రాజమ్మ జాతర సంబరాలకు.. సిక్కోలు సిద్ధమైంది!
గ్రామీణ స్థాయిలో జరిగే సంబరాలు.. జాతరలకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. గ్రామ దేవతలుగా ఆరాదించే శక్తి పీఠాలను సందర్శించేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అలాంటి ఆధ్యాత్మిక సందడే శ్రీకాకుళం జిల్లాలో మొదలైంది. ఏటా ఫిబ్రవరి నెలలో నాలుగు వారాలపాటు జరిగే రాజరాజేశ్వరి అమ్మవారి జాతర సంబరాల విశేషాలను తెలుసుకుందాం రండి!
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం వత్సవలస పంచాయతీ చిన వత్సవలసలో ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఆధ్యాత్మిక సందడి మొదలవుతుంది. ఏటా మాఘమాసంలో ప్రారంభించి ఫాల్గుణమాసం వరకు నాలుగు వారాల పాటు రాజరాజేశ్వరి అమ్మవారి జాతర కన్నులపండుగా నిర్వహిస్తారు.
వరుసగా శని, ఆదివారాలు గ్రామంలోని అమ్మవారి ఆలయాలు, శక్తి పీఠాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నెల 4వ తేదీ నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఉపాధి నిమిత్తం ఎంత దూరం వెళ్లిన వారైనా కుటుంబసమేతంగా ఇక్కడికి హాజరుకావాల్సిందే.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉందట!
ఇక్కడ పూజించే రాజరాజేశ్వరి అమ్మవారి కొలువు వెనుకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని ప్రచారంలో ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. పూసపాటి రాజుల ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి. బొబ్బిలి యుద్ధానికి ముందు అమ్మవారు విజయరామరాయలు కలలో బాలిక రూపంలో కనిపించి బొబ్బిలి సామ్రాజ్యం వేరే రాజ్యంలో కలిసిపోనుందని చెప్పిందట.
అయితే, తమను కాపాడలేని దేవతకు పూజలెందుకని భావించి అమ్మవారితో పాటు ఇతర దేవతల ప్రతి రూపాలను చెక్క పెట్టెలో ఉంచి సమీప నదిలో పడేశారట పూసపాటి రాజులు. ఆ చెక్క పెట్టె వత్సవలస సమీపంలోని మైలపల్లి వంశస్థులైన కొందరు జాలర్లకు దొరుకిందని, ఆ ప్రతిమలను తమ దైవంగా పూర్వీకుల కొలిచారని చెబుతారు. అదే ఆచారాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
శక్తి పీఠాలు చాలానే ఉంటాయి..
దేవతను కొలిచే వంశస్థులను దాసులుగా పిలుస్తారు. ఇక్కడి ఉత్సవాల నిర్వహణ వారే తీసుకుంటారు. అంతేకాదు, గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి(రాజమ్మ తల్లి) పీఠాలు చాలానే ఉంటాయి. సంబరాలకు జిల్లా నలుమూలల నుంచి శనివారం సాయంత్రానికే ఈ ప్రాంతానికి చేరుకుని పూజల్లో పాల్గొంటారు. అదే రోజు స్థానికంగా లభించే కలపను ఉపయోగించి పరిసర జీడిమామిడి తోటల్లో గుడారాలను ఏర్పాటు చేసుకుంటారు.
అందులోనే పిల్లలు, కుటుంబసభ్యులతో రాత్రి తలదాచుకుంటారు. వారికి అవసరమైన వంట పాత్రలను నిర్వాహకులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి తెల్లవార్లూ జాతర నిర్వహిస్తారు. స్త్రీలు, పురుషులు అని తారతమ్యం లేకుండా జాతరలో అందరూ కలిసి, సరదాగా తిరగాడుతూ కనిపిస్తారు.
మొక్కులు చెల్లించిన మాంసాన్ని వండుకుని..
మరుసటి రోజు ఆదివారం వేకువజామున భక్తులు బసచేసే ప్రాంతానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రతీరానికి కాలినడకన వెళతారు. అక్కడే సముద్ర స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. తమ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా రాజమ్మ తల్లిని భక్తులు భావిస్తారు. గొర్రెలు, మేకలు, కోళ్లు, నగదు, బియ్యం, బట్టలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తమ మొక్కులను దాసుడికి సమర్పించుకుంటారు.
ఆ తర్వాత అక్కడే తాము మొక్కులు చెల్లించిన మాంసాన్ని వండుకుని తిని, అదే రోజు తిరుగుప్రయాణమవుతారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం రాజరాజేశ్వరి అమ్మవారి జాతరకు మీరూ బయలుదేరండి!