ప్రకృతి తన అందాలను ఆరబోసిన ప్రదేశం డార్జిలింగ్. డార్జిలింగ్ అందమైన రొమాంటిక్ పర్యాటక స్థలంగా ప్రసిద్ది చెందింది. ఇక్కడి సుందరమైన లోయలు, హనీమూన్ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. డార్జిలింగ్ ను పర్వతాల రాణిగానూ పిలుస్తారు. నిర్మలమైన మేఘాలు, చుట్టూ పచ్చదనం, కనుచూపుమేర తెల్లటి మంచు పర్వత శిఖరాలు, గలగలా పారే నదులు, దేవదారు వ్రుక్షాలు ఇలా ఒక్కటేమిటి ఇక్కడి ప్రతి దృశ్యం ఓ సుందరమే.ప్రకృతిలోని మైమరపించే ద్రుశ్యాలు మనోల్లాసం కలిగిస్తాయి. అంతే కాకుండా సాహసక్రీడలను ఇష్టపడేవారిని సైతం డార్జిలింగ్ రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. అటువంటి అందమైన డార్జిలింగ్లో పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం...
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర భాగాన 7004 అడుగుల ఎత్తున తూర్పు హిమాలయాల్లో నేపాల్, భూటాన్ దేశాలకు సమీపంలో డార్జిలింగ్ కేంద్రీకృతమైవుంది. ఈ ప్రాంతానికి సిలిగురి నుంచి చేరుకోవచ్చు. ఇది కాంచనగంగ పర్వత శ్రేణులలో ఉంది. మరి ఈ వేసవి సెలవులకు డార్జిలింగ్ ప్లాన్ చేసుకుంటే డార్జిలింగ్ చుట్టు ప్రక్కల ఉన్న ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి.
కాంచన్జంగా పర్వతం:
డార్జిలింగ్ వెళ్లగానే మొదట చూడాల్సింది కాంచన్జంగా పర్వతాన్ని. ప్రస్తుతం కాంచన్జంగా ప్రపంచంలోని అతిఎత్తయిన శిఖరాల్లో మూడోస్థానం దక్కించుకుంది. కాంచన్జంగాను రొమాంటిక్ స్పాట్గా భావిస్తారు పర్యాటకులు.. ఇక్కడ స్నో లెపర్డ్, హిమాలయన్ బ్లాక్ బేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పర్వతం చుట్టుపక్కల ఉండే జలపాతాలు, తోటల అందాలు కళ్లను చెదర గొడుతుంటాయి.
టీ ఎస్టేట్స్
డార్జిలింగ్కి అతి పెద్ద ఆకర్షణ టీ ఎస్టేట్స్. మొత్తం 86 టీ తోటలు ఉన్నాయి. ఉత్తమజాతి తేయాకును పండిస్తారు. టీపొడి అక్కడే అమ్ము తారు కూడా. రుచి చూశాకే కొనుక్కో వచ్చు.
రమణీయమైన ప్రకృతి
డార్జిలింగ్ అంటే పిడుగుల ప్రదేశమని అర్థం. ఈ ప్రాంతంలో అనేక చోట్ల చిన్న చిన్న జలపాతాలున్నాయి. ఇక్కడ రైలు ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్ లాంటి సాహసక్రీడలకు అనువైన ప్రాంతంగా డార్జిలింగ్ ఉంది. కొండ శిఖరాల అందాలు, ఎన్నో రమణీయ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పొగమంచు దుప్పటి, ప్రకాశవంతమైన సూర్యాస్తమయం అంతకంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
Photo Courtesy: Royroydeb
హస్త కళలకు ప్రసిద్ధి
డార్జిలింగ్లో ఉన్న ఎన్నో దర్శనీయ స్థలాల్లో సెంచాల్ లేక్ ఒకటి. ఈ నది నుంచి డార్జిలింగ్ ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఇది 8031 అడుగుల ఎత్తున ఉంది. డార్జిలింగ్లోని కాళీమాత ఆలయం హిందువులకు, బౌద్ధులకు పవిత్ర పుణ్యక్షేత్రం. బౌద్ధుల గ్రంథాలయం కూడా ఇక్కడ ఉంది. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఇక్కడే వెలసి వుంది. డార్జిలింగ్ అందాలను రోప్ వే ప్రయాణంలో ఆకాశమార్గంలో ఇక్కడి అందాలను తిలకించవచ్చు. టీ తోటలను కూడా చూడవచ్చు. బుద్ధుడి 14 అడుగుల కాంస్య విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న లాయిడ్ బొటానికల్ గార్డెన్లో హిమాలయ పర్వత వృక్షజాతులను చూడవచ్చు. బెంగాల్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో రకరకాల వన్యప్రాణులను చూడవచ్చు. పద్మజానాయుడు జూలాజికల్ పార్క్లో సైబీరియన్ టైగర్ స్నో లిపర్డ్ బ్రీడింగ్ సెంటర్ ఉంది. హస్తకళలకు ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది.
