విశాఖ తీరంలో.. అఖిల భారత డ్వాక్రా బజార్ సందడి!
సంక్రాంతి పండుగ వేళ.. వస్త్రాలు.. గృహోపకరణాల కోసం కాళ్లరిగేలా షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆకట్టుకునే కళంకారీ వస్త్రాలు.. కొయ్యబొమ్మలు.. తోలు చెప్పులు.. అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి. స్వయం సహాయక ఉత్పత్తులకు ఆదరణ.. ఆర్థిక భరోసా కల్పించేందుకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ సందర్శకులతో కళకళలాడుతోంది. ఎటు చూసినా ఆకర్షించే బొమ్మలు.. ఆధ్యాత్మికత ఉట్టిపడే కళాకృతులు.. గిరిజన సంస్కృతికి అద్దంప
ట్టే శిల్పాలతో సాదర ఆహ్వానం పలుకుతోన్న ఆ ఎగ్జిబిషన్ విశేషాలు తెలుసుకుందాం.
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో గత నెల 27 నుంచి నిర్వహిస్తోన్న అఖిల భారత డ్వాక్రా బజార్ నగర వాసులను కట్టిపడేస్తోంది. ఈ నెల 7 వరకూ జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో స్వయం సహాయక బృందాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. వందల రకాల ఉత్పత్తులు ఒకే చోట లభ్యం కావడం పట్ల సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరుదుగా దొరికే అనేక వస్తువులు ఇక్కడ స్టాల్లలో ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల మహిళలు సైతం ఈ డ్వాక్రా బజార్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
చేనేత ఉత్పత్తులు, హస్త కళలు, ఆహార ఉత్పత్తులను విక్రయించేందుకు ఉచితంగా రెండు వందల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇందులో 64 కౌంటర్లను రాష్ట్రానికి చెందినవారికి కేటాయించగా, మిగిలినవి ఇతర రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, గోవా, హర్యానా, అస్సాం నుంచి కళాకారులు తమ చేతినైపుణ్యాన్ని ప్రదర్శించేలా వస్తువులను ఇక్కడ స్టాల్స్లో ఉంచారు.
షాపింగ్ మాల్స్లో ధరలతో పోలిస్తే..
ఇక్కడ ఆకట్టుకునే గృహాలంకరణ వస్తువులు కొలువుదీరాయి. ప్రపంచస్థాయిలో పేరొందిన కొండపల్లి బొమ్మలు సహా సముద్ర ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. మంగళగిరి పట్టు వస్త్రాలు సహా బీహార్, హర్యానా, అస్సాం కలపతో చేసిన గృహోపకరణాలు కట్టిపడేస్తున్నాయి. తోలు చెప్పులపై వినియోగదారులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని మహిళలు చెబుతున్నారు.
జనపనార ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలపై నగరవాసులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన చేనేత దుస్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని దుఖానదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్లో ధరలతో పోలిస్తే.. ఇక్కడ చవకగానే వస్తువులు దొరుకుతున్నాయని నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
షాపింగ్తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు
రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణా, రాయలసీమ, గోదావరి జిల్లాలకు చెందిన హస్తకళ, ఆహార ఉత్పత్తులు, హరియాణా, తెలంగాణా లెదర్ బ్యాగులు, జార్ఖండ్ దుస్తులు, చిస్ట్, హల్పా సుగంధ ద్రవ్యాలు, మహారాష్ట్ర కాటన్ దుస్తులు, కశ్మీర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఉత్తరప్రదేశ్ చొక్కాలు, ఒడిశా లేస్ వస్తువులు, మట్టి, వెదురు చెక్క బొమ్మలు, బెల్ మెటల్ వస్తువులు, వెస్ట్ బెంగాల్ కాగితం పువ్వులు, అస్సాం కాటన్, సిల్క్ చీరలు, హరియాణా గాజు బొమ్మలు, ఉత్త రప్రదేశ్కు చెందిన ఎంబ్రాయిడరీ దుస్తులను విక్రయిస్తున్నారు.
అంతేకాదు ప్రతిరోజూ సాయంత్రం పలు సాంస్కృతిక, కామెడీ స్కిట్లు, మిమిక్రి, నృత్యం, మ్యాజిక్, వంటి షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఉదయం పది నుంచి రాత్రి 9.30 వరకూ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. మరెందుకు ఆలస్యం అఖిల భారత డ్వాక్రా బజార్లో షాపింగ్కు మీరూ సిద్దమవ్వండి.