కొద్ది కాలం పాటు భోపాల్ రాజ్యానికి రాజధానిగా ఉన్నందువల్ల ఇస్లాం నగర్ ఒక చారిత్రిక ప్రాధాన్యం వున్న నగరం. ఇది మధ్య ప్రదేశ్ లోని భోపాల్ జిల్లా లో, భోపాల్ – బేరసియా రోడ్డు మీద రాష్ట్ర రాజధాని నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వుంది. దీని గత వైభవానికి చిహ్నాలుగా మిగిలిన పాడుపడిన భవంతుల వల్ల ఇస్లాం నగర్ ప్రసిద్ది చెందింది. ఈ నగరానికి రవాణా సౌకర్యం బాగుంది.
ఇస్లాం నగర్ : అందమైన నగరం :
రాజపుత్రులు ఏలిన ఈ ప్రాంతాన్ని అసలు జగదీశ్ పూర్ అనేవారు. ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ 18వ శతాబ్దంలో ఈ నగరాన్ని చేజిక్కించుకున్నాడు. ‘ఇస్లాం కు చెందిన నగరం’ అని అర్ధం వచ్చే ఇస్లాం నగర్ అని అతను పేరు పెట్టాడు. భోపాల్ రాజ్యాన్ని అతడే స్థాపించి ఇస్లాం నగర్ ను తన రాజధానిగా ప్రకటించుకున్నాడు. అయితే 1723 లో నిజాముల్ ముల్క్ ఇస్లాం నగర్ కోటను తన అధీనంలోకి తెచ్చుకోవడంతో అతని పాలన కొద్ది కాలం పాటే సాగింది. చివరికి 1806 నుంచి 1817 వరకు ఇది సిందియాల పాలనలో వుంది. ఇప్పుడది భోపాల్ నియంత్రణలో వుంది. ఈ ప్రాంతంలోని భవంతులన్నిటి చుట్టూ అద్భుతమైన తోటలు వుంటాయి.
ఇస్లాం నగర్ లో పర్యాటకం
ఇస్లాం నగర్ లో ప్రధానంగా భవంతులే ఆకర్షణలు. చమన్ మహల్ అందం, రాణి మహల్ రాజసం, గోండ్ మహల్ నిర్మాణ కౌశలం ఇక్కడ చూసి తీరాల్సిన ప్రదేశాల్లో కొన్ని. భోపాల్ నుంచి నడిచే లోకల్ బస్సులు, ఆటో లలో ఇక్కడికి చేరుకోవచ్చు. పర్యాటకుల సౌకర్యం కోసం ఇక్కడ హోటళ్ళు, ఏ.టి.ఎం లు వున్నాయి. శీతాకాలంలో ఇస్లాం నగర్ సందర్శన సిఫార్సు చేయబడుతోంది.