విభిన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం మలయత్తూరు. అక్కడి పురాతన నిర్మాణాలు సందర్శకులను చరిత్రపుటల్లోకి తీసుకువెళతాయి. ఆ నిర్మాణ శైలి ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మలయాల రుచులు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
వీటికితోడు ప్రకృతి సిద్దమైన పర్యాటక అందాలు సందర్శకులకు ఆహ్వానం పలుకుతాయి. మరెందుకు ఆలస్యం ప్రశాంతమైన పర్యాటకానికి చిహ్నంగా పేరొందిన మలయత్తూరు విశేషాలను తెలుసుకుందామా?
ప్రశాంతమైన పర్యాటకానికి చిహ్నం.. మలయత్తూరు
కేరళలోని ఎర్నాకులం జిల్లా అంగమలికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది మలయత్తూరు. ఇది ఒక చిన్న గ్రామం. అందమైన కొండలు, నది, ప్రదేశాల కలయికే మలయత్తూరు. ఇక్కడ మలయత్తూరు కొండపైన అతి పెద్ద పురాతన క్యాథలిక్ చర్చి బాగా ప్రసిద్ధి చెందింది. సంవత్సరం పొడుగునా సందర్శకులు ఈ చర్చికి వస్తూనే ఉంటారు. ఇక్కడ తయారయ్యే ఆహారాలు మలయాళీల రుచులుగా ఉంటాయి. చిన్న హోటళ్లు, కాఫీ హౌస్లు ఈ ప్రదేశం ప్రత్యేకత. ఈ ప్రదేశంలో అద్బుతమైన రుచులను చవి చూడవచ్చు. మలయత్తూరు చర్చి ప్రపంచ ఖ్యాతి గాంచింది. ఈ చర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సీజన్తో నిమిత్తం లేకుండా ఈ చర్చికి పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ థామస్ వందల సంవత్సరాల కిందట స్థాపించిన మేరీ విగ్రహం ఉన్న ప్రదేశంలోనే నేటి మలయత్తూరు చర్చి ఉందని చెపుతారు. ఇది భారతదేశంలోని అతి పెద్ద యాత్రాస్థలం. సెయింట్ థామస్ యొక్క అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్ తరువాత మొదటి ఆదివారం నాడు జరుగుతుంది. మలయత్తూరు కొండలపై గల ఈ సంస్థ ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్ది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ చర్చిని గ్రీసు, రోమన్ శిల్ప శైలిలో నిర్మించారు. ఇక్కడ అనేక చెక్కడాలు, పెయింటింగ్లు చర్చి గోడలపై ఉన్న చిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. మలయత్తూరు పర్యటనలో ఈ ప్రసిద్ధ చర్చితో పాటు చూడదగ్గ ప్రదేశాలు ఇంకా ఉన్నాయి.
కోడనాడ్లో అడుగుపెట్టాల్సిందే..!
ఇది కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ముంగుజ్హిలో ఒక ప్రదేశం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది మలయత్తూరు నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, కొచ్చి నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇల్లితోడుకు ఒక వైపున ఉన్న అద్భుతమైన పెరియార్ నదితో, మరొక వైపు ఎత్తైన పర్వతాలతో అద్బుతమైన ప్రకృతి అందాలతో ఊపిరి తీసుకోనివ్వదు. కేరళలో ఏ ఉత్సవం జరిగినా ఏనుగుల ఊరేగింపు గొప్పతనం లేకపోతే అది ఒక అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే కేరళలో ప్రతి ఉత్సవంలో ఏనుగుల ఊరేగింపును గౌరవార్ధకంగా, రాజసంగా భావిస్తారు. ఏనుగులకు కప్రికాడ్కు సమీపంలో అభయారణ్యంలో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే, ఇక్కడి, సీతాకోకచిలుక తోట పర్యాటకులను మెస్మరైజ్ చేస్తుంది. కోడనాడ్ ప్రాంతంలో 25 ఎకరాల్లో జంతువు విశ్రాంతి తీసుకునేందుకు జూ ఏర్పాటు చేశారు. త్రిశూర్ నుండి 49 కిలోమీటర్ల దూరంలో అతిరాప్పిల్లిలో సిల్వర్ స్ట్రోమ్ పార్కు ఉంది. ఈ పార్కు నీటిలో డ్రైవ్, రోడ్ రైడ్స్కు ప్రసిద్ధి చెందినది. పనియేలి పొరు డ్యాం చుట్టూ ఉన్న అడవులు వివిధ జీవ, వృక్ష, జంతుజాలాలకు ఆశ్రయం కల్పిస్తున్నది. డ్యామ్లో బోట్ విహారం మరువలేని అనుభూతి.
పేరొందిన ఆధ్యాత్మిక ప్రదేశం..
కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉంది. ఇక్కడే జగద్గురు ఆది శంకరాచార్యులు జన్మించారు. ఈ గ్రామం పెరియార్ నదికి సమీపంలో ఉంది. ఇక్కడి నుండే శంకరాచార్యులు కాలినడకన దేశమంతటా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు. కాలడి గ్రామం దేశవ్యాప్తంగా పీఠాధిపతులకు ఒక పవిత్ర యాత్రా స్థలం. కాలడి అంటే మలయాళంలో అర్ధం పాద ముద్ర అని. ఈ గ్రామంలో దేవాలయాలు, ఆశ్రమాలు ఉన్నప్పటికీ ఆదిశంకరాచార్యుల జనన స్థలం ప్రముఖంగా చెప్పుకుంటారు. కాలడి గ్రామంలో కంచికామకోటి పీఠం వారు ఎనిమిది అంతస్తుల బృహత్ భవనం నిర్మించారు. ఆది శంకరుల జీవిత చరిత్ర అంతా చిత్రాలలో ప్రదర్శిస్తారు.