వనస్థలిపురము హైదరాబాదు నగరంలో కలదు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి 9 పై హైదరాబాదు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. నిజాం కాలంలో దీనిని శికార్ ఘర్ (వేటాడే స్థలం) గా పిలిచేవారు. అప్పుడు ఈ ప్రాంతమంతా అరణ్యాలతో, అటవీ మృగాలతో నిండి ఉండేది. దాని వల్లనే ప్రస్తుత నామం వన (అరణ్యాలు) స్థలి (ప్రదేశము) పురం (చోటు) గా స్థిరపడింది.
వనస్థలిపురంలో వున్న ప్రధాన ఆలయాలు
చిత్రకృప : Bhaskaranaidu
గణెష్ టెంపుల్ - ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర అనేక దేవాలయములు ఉన్నాయి. ఇంకా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరాలయం, సాయి బాబా ఆలయములు మూడు, కన్యకా పరమేశ్వరి ఆలయం, యల్లమ్మ దేవాలయము, మార్కొండాలయము,శ్రీ రామాలయము, రాఘవేంద్ర స్వామి వారి ఆలయము, పంచ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం (ఇది చాల పురాతనమైనది) చూడదగ్గవి.
గణేశ్ టెంపుల్, రైతు బజార్ మరియు ఎన్ జీ ఓస్ కొలోనైలా లోని బస్సు ప్రాంగణములు ఈ ప్రాంతములో ప్రముఖమైనవి. ఈ ప్రాంతము నందున్న రైతు బజారు చుట్టుపక్కల గ్రామాల నుంచి తెచ్చి అమ్మ బడే తాజా కూరగాయలకు ప్రసిద్ధి. యల్లమ్మ గుడి పక్కన్నే వున్న పెద్ద గుట్ట పై సోమనాథ ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. ఇందు శివ రాత్రిలో పెద్ద ఉత్సవం జరుగును.
చిత్రకృప : Bhaskaranaidu
ప్రజల వినోదార్థం ఇక్కడ "హరిణ వనస్థలి" పేరుతో జింకల పార్కు ఉంది. అందు అనేక జింకలు, ఇతర జంతువులు నెమళ్ళు అనేక పక్షులు ఉన్నాయి. మహావీరుని పేరున ఈ పార్కు ఏర్పాటు చేయ బడింది. అంతే గాక ఇక్కడ ఇతర పెద్ద పార్కులు ఉన్నాయి. అవి రాజీవ గాంధి పార్కు, వివేకానంద పార్కు, హూడా పార్కు, మొదలగునవి ఉన్నాయి.
హరిణ వనస్థలి జింకల పార్కు
హైదరాబాద్ నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారి పై ఆటో నగర్ ప్రక్కనే 3800 ఎకరాల విస్థీర్ణంలో వున్న ఈ జింకల పార్కు అటవీ శాఖ ఆధ్యర్యంలో ఉంది. హైదరాబాద్ పాలకులలో చివరి వాడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేటాడడానికి వుపయోగించిన దట్టమైన ఈఅటవీ ప్రాంతమే ప్రస్తుతం వున్న ఈ జింకల పార్కు. దీనినే "మహా వీర హరిణ వనస్థలి" అంటారు. ఇది దేశంలోనే అతి పెద్ద జింకల పార్కుగా ప్రసిద్ధి పొందింది. 1994 వ సంవత్సరంలో జాతీయ వనంగా గుర్తించారు.
చిత్రకృప : J.M.Garg
ఈ పార్కులో వందలాది కృష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, అనేక రకాల పాములు, అలాగే అనేక రకాల పక్షులు, సీతాకోక చిలుకలు ఉన్నాయి. సీతాకోక చిలుకలకు ప్రత్యేకమైన పార్కు ఉంది. ఇందులో వున్న అనేక రకాల ఔషధ మొక్కలు ఈ వనానికి వన్నె తెస్తున్నవి. ఇందున్న ప్రత్యేకమైన వృక్షాలు ఈ పార్కును కారడవులను తలపిస్తుంది. పర్యాటకుల వినోదార్థం ఇక్కడ వసతి గృహాలు, ఆహార శాలలు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో ఇందు వన భోజనాలు జరుగుతాయి. ఈ హరిణ వనస్థలి పేరుమీదనే "వనస్థలి పురం" ఏర్పాటు అయినది. నగరానికి తూర్పు దిశలో వున్న అతి పెద్ద విహార కేంద్రం ఈ హరిణ వనస్థలి.
వనస్థలిపురం ఎలా చేరుకోవాలి ?
హైదరాబాద్ లోని అన్ని ప్రదేశాల నుండి వనస్థలి పురం చేరుకోవటానికి సిటీ బస్సులు లభ్యమవుతాయి. కోఠి నుండి 100V నెంబర్ గల బస్సు, సికింద్రాబాద్ నుండి 1V నెంబర్ బస్సు, మెహదీపట్నం నుండి 156V బస్సు మరియు కెపిహెబి కాలనీ నుండి 187D/V బస్సులు వనస్థలిపురం వెళతాయి. సమీపాన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కలదు.