస్ రూపొందించబడింది. ఈ విహార నౌకని గంగా నది నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జెండా ఊపి ప్రారంభించనున్నారు. 'గంగా విలాస్' నౌక ఉత్తరప్రదేశ్లోని వారణసిలో బయలుదేరి బంగ్లాదేశ్ గుండా అసోంలోని దిబ్రుగర్ చేరుకుంటుంది. మొత్తం 50 రోజుల్లో భారత్, బంగ్లాదేశ్లోని 27 నది వ్యవస్థల్లో 3200 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది.
ప్రపంచ వారసత్వ ప్రదేశాలు సహా ప్రముఖ చారిత్రక కట్టడాలైన 50కిపైగా ప్రాంతాల గుండా ఈ నౌక నాలుగువేల కిలోమీటర్ల మేర నదీజాలాల్లో విహరించనుంది. ఈ అద్భుత యాత్ర సాగించే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన క్రూజ్ షిప్ ఓ ప్రపంచ వింతగా ప్రసిద్ధి చెందబోతోంది. సంపన్నులు పెద్ద పెద్ద క్రూజ్ షిప్పుల్లో సముద్రయానాలు చేస్తూ జలవిహారాన్ని ఆస్వాదిస్తుంటారు.
అయితే, సామాన్యులకు ఆ ఆనందాన్ని నదులపై తిరిగే పడవలే అందిస్తున్నాయి. ఒకటి రెండ్రోజుల పాటు లేదంటే వారం పాటు నదీవిహారాల్ని ఏర్పాటు చేస్తున్నాయి ఆయా రాష్ట్రాల్లోని పర్యటక శాఖలు. అయితే, గంగా విలాస్ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక ఓడగా రికార్డ్ సృష్టించబోతోంది. అందరికీ అందుబాటులో జీవితాంతం మర్చిపోలేని అనుభవాలను అందించే ఆ యాత్ర జ్ఞాపకాలను బహుశా మాటల్లో వర్ణించడం కష్టమే.
తొలి ప్రయాణం ఇలా ఉంటోంది..
గంగా విలాస్కు సంబంధించిన సమాచారం ప్రకారం 80 మంది ప్రయాణికుల సామర్థ్యమున్న లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌక ఇది. ఇందులో 18 సూట్స్తోపాటు ఇతర అనుబంధ వసతులు ఉన్నాయి. ప్రత్యేక డిజైన్, ముందుచూపుతో దీనిని నిర్మించారు. కాగా తొలి ప్రయాణానికి సంబంధించి విడుదల చేసిన సమాచారం ప్రకారం.. వారణసిలో బయలుదేరిన బక్సర్, రామ్నగర్, ఘాజీపుర్ గుండా 8వ రోజున పాట్నా చేరుకోనుంది.
పాట్నా నుంచి 20వ రోజున కోల్కతా చేరుకుంటుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి ఢాకా చేరుకోనుంది. బంగ్లాదేశ్ నది జలాల్లో దాదాపు 15 రోజులపాటు ఉండనుంది. ఆ తర్వాత మళ్లీ భారత్లోకి ప్రవేశించి గువహటి ద్వారా చివరకు దిబ్రుగర్లో యాత్ర ముగుస్తుంది.
జాతీయ పార్కుల గుండా ప్రయాణం
భారతదేశం- బంగ్లాదేశ్ 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణించే ఈ అతిపెద్ద పడవ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలను తాకుతూ ముందుకు సాగుతుంది. యాభై రోజుల్లో యాభై ప్రాంతాలను సందర్శించేలా ప్రయాణ మార్గాన్ని రూపొందించారు. అలానే, మనదేశంలో సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్పార్క్ సహా అనేక జాతీయ పార్కుల గుండా ప్రయాణిస్తుంది గంగా విలాస్ క్రూజ్.
ఇక షిప్లో ఆహ్లాదంగా గడిపేందుకు మ్యూజిక్, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ ఎయిర్ అబ్జర్వేషన్ డెక్తో పాటు ఇతర సర్వీసులు 'గంగా విలాస్'లో ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణంలో మొదలు నుంచి చివరి దాకా యాత్ర చేయాలనుకునే వారితో పాటు నిర్దేశిత ప్రాంతాల్లో దిగిపోవాలనుకునే వారికీ అవకాశం కల్పిస్తున్నారు. అంటే వారణాసిలో ఎక్కి పట్నాలో దిగిపోవచ్చు. పట్నాలో ఎక్కి కోల్కతాలో వీడ్కోలు పలకొచ్చు.