విజయవాడ రైల్వే స్టేషన్లో రోబోటిక్ మసాస్ సదుపాయం!
ప్రయాణంలో అలసిన సందర్శకులకు గుడ్ న్యూస్. మానసిక ప్రశాంతతను చేరువచేసేలా ఓ వినూత్న ఆలోచనను పరిచయం చేశారు రైల్వే అధికారులు. విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు బాడీ అండ్ ఫుట్ మసాజ్ సేవలతో కూడిన రోబోటిక్ స్పాను విజయవాడ డివిజన్ ప్రారంభించింది.
రోబోటిక్ బాడీ అండ్ ఫుట్ మసాజ్ ఛైర్ సదుపాయాన్ని విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, ఐఆర్ టిఎస్ సీనియర్, డిసిఎం వి.రాంబాబు సమక్షంలో జనవరి 9న విజయవాడ రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫాంలో ప్రారంభించారు. నాన్ ఫేర్ రెవెన్యూ ఇనిషియేటివ్ కింద రెండు రోబోటిక్ స్పా రిలాక్సింగ్ కుర్చీలు మరియు ఒక ఫుట్ మసాజ్ కుర్చీతో కూడిన ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.
ప్రయాణీకుల సౌలభ్యంలో మెరుగుదల
ఒకటో నెంబర్ ప్లాట్ ఫాంలోని 84 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన ఈ వినూత్న సదుపాయం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుంది. సుతిమెత్తని మసాజ్ చైర్లో సేదదీరితే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టమే. రైల్వే మంత్రిత్వ శాఖ వినూత్న మార్గాల ద్వారా నాన్ ఫేర్ ఆదాయాన్ని పొందడంతోపాటు ప్రయాణీకుల సౌలభ్యంలో మెరుగుదలలను తీసుకురావడానికి ఈ వినూత్న నాన్ ఫేర్ రెవిన్యూ ఐడియా పథకాన్ని ప్రారంభించింది. బాడీ మసాజ్కు రూ. 60, ఫుట్ మసాజ్కు రూ.
30గా ధర నిర్ణయించారు. ఈ సధుపాయంతో రైలు ప్రయాణీకులకు మానసిక ప్రశాంతత చేరువ అవుతుందని, అదే సమయంలో రైల్వేకు అధనపు ఆధాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సదుపాయం కారణంగా రైలు ఆలస్యమైనా ఎలాంటి టెన్షన్ పడకుండా కాసేపు రిలాక్స్ అయ్యేందుకు ఈ స్పా కేంద్రం సహాయపడుతుంది.
విజయవాడ స్టేషన్కు మరోసారి గుర్తింపు..
ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ మాట్లాడుతూ మసాజ్ సౌకర్యం ద్వారా విజయవాడ స్టేషన్ బ్రాండ్ మరోసారి గుర్తింపు పొందినట్లయిందని అన్నారు. సాధారణంగా జర్నీ సమయంలో తల నొప్పితోపాటు ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఈ రోబోటిక్ స్పా రిలాక్సింగ్ సేవల ద్వారా మెరుగైన రక్త ప్రసరణతోపాటు శరీర నొప్పులనుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. వినూత్నమైన ఆలోచనలను అమలు చేసి, డివిజన్ యొక్క నాన్ ఫేర్ రెవెన్యూ హెడ్ ను గరిష్ట స్థాయికి చేర్చినందుకు సీనియర్ డిసిఎం మరియు కమర్షియల్ స్టాఫ్ వావిలపల్లి రాంబాబు కృషిని శివేంద్ర మోహన్ అభినందించారు.
ఇటీవల కాలంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల సౌకర్యాల కోసం ఫిష్ స్పా, హ్యాండ్ లూమ్స్ అండ్ హస్తకళలు మరియు మొబైల్ ఉపకరణాలు వంటి వివిధ సౌకర్యాలను ప్రారంభించినట్లు డిఆర్ ఎం తెలిపారు. వీటికి ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మానసిక ప్రశాంతతను చేరువ చేసే ఈ రోబోటిక్ స్పా రిలాక్సింగ్ సేవలను మీరూ వినియోగించుకోండి.