ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహానికి రాజస్థాన్ వేదికైంది
ఓవైపు ఆధ్యాత్మిక వాతావరణం.. మరోవైపు పర్యాటక అనుభవం.. ఆ రెండింటి సమ్మేళనానికి వేదిక అయింది రాజస్థాన్లోని రాజ్సమంద్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శివుడి విగ్రహ సందర్శనకు అవకాశం దొరికింది. ఈ ప్రారంభోత్సవం నేడు జరగబోతోంది.
రాజస్థాన్లోని రాజ్సుమంద్ జిల్లా నాథ్ద్వార్ పట్టణంలో 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహ నిర్మాణం పూర్తయింది. ఇది ఈ రోజు(అక్టోబర్ 29)న కొందరు ప్రముఖులు ప్రారంభించనున్నారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై దీనిని ఏర్పాటు చేశారు. గంభీరమైన ఈ కైలాసనాథుని దర్శనం సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కలుగుతుంది. అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని విశ్వాస్ స్వరూపంగా పిలుస్తున్నారు.
ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు పదేళ్ల సమయం పట్టింది. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ సీఎంగా ఉన్న అశోక్ గహ్లోత్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు. నేడు వీరిరువురి చేతుల మీదుగానే దీనిని ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన 369 అడుగుల శివుని విగ్రహం ఉదయ్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన శివుడి విగ్రహం..
ఈ శివుడి విగ్రహాన్ని నిర్మించేందుకు మూడు వేల టన్నుల స్టీల్ వినియోగించారు. అలాగే, 2. 5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను వాడారు. 250 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలినైనా తట్టుకోగలిగే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తియన శివుడి విగ్రహంగా పేరుపొందబోతోంది.
అంతేకాదు, లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, సందర్శకుల కోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేకంగా హాలు నిర్మించారు. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఆహ్లాదరకమైన వాతావరణంలో ఈ విగ్రహ సందర్శన పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని పంచుతుందనే చెప్పాలి.
పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు..
ఓవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు పర్యాటక అనుభవం అందించేందుకు కైలాసనాథుడి విగ్రహం వేదిక అవుతోంది. ఈ పర్యాటక ప్రాంత సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆహ్లాద పరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగీ జంపింగ్, జిప్ లైన్, గో కార్ట్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో రాత్రి పూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
దీనికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు శనివారం శివుడి విగ్రహం ఆవిష్కరణ తర్వాత తొమ్మిది రోజులు (అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు) పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా నిర్వాహలు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన శివుడి విగ్రహం ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త శోభను తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.