నూతన సంవత్సరపు వేళ.. ఉండవల్లి గుహలను చూసొద్దామా!
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన వారసత్వ ప్రదేశాలలో విజయవాడకు సమీపంలో ఉన్న ఉండవల్లి గుహలను చేర్చాల్సిందే. కొండను కదిలించకుండా ..కొండలోనే గుహలు, మూడంతస్తుల నిర్మాణాలకు వేసిన ప్రణాళికలు అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభా ప్రావిణ్యానికి మచ్చుతునగా నిలుస్తుంది.
నాలుగవ శతాబ్దంలో గుప్త రాజవంశంచే నిర్మించబడిన ఈ గుహలు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ఏకశిలా నిర్మాణం కృష్ణా నదికి ఎదురుగా ఉన్న కొండపై ఉంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షిత స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. దృఢమైన కొండరాయితో చెక్కబడిన ఈ గుహలు 420 AD నాటి విష్ణుకుండిన్ రాజులకు సంబంధించినవిగా తెలుస్తోంది.
బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం
రాతి కొండను నాలుగు అంతస్తుల గుహలుగా చెక్కిన తీరు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి, ఈ గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవి. అనంతరం కాల క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి గుహలోని రెండో అంతస్తులో పవళించి ఉన్నట్లు దర్శనమించే అరుదైన అనంత పద్మనాభుని ఏకశిలా విగ్రహం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏక శిలా 'అనంత పద్మనాభ స్వామి' విగ్రహ తేజస్సు నిత్యనూతంగా కనిపిస్తుంది. దక్షిణాదిలోని తిరువనంతపురంలో ఇలాంటి విగ్రహమే చూడొచ్చు. దీనిని సందర్శంచేందుకు మూడు అంతస్తులున్న ఉండవల్లి గుహల్లోని రెండో అంతస్తుకు చేరుకోవాల్సి ఉంటుంది. క్రీ.శ.మూడు... ఏడు శతాబ్దాల మధ్యచాళుక్యులు ఈ గుహలను తొలిపించారని చారిత్రక ఆధారాలను బట్టీ చెబుతున్నారు. మొదటి అంతస్తులో త్రిమూర్తులున్న త్రికుటాలయం కనిపిస్తుంది. అయితే, కింద మండపం నిర్మాణం మాత్రం అసంపూర్తిగా ఉంది. ఈ ఉండవల్లి గుహలు దక్షిణాదిలో అపురూపమైనవిగా చెప్పొచ్చు.
ఆ శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు..
గుహల మొదటి భాగంలో పచ్చదనంతో నిండిన గార్డెన్ ప్రశాంతతను చేరువ చేస్తుంది. అందమైన రోప్ మార్గాలు పిల్లలు కేరింతలు కొట్టేందుకు అనువుగా ఉంటాయి. ఇక గుహల విషయానికి వస్తే రాతి కొండను మూడు అంతస్తులుగా మలచారు. ఈ నాలుగు అంతస్తుల గుహల్లో.. మొదటి అంతస్తులో రుషులు, సింహాలు వగైరా విగ్రహాలు తారసపడతాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు చూడవచ్చు. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు.
ఇవి గుప్తుల కాలంనాటి ప్రథమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి చెందినవిగా ఇక్కడ లభించిన ఆధారాలను బట్టీ చెబుతున్నారు. ఇక, రెండో అంతస్తులో శయనించి ఉన్న 'అనంత పద్మనాభస్వామి' విగ్రహం ఉంటుంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది.
ఇందలో ఎలాంటి విగ్రహాలు లేవు. ఈ గుహాలయాల నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారట. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూసివేయబడి ఉంది. చారిత్రక ఆసక్తి ఉన్నవారికి ఉండవల్లి గుహలు జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను అందిస్తుందనడంలో సందేహమే లేదు.
చేరుకోవడం ఎలా
గుహలను చూసేందుకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. గుంటూరు, విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎపిఎస్ఆర్టిసి బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి.