కేరళ అంటేనే ప్రకృతి పరవళ్ళు తొక్కే సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. పర్యాటక పరంగా ప్రసిద్ది చెందిన కేరళలో లెక్కలేనన్ని బీచ్ లు, లెక్కకు మంచిన వాటర్ ఫాల్స్, హిల్ స్టేషన్స్ ఉన్నాయి.
అవే కాదు, ఘుభాళించే కాఫీ, తేయాకు తోటలు, పచ్చని రబ్బరు తోటల సోయగాలు, పచ్చదనం పరుచుకుని కంటిచూపును తిప్పుకోనివ్వకుండా చేసే లోయలు..బ్యాక్ వాటర్ పై ఒకరోజు అలెప్పి పడవ ప్రయాణం, వన్య ప్రాణులు స్వర్గదామం తెక్కడి, మసాలా దినుసుల వాసనను పరిమళింపచేసే వనాలు, ఆధ్యాత్మికతను వెదజల్లే దేవాలయాలను చూడటానికి నిత్యం లక్షలాది మంది పర్యాటకులు పోటి పడుతుంటారు.
వీటితో సరితూగే విజింజమ్ కోవలం బీచ్ కి మూడు కిలోమీటర్ల కూత వేటు దూరంలో ఉన్న మత్స్యకారుల గ్రామాన్ని ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిందే.
విజింజమ్ గ్రామం ఆర్యుల కాలం నాటిది
విజింజమ్ గ్రామం ఆర్యుల కాలం నాటిది. దీన్ని దక్కించుకోవడానికి 850-1400మధ్య కాలంలో చెరా రాజవంశం కులశేఖర్ మరియు చోళుల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. చివరగా చోళులు దీన్ని వశపరచుకుని రాజధానికి మార్చుకుని పరిపాలించారు. ఈ గ్రామంలో 8-9శతాబ్దకాలంలో కోటను నిర్మించారు. కోటగోడను సముద్రానికి ఉత్తర పడమటి దిశలో ఇప్పటికీ మనం చూడవచ్చు.
సముద్ర తీరంలో పోర్చుగీస్ వారు నిర్మించిన చర్చి
ఈ కోట గోడ కొంత వరకూ చర్చ్ ని ఆనుకుని ఉండటంతో పోర్చుగీస్ కాలంలో దీన్ని నిర్మాణం చేపట్టినట్లు చరిత్రకారుల అంచనా. సహజసిద్దంగా ఏర్పడిన ఓడరేవుగా విజింజమ్ ప్రసిద్ది చెందినది. పురావస్తు త్రవ్వకాల్లో ప్రాచీన కాలంలో ఈ గ్రామం ఓ ప్రముఖ ఓడరేవుగా గుర్తించారు. రోమన్ల కాలంలో ఇక్కడి నుండి సముద్ర వర్తకం జరిగిందని పురావస్తు తవ్వకాల ద్వారా తెలుసుకున్నారు. ఈ సముద్ర తీరంలో పోర్చుగీస్ వారు నిర్మించిన చర్చి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రాతి గుహ
విజింజమ్ గ్రామంలో ఒక రాతి గుహ ఉంది. విజింజమ్ రాతి గుహలు, కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం నగరం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఇందులోని శిల్పాలు 18వ శతాబద్దానికి చెందినవిగా గుర్తించారు. ఈ గుహలోని ఆలయాన్ని ఒకే రాతితో చెక్కారు. ఈ రాతి గుహలో దక్షిణామూర్తి అవతారాలలో ఒకరైన విసంద్రా దక్షిణామూర్తి శిల్పం దర్శనమిస్తుంది.
ఆలయ బయటి గోడలపై శివుడు, పార్వతిల విగ్రహాలు
ఆలయ బయటి గోడలపై శివుడు, పార్వతిల విగ్రహాలు అసంపూర్తిగా చెక్కి ఉన్నాయి. కళాత్మకత ఉట్టిపడేలా ఉన్న మసీదు, చర్చి, అక్వేరియం లైట్ హౌజ్ చూస్తూ తీరం వెంట నడుస్తుంటే మనస్సుకు ఆహ్లాదరం..ఒక తెలియని అనుభూతి కలుగుతుంది.
మంచి నీటి అక్వేరియం
విజింజమ్ గ్రామంలో ఉన్న మంచి నీటి అక్వేరియం చాలా ప్రసిద్ది చెందినది. ఎందుకంటే ఇది ఓ అద్భుతమైన జలచరాల సంకలనం. పిల్లలు, పెద్దలకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. ముత్యపు ఉత్పాదన ప్రక్రియకు ఈ అక్వేరియం ప్రసిద్ధి చెందినది. ఈ ప్రక్రియలో షెల్ సిమెంట్ నుంచి తయారైన మూసను ముత్యపు చిప్పలోకి ప్రవేశపెడతారు. కొద్ది నెలల్లోనే ముత్యం మూస ఆకారంలో రూపుదిద్దుకుని ముత్యపు చిప్ప నుండి బయటపడుతుంది.
ఈ ఆక్వేరియంలో పీతలు, క్లౌస్, తాబేళ్ళు, ట్రిగ్గర్, సర్జన్, స్క్విరల్, బటర్ఫ్లై, మూన్ రాస్ లు, సొర తదితర చేపలు, ఫిరాన్హా వంటి అద్భుతమైన జలచరాలను ఈ అక్వేరియంలో చూడవచ్చు.
మత్సకారుల జీవన దృశ్యాలు
విజింజమ్ గ్రామంలో ప్రసుత్తం 2వేల మంది మత్సకారులు జీవనం సాగిస్తున్న ఈ ప్రదేశాన్ని సందర్శిచడం ద్వార ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.
సూర్యకిరణాలు సముద్రపు అలల మీద పరుచుకోక ముందే
సూర్యకిరణాలు సముద్రపు అలల మీద పరుచుకోక ముందే ఇక్కడికి చేరుకోవాలి. అప్పుడే వందలాది మరపడవలు బుట్టెడు బుట్టెడు చేపలతో తీరానికి చేరుకుంటాయి.సముద్ర తీరం గుండా నడుస్తూ మత్స్యకారుల గ్రామం మధ్యలోంచి రావడం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. వలలు అల్లడం, చేపలను ఐస్ ముక్కలతో ఫ్రీజ్ చేయడం, చేపలను ముక్కలు ముక్కలుగా కోయడం, కోయడానికి ఉపయోగించే కత్తులను నూరడం... మత్స్యకారుల జీవనానికి సంబంధించిన దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపిస్తుంటాయి.
విజింజమ్ ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం తిరువనంతపురం నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. క్యాబ్ లేదా సిటీ బస్సుల్లో ప్రయాణించి నగరం లోకి ప్రవేశించవచ్చు.
రైలు మార్గం తిరువనంతపురం ప్రధాన రైల్వే జంక్షన్ గా ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ వంటి నగరాలకు నిత్యం రైళ్లు అందుబాటులో ఉంటాయి.
రోడ్డు మార్గం తిరువనంతపురం నుండి సమీప నగరాలకు, పట్టణాలకు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు లభిస్తాయి. చిత్ర కృప : Binoyjsdk