బటాసియా లూప్ అండ్ ది వార్ మెమోరియల్ :
బటాసియా లూప్లో చాలా ప్రసిద్ది చెందిన టాయ్ రైలు. ఇది ఒక అందమైన గార్డెన్ లో లూప్డ్ ట్రాక్లో ఉంది . ఇక్కడ గోర్ఖా యుద్ద స్మారకం ఉండటం వల్ల ఈ ప్రదేశం చాలా ప్రసిద్ది చెందినది.
Image Courtesy:Shahnoor Habib Munmun
జపనీస్ పీస్ పగోడా :
జపనీయుల యొక్క శాంతి పగోడా. ఇది ఒక ప్రసిద్ద బౌద్ధ సన్యాసి అయిన నిచిడాట్స్ ను పూజింపబడటానికి స్థాపించబడినది. జలపహార్ కొండ వాలు వద్ద ఉన్న ఈ పగోడాను చాలా సులభంగా చేరుకోవచ్చు. పీస్ పగోడా బౌద్ధాలయంలో బంగారు పూత పూసిన బుద్ధుని విగ్రహం ఉంటుంది. అక్కడ గోడలపై ఉండే రాతి శిల్పాలు బుద్ధుని జీవిత చరిత్ర చెబుతుంటాయి.
Image Courtesy:Shahnoor Habib Munmun
టాయ్ ట్రైన్
పశ్చిమబెంగాల్ ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు డార్జిలింగ్ కనుమల అందాలను తిప్పి చూపే టాయ్ ట్రైన్ ఎక్కాల్సిందే. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్ కు వచ్చేవారంతా ఈ ట్రైన్ లో ప్రయాణించి డార్జిలింగ్ కొండల అందాలు చూస్తారు. కొండా కోనల గుండా సాగే ఇక్కడి రైలు ప్రయాణం మొత్తం టూర్ కే హైలెట్ గా నిలుస్తుంది. ట్రెక్కింగ్ కు చాలా అనువైన ప్రాంతం. మిగతా చోట్ల కంటే ఇక్కడ సూర్యాస్తమయం ప్రకాశవంతంగా ఉంటుంది. డార్జిలింగ్ అందాలను రోప్ వే సాయంతో చూస్తే ఆ మజానే వేరు. డార్జిలింగ్ టీ తోటలు మరొక అట్రాక్షన్.
Photo Courtesy: Golf Bravo
మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్
మొదటిసారి ఎవరెస్ట్ శిఖారాన్ని అధిరోహించిన తెంగ్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీల సంస్మరణార్థం ఈ ఇన్ స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మౌంటనీరింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహసయాత్రలు చేసే సమయంలో వినియోగించే వస్తువులకు సంబంధించిన మ్యూజియం ఉంది. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రాంగణంలోనే ఉన్న జూలో అంతరించే స్థితికి చేరుకొన్న అత్యంత అరుదైన మంచుచిరుత, రెడ్ పాండ, గోరల్ గా పిలిచే పర్వతపు మేక, సైబేరియన్ టైగర్, టిబేటియన్ నక్క తదితర జంతువులనెన్నింటినో చూడవచ్చు.
టైగర్ హిల్స్- మేఘాల్లో తేలిపోవచ్చు
డార్జిలింగ్లో చూడదగిన పర్యాటక కేంద్రాల్లో టైగర్ హిల్స్ మొదటి స్థానంలో ఉంటాయి. సముద్ర మట్టానికి దాదాపు 2,590 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ టైగర్ హిల్స్ చేరుకుంటే దూదెపింజెల్లాంటి మేఘాల్లో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ ప్రేమికులు ఎక్కువగా ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకొంటారు. ఇక్కడి నుంచి దూరంగా కనిపించే కాంచన్ జంగా శిఖరం వద్ద సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. డార్జిలింగ్ నగరం నుంచి 40 నుంచి 45 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న ఈ టైగర్ హిల్స్ ప్రాంతానికి చేరుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు, బస్సు సౌకర్యాలు నిత్యం ఉంటాయి.
రాక్ గార్డెన్
వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల ఇక్కడ పెద్ద బడ్డరాళ్లు వివిధ ఆకారాలకు మారి పర్యాటకులను ఎంతో అకట్టుకొంటున్నాయి. ఇందులో కొన్ని జంతువులను పోలి ఉంటే మరికొన్ని దేవతలను పోలి ఉంటాయి. ఇక ఇదే ఆవరణంలో ఉన్న మయా పార్క్లో వివిధ రకాల ఔషద గుణాలున్న మొక్కలను చూడవచ్చు. అదే విధంగా విభిన్న రూపాల్లో ఉన్న పుష్పాలు కూడా ఈ ఉద్యానవనంలో పర్యాటకులను ఆకర్షిస్తాయి.
