సమస్త జీవరాశికి ఎప్పుడు ఎప్పుడు, ఏమి కావాలన్న విషయం విష్ణువుకు తెలుసు. అందువల్లే ఆయన్ను స్థితి కారకుడు అంటారు. ఆ విష్ణువు రూపమైన వేంకటేశ్వరుడికి నైవేద్యం సమర్పించడం అంటే సష్టిలో ఆకలితో ఉన్న సమస్త జీవులను సంతృప్తి పరచడమేనని మన పురాణాల్లో చెప్పబడింది. కలియుగ దైవంగా తిరుమల కొండ పై కొలువై ఉన్న ఆ వేంకటేశ్వరుడికి నిత్యం మూడు పూటలా నైవేద్యాన్ని సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలో స్వామి వారి మూల విగ్రహం ఎత్తునకు అనుగుణంగా స్వామి వారికి ఏ పూట ఎంత పరిమాణంలో నైవేద్యం సమర్పించాలన్న విషయం శాస్త్రంలో స్పష్టంగా నిర్దేశించారు. అదే సమయంలో ఏ సమయంలో ఏ ఏ రకాల నైవేద్యం సమర్పించాలన్న విషయం కూడా శాస్త్రంలో పేర్కొన్నారు. ఆ నైవేద్యానికి సంబంధిచిన వివరాలతో పాటు నైవేద్యం సమయంలో ఎటువంటి ఆచారాలు పాటిస్తారన్న విషయానికి సంబంధించిన వివరాలు మీ కోసం
బాలభోగం ఇలా
P.C: You Tube
సాధారణంగా తిరుపతి అనగానే లడ్డు మనకు గుర్తుకు వస్తుంది. అయితే ఈ లడ్డుతో పాటు స్వామివారికి మూడు పూటలా వివిధ రకాల పదార్థాలను స్వామివారికి నైవేద్యం పెడుతారు. అటు పై ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచుతారు. ఈ మూడు పూటల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారు. ఇందులో మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కర పొంగలి, రవ్వకేసరి ఉంటుంది. అదే విధంగా మధ్యాహ్నం సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అంటారు.
రాజభోగం ఇలా
P.C: You Tube
ఇది పది నుంచి పదకొండు గంటల మధ్య ఉంటుంది. ఇందులో శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దద్యోజనం, శీర లేదా చక్కెరన్నం ఉంటుంది. ఇక రాత్రి స్వామివారికి నివేదించే నైవేద్యాన్ని శయన భోగం అంటారు. ఇందులో మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ తో పాటు వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నాన్ని సమర్పిస్తారు. దీనినే శాకాన్నం అని పిలుస్తారు. రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య శయనభోగం సమర్పిస్తారు.
అల్పాహారాలు కూడా
P.C: You Tube
మూడు పూటలతో పాటు స్వామివారికి అల్పాహారాలు కూడా సమర్పిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన తర్వత అప్పుడే తీసిన చిక్కని ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తర్వాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం ఇస్తారు. తర్వాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాత:కాల ఆరాధన పూర్తవుతుంది. అటు పై సర్వదర్శనం మొదలవుతుంది.
రాజభోగం
P.C: You Tube
అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వ దర్శనం ప్రారంభమవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అర్థరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం అందజేస్తారు. అటు పై ఏకాంత సేవలో భాగంగా నేతితో వేయించిన బాదం, జీడిపప్పులు, తాజా పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.
అన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే
P.C: You Tube
ఇక నైవేద్యాలను ఎలా వండాలి, ఎవరు వండాలి అన్న విషయంతో పాటు ఆ సమయంలో ఎలా ఉండాలన్న విషయం మొత్తం ఆగమశాస్త్రంలో సవివరంగా పేర్కొన్నారు. నైవేద్యం వండే సమయంలో వాసన సోకకుండా నోటికి, ముక్కుకు అడ్డుగా వస్త్రం పెట్టుకొంటారు. స్వామికి సమర్పించేదాకా బయటివారు ఎవరూ నైవేద్యాన్ని కనీసం చూడటానికి కూడా అనుమతించరు. నైవేద్యాన్ని సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. అటు పై నైవేద్యం పెట్టే సమయంలో అర్చకుడు మాత్రమే ఉంటారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు నైవేద్యం పై గ్రాసముద్రతో ప్రసాదన్ని తాకి దానిని స్వామి కుడిచేతికి తాకించి, నోటి దగ్గర తాకుతారు. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు. ముద్దముద్దకీ మధ్య ఔషద గుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని కూడా సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది.