పాపికొండల పర్యాటక యాత్ర పునఃప్రారంభమయ్యిందోచ్
ఆహ్లాదకరంగా.. కుటుంబసమేతంగా.. గడిపేందుకు ఓ విహార యాత్రను ప్లాన్ చేస్తున్నారా.. అలలపై తేలియాడుతూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా.. మీకోసమే తెలంగాణ పర్యాటకశాఖ ఓ నిర్ణయం తీసుకుంది. గలగలాపారే గోదావరి అలలపై బోటులో సాగిపోయే పాపికొండల యాత్రను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తిరిగి ప్రారంభించింది. ఆ పర్యాటక విశేషాలను తెలుసుకుందాం.
అందమైన పాపికొండల మధ్య బోటు ప్రయాణం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది. పాపికొండల యాత్రలో పాపికొండలు చూడడం కంటే కూడా, పడవ ప్రయాణమే అత్యంత ఆకర్షణీయం. అసలు పాపి కొండలకి ఈ పేరు ఎలా వచ్చిందంటే. కొండల మధ్య ప్రవహించే గోదావరి మనం జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారట. అలా అలా పాపికొండలయ్యిందని అంటారు.
నదికి ఇరువైపుల ఎత్తయినకొండలు, దట్టమైన అడవి, నదిమద్యలో వెండిగిన్నెల మెరిసిపోయే ఇసుక తిన్నెలు, మధ్యలో పరవళ్లుతొక్కే గోదారిపై బోటులో షికారు చేయడం జీవితాంతం గుర్తుండిపోయే తీపిజ్ఞాపకాలు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతోనిండిన పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు పర్యాటకులు. అఖండ జలనిధితో వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరికి యెదురీధుతూ పడవ సాగుతుంది. అలాంటి అనుభూతిని మళ్లీ చేరువ చేసేందుకు తెలంగాణ టూరిజం శాఖ ముందకు వచ్చింది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారాన్ని పునరుద్ధరించినట్లు సంస్థ తెలిపింది.
ఇదీ టూర్ ప్లాన్..
ఈ ప్రయాణం ప్రతి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి బయలుదేరే బస్సుతో మొదలవుతుంది. అలా మరుసటి రోజు (శనివారం వేకువజామున ఐదు గంటలకు భద్రాచలం చేరుకుంటుంది. సందర్శకులు అక్కడే అక్కడ స్నానాలు ముగించుకుని ఉదయం ఏడు గంటలకు భద్రాచలం రాములవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడే కొన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చి ఉదయం 8.30 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్కు చేరుకుంటారు. పేరంటాలపల్లి మీదుగా కొల్లూరుకు బోటులో షికారుల చేస్తూ.. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ప్రణాళికలు వేశారు. అలా బోటులోనే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి కొల్లూరులోని బాంబూహట్స్లో విడిది చేస్తారు.
పర్యటనకే హైలేట్..
ఇక మూడోరోజు (ఆదివారం) ఈ పర్యటనకు హైలేట్గా నిలవనుంది. ఉదయం కొల్లూరులో అల్పాహారం ముగించుకుని కొల్లూరుకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడే ట్రెక్కింగ్ ప్రియులకు మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. అలా అలసినవారు నదీ స్నానం పూర్తి చేసుకుని, మధ్యాహ్న భోజనంతో ముగించి, బయలుదేరాల్సి ఉంటుంది. తర్వాత పర్ణశాల సందర్శించిన తిరిగి భద్రాచలం చేరుకోవాలి. అక్కడ హరిత హోటల్లో భోజనం చేసి, అదేరోజు రాత్రి 9 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి నాలుగో రోజు (సోమవారం) ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
ఇక టూరిజం శాఖ టిక్కెట్ ధరలను కూడా ప్రకటించింది. పెద్దలకు రూ. 6499, చిన్నారులకు రూ.5199గా తెలిపింది. అంతేకాదు, ఏసీ బస్సుల్లో ప్రయాణం, నాన్ ఏసీలో వసతి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ లేదా టోల్ నంబరు 1800-425-46464ను సంప్రదించండి. మరెందుకు ఆలస్యం అలలపై తేలియాడే మీ ప్రయాణాన్ని మొదులుపెట్టండి.