వెంకటాచలంతో సమమైన క్షేత్రంగాని, వేంకటేశునితో సమమైన దేవుడుగానీ ఈ జగత్తులోనే లేరట. తిరుమల ఆ పేరువినగానే మనసు ఆనందభారితమవుతుంది. ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పరమపవిత్ర భావం అలౌకిక ఆనందం మది నిండా పాకుతుంది.
పచ్చటి ప్రకృతితో మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గిరులతో సమున్నతమైన వృక్షరాజాలతో ఆ సదాశివుని జటాజూటంలో వున్న గంగమ్మ తల్లి తిరుమల గిరుల పవిత్రతను తెలుసుకుని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్లు ఉరుకుతూ దుముకుతూ జారే జలధారలతో జలజల పారే జలపాతాలతో చల్లగా సాగే సెలయేరులతో వన్యప్రాణులతో సాక్షాత్తూ ఆ ఆదిశేషుడే చుట్టచుట్టుకుని పడుకున్నట్లుగా వున్న ఈ ఏడుకొండల మీద శ్రీమన్నారాయణుడు వెలసిన పరమపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. అలా ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడ కొండలు, గుట్టలు, చెట్టు, పుట్ట, కొండ, కొన, సెలయేళ్ళు, జలపాతాలు, తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవే. అలాంటి ఒక అద్భుతం తిరుమలలో వెలసిన శిలాతోరణం.
ఇది కూడా చదవండి: బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా?
సహజ శిలాతోరణానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

1.సహజ శిలాతోరణం
శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో ఒక కిలోమీటరు దూరంలో వుంది ఈ సహజ శిలాతోరణం. ధనుస్సు ఆకారంలో వుండే ఈ శిలాతోరణం 1980 వ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో గుర్తించినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ ప్రదేశాన్ని ఆ శ్రీమన్నారాయణుడు భువికేతెంచిన ప్రదేశంగా గుర్తిస్తారు పెద్దలు.
Pc:wikimedia.org

2.స్వామి కొలువుతీరిన ప్రదేశం
శ్రీ వెంకటేశ్వరస్వామి వారు మొట్టమొదటి సారి భూమి పైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాలలో అతి ఎత్తైన పర్వతం. ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు లేదా శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని ఆ తర్వాతి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశాడని మూడవ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న స్వామి కొలువుతీరిన ప్రదేశంలో వేశాడని పురాణ కథనం.
Pc: Tatiraju.rishabh

3.స్వామి వారి వరద హస్తం, కటిహస్తం
ఈ శిలాతోరణం మీద ఎవరూ చెక్కకుండానే సహజసిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామి వారి వరద హస్తం, కటిహస్తం, పాదాలు, గరుడపక్షి, నాగాభరణం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతాయి.
Pc: Shravan Kamath94

4.సహజశిలాతోరణం
ఇక దీనిని భౌగోళిక అద్భుతంగా కూడా చెప్తారు. భౌగోళికంగాను, అధ్యాత్మికపరంగాను కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజశిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయసు
కలిగివుంటుంది అన్నది శాస్త్రఘ్నుల అంచనా.

5.160కోట్ల సంవత్సరాలు
దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమంలో శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని, అలా శిలాతోరణంగా ఏర్పడికూడా 160కోట్ల సంవత్సరాలవుతుందని చెప్తారు.అక్కడక్కడా వున్న చిన్నాచితకా శిలాతోరణాలు కాకుండా సహజసిద్ధంగా ఏర్పడిన పురాతరణ శిలాతోరణాలు మూడేమూడున్నాయని అందులో ఒకటి తిరుమలలోని ఈ సహజ శిలాతోరణమని చెబుతారు.
Pc:Sumit Magdum

6.30000 అడుగులు
250కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి వుండవచ్చును అనేది శాస్త్రఘ్నులు చెప్పే మాట. సముద్రమట్టానికి దాదాపు 30000 అడుగుల ఎత్తులో వున్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది అంటే ఒకప్పుడు అంత ఎత్తులో జలం వుండేది అన్న విషయం తెలుస్తోంది.

7. సముద్రగర్భం
ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్రగర్భంలో వుండేవట. కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్రగర్భం నుంచి బయట పడ్డట్లు తెలుస్తోంది.
Pc:Rajendrayadavpune

8.తిరుమల కొండ
దీనికి ఋజువుగా సముద్రగర్భంలో మాత్రమే వుండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ కూడా తిరుమల కొండలపై లభిస్తాయి అని చెప్తూ వుంటారు.
దెయ్యాలు కట్టిన శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

9. శిలాతోరణం
తిరుమల కొండ మీద వుండే ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు వుంటుంది. ఇక ఇది జీవుల తొలిస్తావరంగా కూడా కొన్ని కథనాలు చెపుతున్నాయి. ఆదిమానవుల ఆనవాళ్ళుగా వారు వాడిన పనిముట్లు, రాతిపైన చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ కనపడతాయి.
Pc:B.Sridhar Raju

10.సూర్యోదయం
ఇక ఈ ప్రదేశపు అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలోనే వెళ్ళవలసి వుంటుంది. ఇక్కడి నుండి సూర్యోదయం చూడటం అద్భుతమైన అనుభూతినందిస్తుంది.
PC:ramesh

11.చక్కటి ఏర్పాట్లు
ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రంగానే వున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు అక్కడ పర్యాటకులు సేదతీరటానికి సహజసిద్ధమైన రాతిసోఫాల్లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేసారు. ఇది ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతంగా మారింది.
Pc:Pappulavenkatesh



Click it and Unblock the Notifications











