రైలు అనేది ఒక ముఖ్యమైన రవాణా సౌకర్యం. నేడు, ప్రజలు దేశంలోని ఒక చోట నుండి మరొక చోటుకు చేరుకునేందుకు రైలు మార్గాల సహాయం తీసుకుంటారు.
ఇది మధ్యతరగతి ప్రజలకు చౌకైన మరియు వేగవంతమైన సాధనం.
పోరాటయోధుల పేర్లతోనూ రైల్వేస్టేషన్లు ఉన్నాయి
రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి రైల్వే స్టేషన్లు తక్కువ దూరాలలో నిర్మించబడ్డాయి. వీటికి ఒక్కో స్టేషన్కు ఒక్కో పేరు ఇవ్వబడింది. రైల్వే స్టేషనుకు ఆ ప్రదేశానికి సంబంధించిన పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొన్ని రైల్వే స్టేషన్లు మాత్రం విప్లవకారులు లేదా స్వాతంత్య్ర సమరయోధుల పేర్లతో పిలువబడతాయి. వాస్తవానికి, చాలా మంది దేశ స్వాతంత్య్రం కోసం అపూర్వమైన కృషి చేశారు. అలాంటివారి పేర్లు ఇప్పటికీ చాలామందికి తెలియదు. కానీ ఇలా ఈ రైల్వే స్టేషన్లుకు పేర్లు పెట్టడం వల్ల పోరాటయోధులను, వారి త్యాగాన్ని శాశ్వతంగా సజీవంగా ఉంచడానికి సహాయపడతాయి. భారతదేశంలో ఉన్న అటువంటి కొన్ని రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ రైల్వే స్టేషన్, ఉత్తర ప్రదేశ్
పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ రైల్వే స్టేషన్ ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలోని ఒక చిన్న రైల్వే స్టేషన్. ఈ స్టేషనుకు గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ పేరు పెట్టారు. ఈ స్టేషన్లో రెండు ప్లాట్ ఫారాలు ఉన్నాయి. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897లో జన్మించారు. ప్రధాన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ స్రవంతిలో ప్రముఖ సమరయోధుడు. మెయిన్ పురి కుట్ర, కాకోరి-కాండ్ వంటి ప్రధాన సంఘటనలలో అతను పాల్గొన్నాడు. తన 30వ యేట బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ఉరితీసింది.
వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషను, ఝాన్సీ
1880 ల చివరలో బ్రిటిష్ వారు నిర్మించిన ఝాన్సీ రైల్వే స్టేషన్ దేశానికి ఉత్తరం నుండి దక్షిణానికి కలిపే ఒక ముఖ్యమైన కూడలి. గతంలో ఇది ఝాన్సీ రైల్వే స్టేషనుగా ఉండేది. కానీ ఇప్పుడు దీనికి వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషను అని పేరు మార్చారు. రాణి లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న జన్మించింది. ఆమె చిన్ననాటి పేరు మణికర్ణిక. ఆమె తన ఝాన్సీని రక్షించడానికి కేవలం 29 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ సామ్రాజ్య సైన్యంతో పోరాడి యుద్ధరంగంలో అసువులు బాసింది.
బేలానగర్ రైల్వే స్టేషన్, కోల్కతా
కోల్కతాలోని బేలానగర్ రైల్వే స్టేషనుకు బేలా బోస్ పేరు పెట్టారు. బేలా బోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ప్రతిష్టాత్మక కుటుంబంలో జన్మించారు. ఆమె నేతాజీ కుటుంబసభ్యురాలు. బేలా బోస్ ఎల్లప్పుడూ ప్రజలతో ఉండటానికి ఇష్టపడే మరియు ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన అంకితభావం కలిగిన వ్యక్తి. ఆమె 1936 లో ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) ఇంటెలిజెన్స్ చీఫ్ హరిదాస్ మిత్రాను వివాహం చేసుకుంది. తూర్పు ఆసియా నుంచి భారత్ లోకి చొరబడేందుకు నేతాజీ ఎప్పటికప్పుడు పంపుతున్న ఐనా టీమ్ సభ్యుల భద్రతను బేలా బోస్ పర్యవేక్షించేవారు. విప్లవకారులను సురక్షితమైన ఆశ్రయాలకు కూడా రవాణా చేసేవారు. ఒడిషా తీర ప్రాంతాలలో దిగిన స్వాతంత్య్ర సమరయోధులను సురక్షితంగా తరలించే ఏర్పాటు చేయడానికి చాలా రిస్క్ తీసుకున్నారు. స్వాతంత్య్రానంతరం బేలా ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. 1952 జూలైలో తుది శ్వాస విడిచారు.