పాపికొండల విహారానికి ఏపీ టూరిజం ఆహ్వానం పలుకుతోంది!
ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి ప్రేమికులకు ఏపీ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గలగలాపారే గోదావరి నదీ జలాలపై విహరిస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పించింది. చుట్టూ ఎత్తయిన కొండలు.. కనుచూపు మేర పచ్చదనం.. గోదావరిలో విహారం.. ఈ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలాంటి సుందరమైన దృశ్యాలు పాపికొండలు విహారయాత్రలో కనిపిస్తాయి.
గోదావరి వరదలు తగ్గుముఖం పట్టడంతో.. పాపికొం డల విహారయాత్ర జోరుగా సాగుతోంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం త్వరలోనే పునఃప్రారంభం కావడంతో పర్యాటక ప్రేమికులు తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే గోదావరి అలలపై బోటు షికారుకు అంతా సిద్ధమైంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి అందాల నడుమ.. చిన్నా, పెద్దా అందరూ పాపికొండల టూర్ చేసేయొచ్చు. పాపికొండల ప్రయాణంలో పొందే అనుభూతులు అనిర్వచనీయం..
జీవితంలో గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.. ఎన్నో జంతుజాతులు, ఔషధవృక్షాలకు నిలయమది. పాపికొండలు చూపే వర్ణాలకు ప్రకృతి అందాల్లో తిరుగుండదు. దీంతో అలసిన మనసులకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచే పాపికొండల యాత్రకు.. పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. గండి పోచమ్మ బోట్పాయింట్ నుంచి ఏపీ టూరిజం హరిత బోటు, కొన్ని ప్రైవేటు బోట్లు వెళ్తున్నాయి. రేపటి (డిసెంబర్ 18) నుంచి సర్ ఆర్థర్ కాటన్ బోటు అందుబాటులోకి రానుంది.
నదిలో నీటిమట్టం తగ్గడంతో..
గోదావరి నదిలో విహారం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అందులోనూ పాపికొండల అందాలకు ముగ్ధులవ్వని పర్యాటకులు ఉండరు. ప్రస్తుతం నదిలో నీటిమట్టం తగ్గడంతో బోట్ల రాక పోకలకు పచ్చజెండా ఊపింది పర్యాటక శాఖ. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటుచేశారు పర్యాటక శాఖ అధికారులు. గోదావరిలో బోట్ ట్రయల్ రన్ నిర్వహించారు. అంతేకాకుండా పోచమ్మగండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు.
టూర్ ప్యాకేజీలు ఇలా ఉన్నాయి..
ఒక్కరోజు యాత్రలు: రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు వెళ్లేందుకు గౌతమిఘాట్ నుంచి ఉదయం 7.30 గంటలకు వాహనంలో బయలుదేరి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్కు చేరుకోవాల్సి ఉంటుంది. అందుకు వాహనాన్ని పర్యాటకశాఖ ఏర్పాటు చేస్తుంది. తిరిగి విహారయాత్ర ముగించి రాత్రి 7.30 గంటలకు పర్యాటకులను రాజమహేంద్రవరం చేరుస్తారు. గండిపోచమ్మ పాయింట్ నుంచి ఉదయం 9.30కు విహార యాత్ర మొదలై సాయంత్రం ఐదు గంటలకు తిరిగి బోడ్ పాయింట్కు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
రెండు రోజుల పర్యటన: రాజమహేంద్రవరం, పోచవరం, గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ల నుంచి పాపి కొండలుకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరిన బోటు మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు తిరిగి అక్కడికి వస్తుంది. యాత్ర సమయం, బయలుదేరే ప్రాంతాలను బట్టి టికెట్ ధరలు పిల్లలకు రూ.800 నుంచి 2వేల వరకు, పెద్దలకు రూ.950 నుంచి రూ.
2,500 వరకు ఉంటాయి. అల్పాహారం, భోజనం, టీ, స్నాక్స్ అన్నీ కలిపే టికెట్ ధర నిర్ణయించారు. పండగల నేపథ్యంలో ఏపీ టూరిజమ్ రెండో బోటును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధకారులు చెబతున్నారు. గండిపోచమ్మ నుంచి వెళ్తున్న హరిత బోటులో 94 మంది, సర్ ఆర్థర్ కాటన్ బోటులో 41మంది ప్రయాణించవచ్చు. పర్యాటకులు మరిన్ని వివరాల కోసం 9848629341, 9848883091 నంబర్లలో సంప్రదించాలని ఏపీ టూరిజం శాఖ అధికారులు సూచిస్తున్నారు.