గన్నవరం To గల్ఫ్ కంట్రీస్కు నేరుగా విమాన ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభవార్త. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక నెరవేరింది. సోమవారం నుండే విజయవాడ (గన్నవరం) నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఒమన్ నుంచి విజయవాడ విమాన సర్వీసు ప్రారంభం కానుంది. గతంలో ఒమన్ నుంచి హైదరాబాదు రద్దు చేసిన విమానాన్ని పునరుద్ధరించి హైదరాబాద్ మీదుగా విజయవాడకు నడపనున్నారు. అదేవిధంగా మరో విమానాన్ని కూడా విజయవాడ మీదుగా కేరళలోని కన్నూరుకు అనుసంధించారు.
ఇప్పటి వరకు దుబాయికి నేరుగా విమానం లేకపోవడంతో విజయవాడ, విశాఖ నుంచి హైదరాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి దుబాయి విమానం ఎక్కాల్సి వచ్చేది. లగేజీ, వెయిటింగ్ టైం.. ఇలా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఇకపై ఈ సమస్యలన్నిటికీ తెరపడింది.
దుబాయి, ఇతర ఎమిరేట్లలో పనిచేస్తున్న ప్రవాసాంధ్రుల సౌకర్యార్ధం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసు (ఐఎక్స్ 976) ప్రతి సోమ, శనివారాలు ఉదయం 11 గంటల నుంచి షార్జా నుంచి బయల్దేరి భారతీయ కాలమానం 4.25 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ నుంచి సాయంత్రం 6.35కు బయల్దేరి యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 9.05కు షార్జాకు చేరుకుంటుంది. ఈ షార్జా విమానానికి గన్నవరం విమానాశ్రయంలో మచిలీపట్నం ఎంపీ, ఎయిర్పోర్ట్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి స్వాగతం పలుకుతారు.
షార్జా వెళ్లే ప్రయాణికులకు ఆయన బోర్డింగ్ పాస్ లు ఇస్తారు. అలాగే, కువైట్ నుంచి ప్రతి బుధ, ఆదివారాలు ఐఎక్స్ 894 విమానం కువైట్ కాలమానం ప్రకారం ఉదయం 9:05 బయల్దేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
ఒమన్ రాజధాని మస్కట్ నుంచి విజయవాడకు ఐఎక్ 0444 విమానం ప్రతి గురువారం అర్ధరాత్రి 2.50కు బయల్దేరి హైదరాబాద్ మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. అలాగే, మరో విమానం మస్కట్ నుంచి ప్రతి మంగళవారం ఉదయం 11.05కు బయల్దేరి విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి కేరళలోని కన్నూరుకు వెళ్తుందని ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారు ప్రకటించారు. కాగా, విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించడం పట్ల దుబాయిలోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయి వెళ్లడం సమస్య కాకున్నా విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రయాణించడం కష్టతరంగా ఉండేదని దుబాయిలోని పలువురు తెలుగువారు చెబుతున్నారు.
ప్రయాణంలో లగేజీ, వెయిటింగ్ సమస్యలు తీవ్రంగా ఉండేవని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు నేరుగా విజయవాడ నుంచి షార్జాకు సర్వీసులు అందాబాటులోకి రావడం పల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇన్నేళ్లకు బెజవాడ కేంద్రంగా గల్ఫ్ ప్రయాణీకులు హ్యాపీగా విమానం యానం చేసే అవకాశం దక్కింది. మరెందుకు ఆలస్యం మీ గల్ఫ్ ప్రయాణాన్ని విజయవాడ నుంచే మొదలుపెట్టండి.