రోప్ వే చక్కని వేదిక
డార్జిలింగ్లో ఉన్న ప్రకృతి అందాలన్నింటినీ ఒకేసారి చూడాలనుకునేవారికి ఈ డార్జిలింగ్ రోప్ వే చక్కటి వేదిక. దీనిని రంగీత్ వ్యాలీ ప్యాసింజర్ కేబుల్ కార్ సర్వీస్ అని కూడా అంటారు. భూమికి అంతెత్తులో ప్రయాణం చేస్తూ కింద ఉన్న టీ తోటలను చూడటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. అదే విధంగా నదీ లోయలు, తెల్లటి దూదె పింజల్లాంటి మేఘాలతో కూడిన హిమాలయ పర్వత శ్రేణులు కూడా ఈ రోప్ వే మార్గంలో కనువిందును చేస్తాయి.
సెంచాల్ అభయారణ్యం
భారత దేశంలోని అత్యంత ప్రాచీన అభయారణ్యాల్లో సెంచాల్ అభయారణ్యం కూడా ఒకటి. దీనిని 1915లో ఏర్పాటు చేశారు. డార్జిలింగ్ పట్టణం నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. ఈ సెంచాల్ అభయారణ్యంలో అత్యంత అరుదైన జంతువులు, చెట్లను చూడవచ్చు. ముఖ్యంగా హిమాలయన్ ఎగిరే ఉడత, హిమాలయన్ ఎలుగుబంటి వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఫొటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వారు ఇక్కడికి వెళుతుంటారు.
Photo Courtesy: Ankit Agarwal
టెన్జింగ్ మరియు గోమ్బు రాక్:
టెన్జింగ్ మరియు గోమ్బు రాక్ పర్వతారోహకులకు సరైన స్థలం. ఇది డార్జిలింగ్ రహదారికి చాలా దగ్గరలో ఉంది.డార్జిలింగ్లో పర్వతాలు ఎక్కువ. దాంతో ట్రెక్కింగ్ ప్రియులకు బోలెడంత టైమ్పాస్. ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్పే కేంద్రాలు కూడా అక్కడ ఉన్నాయి. పర్వత ప్రాంతాలన్నీ అందమైన పూల మొక్కలతో నిండి ఉంటాయి. ఆ పూల అందాలను చూస్తూ, వాటి పరిమళాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ చేయడంలో ఉండే అనుభూతే వేరు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హిమాలయాలను అధిరోహించడానికి చాలామంది ముచ్చట పడుతుంటారు.
చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం 960.31 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. వర్షాకాలంలో (జూన్ 16- సెప్టెంబర్ 15) ఈ పార్క్ను మూసి వేస్తారు. మిగతా అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుంది.
లవ్ రోడ్:
ఈ రోడ్ లో సందర్శించాలంటే పక్కన మీ భాగస్వామి ఉంటే భలే మజా ఉంటుంది. జంటలకు ఒక ఖచ్ఛితమైన హైడ్ వే అని చెప్పవచ్చు. చాలా సన్నగా పొడవుగా ఉండే ఈ రోడ్ చాలా ఇరుకుగా సుమారు 8కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ పాదాచారులు రిఫ్రెషింగ్ కోసం నడుస్తుంటారు. ఇక్కడ ప్రేమ జంటలు ఎక్కువగా కనబడుటం వల్ల ఈ రోడ్ కు లవ్ రోడ్ అని కూడా పిలుస్తుంటారు. ఇది డార్జిలింగ్ లో చూడవల్సిన ప్రదేశాల్లో ఒక చక్కట అంద్భుతమైన ప్రదేశం. ఇక్కడ వివిధ రకాల పక్షుల కలయికను చూడవచ్చు.
ఎలా వెళ్లాలి?
విమాన మార్గం : హైదరాబాద్ నుంచి డార్జిలింగ్లోని బాగ్దోగ్రా విమానాశ్రయానికి ఫ్లయిట్లో వెళ్లవచ్చు. రాను పోను కలిపి పదహారు వేల పైన ఉంటుంది టిక్కెట్ వెల. ప్యాకేజీ తీసుకుంటే రానుపోను విమాన ఖర్చులతో పాటు మూడు రాత్రులు, నాలుగు పగళ్లకు వసతి, భోజనం, విహార ఖర్చులన్నీ కలిపి ముప్ఫై వేల వరకూ అవుతాయి. డార్జిలింగ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చూపించే ప్యాకేజీలు ఉన్నాయి.
రైలు మార్గం : డార్జిలింగ్కు నేరుగా రైళ్లు లేవు. కోల్కతాకు వెళ్లి, అక్కడ్నుంచి గౌహతి ఎక్స్ప్రెస్లో జల్పాయ్గూర్ వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది.
రోడ్డు మార్గం : డెరైక్ట్ బస్సులు కూడా లేవు. బెంగలూరు వెళ్లి, అక్కడ్నుంచి రైల్లో కానీ విమానంలో కానీ బాగ్దోగ్రా వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటికీ ఇరవై గంటల పైనే పడుతుంది.