విశాఖ ట్రాక్పై వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులుపెట్టబోతోంది
వందే భారత్ ఎక్స్ప్రెస్.. దూర ప్రాంతాలకు ప్రయాణీకులను తక్కువ సమయంలోనే తీసుకుపోయే ఓ హైస్పీడ్ రైల్. నిన్న మొన్నటివరకూ విదేశాలలో పరుగులు తీసిన ఇలాంటి రైళ్లు ఇప్పుడిప్పుడే భారతీయ రైల్వే ట్రాక్లపై పరుగులు తీస్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఈ రైల్ ప్రయాణం అందుబాటులో రానున్నదన్న సమాచారం బయటకు రావడంతో ప్రయాణీకులు ఉబ్బితబ్బింపైపోతున్నారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
ఆంధ్రా- తెలంగాణాలను కలుపుతూ హైస్పీడ్ రైల్ను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్యే యోచిస్తోంది. అందులో భాగంగా ముందుగా వైజాగ్ నుంచి విజయవాడకు హైస్పీడ్ 'వందే భారత్ ఎక్స్ప్రెస్'ను నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రైలు జన్మభూమి ఎక్స్ప్రెస్ తరహాలో పగటిపూట నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 12 నుంచి 14 గంటలు ఉండగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 8 గంటలకు తగ్గనుంది. అంటే సుమారు నాలుగు నుంచి ఆరు గంటలు ప్రయాణీకుల సమయం ఆదా అవుతుందన్నమాట.
విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గంలో ఆరో రైలుగా..
ఈ ప్రణాళికను అమలు చేసేందుకు మొదటగా ఈ రైలు విశాఖపట్నం నుండి విజయవాడ వరకు నడపబడుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్ వరకు పొడిగించబడుతుంది. అయితే, భారతీయ రైల్వే ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇది అందుబాటులోకి వస్తే విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గంలో ఇది ఆరో రైలుగా నమోదు అవుతుంది. కొద్ది రోజుల క్రితం చెన్నై-మైసూర్ మధ్య రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అది విజయవంతం కావడంతో వైజాగ్-సికింద్రాబాద్ మధ్య 'వందే భారత్' రైళ్లు నడపనున్నట్లు దక్షిణ-మధ్య రైల్వే (SCR) తెలిపింది. ప్రస్తుతం ఒక ర్యాక్ మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి రైలు మొదట విశాఖపట్నం నుండి విజయవాడ వరకు నడపబడుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్ వరకు పొడిగించబడుతుంది.
ప్రయాణీకుల రద్దీ.. సమయం తగ్గుతుంది..
వైజాగ్-విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఉండే టైం ట్రావెల్ నాలుగు గంటలకు తగ్గించబడుతుంది. విశాఖపట్నంలో ట్రాక్పై త్వరలో ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు వందేభారత్ రైలు సర్వీసులను తిరుపతి వరకు పొడిగించే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి నుంచి రైలు నడపినట్లయితే.. విజయవాడ నుండి ప్రయాణీకుల రద్దీ, సమయం తగ్గుతుంది. వందే భారత్ రైళ్లు ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, ముంబై సెంట్రల్-గాంధీనగర్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా మరియు MGR చెన్నై సెంట్రల్-మైసూరు మార్గాల్లో నడుస్తున్నాయి.
ఎన్నో ప్రత్యేకలు..
దీని వేగానికి తగ్గట్టుగానే రైలును అధునాతన టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. మొత్తం 16 కోచ్లలో 1,128 సీట్లు అందుబాటులో ఉంటాయి. రైలులోని అన్ని కంపార్ట్మెంట్లలో ఏసీ ఉంటుంది. వందే భారత్ రైళ్లు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 52 సెకన్లలో అందుకోగలవు. అలాగే దీని గరిష్ట వేగం 180 కిలోమీటర్లు. అంతేకాదు, వేగాన్ని పెంచేందుకు మరియు తగ్గించేందుకు అత్యాదునిక బ్రేకింగ్ సిస్టమ్ దీనిలో ఏర్పాటు చేశారు. అన్ని కోచ్లలో ఆటోమేటిక్ డోర్లు, GPS ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లు, మరియు దివ్యాంగల కొరకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. వినోద ప్రయోజనాల కోసం బోర్డులో హాట్స్పాట్ వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. పాంట్రీ సౌకర్యం భోజనం, పానీయాలను అందిస్తుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో తిరిగే కుర్చీలు ఉంటాయి. బయో-వాక్యూమ్ మోడల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అయితే, ఇన్ని సౌకర్యాలున్న ఈ హైస్పీడ్ రైలు కోసం ప్రయాణీకుల మరి కొన్ని రోజులు వేచిచూడక తప్పదు.